Maoists bandh in Mulugu: తెలంగాణ- ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం కర్రెగుట్ట వద్ద ఈ నెల 18న జరిగిన ఎన్కౌంటర్ను బూటకపు ఎన్కౌంటర్గా పేర్కొంటూ.. మావోయిస్టు పార్టీ నేడు ములుగు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో వాజేడు- వెంకటాపురం- భద్రాచలం ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. వెంకటాపురం, వాజేడు మార్గంలో రాత్రి బస్సు సర్వీసులను అధికారులు నిలిపివేశారు.
పోలీసుల మోహరింపు
మావోయిస్టుల హిట్ లిస్ట్లో ఉన్న వారిని పోలీసులు అప్రమత్తం చేశారు. మైదాన ప్రాంతాలకు వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. మావోయిస్టులు బంద్కు పిలుపునివ్వడంతో.. వాజేడు వెంకటాపురం వర్తక వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రధాన రహదారి వెంబడి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఏజెన్సీల్లో భారీగా మోహరించారు.
ప్రకటన విడుదల
వెంకటాపురం మండలం కర్రెగుట్ట వద్ద మంగళవారం(జనవరి 18) న జరిగిన ఎన్కౌంటర్ను నిరసిస్తూ.. నేజు జిల్లా బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఇది బూటకపు ఎన్కౌంటర్గా పేర్కొంటూ.. జేఎండబ్ల్యూపీ కార్యదర్శి వెంకటేశ్ పేరుతో మావోయిస్టులు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ నాయకులను, సర్పంచులను, కాంట్రాక్టర్లను చంపడానికి పథకం రచిస్తున్నారని పోలీసులు పేర్కొనడంలో వాస్తవం ఎంత మాత్రం లేదన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పది మందితో కూడిన తమ దళం సమావేశమైనప్పుడు దొంగచాటుగా దెబ్బతీశారని మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీపం నుంచి ఏకపక్ష కాల్పులు జరిపారని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత అలియాస్ మడకం సింగే, ఇల్లెందు, నర్సంపేట దళ కమాండర్ కొమ్ముల నరేష్, దంతెవాడ జిల్లాకు చెందిన కోవాసీ మూయాల్ అలియాస్ కైలాష్ హతులయ్యారని తెలియజేశారు.
ఇదీ చదవండి: Fever Survey in Telangana: ఫీవర్ సర్వే ఎలా సాగుతోంది ?.. పరిశీలించిన మంత్రులు