MADAPUR DCP: 'మా నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు తలకు గాయమైంది'

author img

By

Published : Aug 28, 2021, 6:17 PM IST

MADAPUR DCP: 'రాయదుర్గం పోలీసులపై వస్తున్న వార్తలు అవాస్తవం'

రాయదుర్గం పోలీసులపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని మాదాపూర్​ డీసీపీ పేర్కొన్నారు. పోలీసులు ఎవరినీ కొట్టలేదని స్పష్టం చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నరేశ్​ తలకు గాయమై మరణించినట్లు వివరించారు.

రాయదుర్గం పోలీసులు కొట్టడం వల్ల నరేశ్​ అనే యువకుడు మరణించాడని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని మాదాపుర్ డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఘటనపై మాదాపుర్ ఏసీపీ రఘునందన్​రావు బృందంతో విచారణ చేపట్టామని వివరించారు. సీసీటీవీ ఫుటేజ్​లను పరిశీలించామన్న ఆయన.. ఎక్కడా పోలీసులు నరేశ్​ను కొట్టిన దాఖలాలు లేవన్నారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నరేశ్ తలకు​ బ్యాండ్ వాహనం తగిలి తీవ్ర గాయాలు కావడంతో మరణించాడన్నారు.​

MADAPUR DCP: 'రాయదుర్గం పోలీసులపై వస్తున్న వార్తలు అవాస్తవం'

'రాయదుర్గం పోలీస్​స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి పీజేఆర్​నగర్​లో ఓ వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్ వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని సాయి అనే వ్యక్తి రాత్రి 11:30కు డయల్ 100కు ఫోన్ చేశారు. దాంతో రాయదుర్గం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బ్యాండ్​ సిబ్బందిని మందలించారు. అనంతరం బెనర్జీ అనే వ్యక్తి మళ్లీ డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో పెట్రోలింగ్​ సిబ్బంది అక్కడకు వెళ్లారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బ్యాండ్ వాహనం నడుపుతున్న గుండప్ప అనే వ్యక్తి వాహనాన్ని తీసే క్రమంలో ముందు ఆగి ఉన్న టిప్పర్​ను ఢీకొట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న బ్యాండ్ యజమాని నరేశ్​ తలకు​ ఆటో ముందుభాగంలో ఉన్న ఐరన్​ కడ్డీ తగిలి పడిపోయాడు. వెంటనే లేచి పెట్రోలింగ్ వాహనం దగ్గరకి వచ్చాడు. ఉన్నట్టుండి కింద పడిపోయాడు.' అని డీసీపీ వివరించారు.

పోలీసులు నరేశ్​ను వెంటనే గచ్చిబౌలిలోని హిమగిరి హాస్పిటల్​కు తరలించారని డీసీపీ పేర్కొన్నారు. పరీక్షించిన వైద్యులు నరేశ్​కు తల భాగంలో గాయం కావడం వల్ల మరణించినట్లు తెలిపారన్నారు. బ్యాండ్​ వాహనం నడిపిన గుండప్ప స్టేట్​మెంట్ రికార్డు చేశామని వివరించారు.

ఇదీ జరిగింది..

రాయదుర్గం పోలీస్​స్టేషన్​ పరిధి గచ్చిబౌలి పీజేఆర్​ నగర్​లో రాత్రి 11:30 గంటలకు బరాత్​​తో ఇబ్బంది పెడుతున్నారని డయల్ 100కు ఫిర్యాదు వెళ్లింది. అక్కడికి వెళ్లిన పోలీసులు బ్యాండును ఆపేయించారు. మరోసారి డయల్ 100కి కాల్ రావడంతో పోలీసులు మళ్లీ అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో బ్యాండ్ యువకులు పరుగులు తీశారు. తప్పించుకునే ప్రయత్నంలో నరేశ్ తలకు బ్యాండ్​ వాహనం ముందుభాగంలో ఉన్న ఇనుప కడ్డీ తగిలి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలయ్యాయి. నరేశ్​ను చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని హిమగిరి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అయితే పోలీసులు దాడి చేయడం వల్లే నరేశ్, గుండప్ప, సంతోష్​లకు గాయాలయ్యాయని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలోనే నరేశ్ ప్రాణాలు కోల్పోయాడన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన డీసీపీ.. నరేశ్​ను పోలీసులు కొట్టలేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: SUSPICIOUS DEATH: పెళ్లి బరాత్​లో యువకుడి మృతి.. అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.