రామప్ప రిజర్వాయర్ నీటిమట్టం 36 అడుగుల నుంచి 25 అడుగులకు తగ్గించాలని... ముంపు ప్రాంత ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ లోతట్టు గ్రామాల ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు ములుగు జిల్లా కేంద్రంలోని రామప్ప సరస్సు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయని వాపోయారు. వరద నీటితో పద్దెనిమిది వందల ఎకరాల మేర పంటపొలాలు జలమయం అవుతున్నాయన్నారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వెంకటాపూర్, ములుగు మండలాల్లోని పది గ్రామాల రైతులు ర్యాలీ నిర్వహించి, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభిని కలిసి వినతిపత్రం అందించారు.
పంటచేతికొచ్చే సమయంలో దేవాదుల పైపులైను నుంచి రామప్ప ప్రాజెక్టు నింపడం వల్ల వందల ఎకరాలు నీట మునిగాయని రైతులు పేర్కొన్నారు. దీనివల్ల యాసంగి పంటను పండించలేకపోయామన్నారు. ఈసారైనా రామప్ప సరస్సుకు 25 అడుగుల వరకు మాత్రమే నీరు ఉంచాలని.. అంతకు మించితే పరిసర భూములన్నీ నీటమునిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండాఇరిగేషన్ అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి... రైతులకు హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: CM KCR: హుజూరాబాద్లోని ప్రతీ దళిత కుటుంబానికి రెండునెలల్లో 'దళితబంధు'