BRS MLAs meeting Against Mallareddy : మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, బేతి సుభాష్రెడ్డి, వివేకానంద్, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు ఈ భేటీలో పాల్గొన్నారు. దూలపల్లిలోని మైనంపల్లి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేల పీఏలు సహా అత్యంత సన్నిహితులను కూడా దూరంగా ఉంచినట్లు తెలిసింది. పార్టీ పదవులు, నియోజకవర్గ అభివృద్ధి విషయాల్లో మంత్రి మల్లారెడ్డి వైఖరిపై వారంతా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు సమావేశమై ఆయా అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
రహస్య భేటీపై ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి రహస్య భేటీ జరగడం లేదని.. పదవులన్నీ ఒక నియోజకవర్గానికే పోవడం గురించి చర్చించామని తెలిపారు. జిల్లా పదవులన్నీ మంత్రి మల్లారెడ్డి ఒక్కరే తీసుకెళ్తున్నారని వాపోయారు. అందరితో మాట్లాడాలని సీఎం చెప్పినా మంత్రి పట్టించుకోవట్లేదని.. కార్యకర్తల ఆవేదన తెలిపేందుకే సమావేశమయ్యామని వెల్లడించారు.
"జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాం. చాలా మందికి పదవులు ఇస్తామని మాట ఇచ్చాం. పదవులన్నీ మేడ్చల్కే వెళ్తున్నాయని కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోంది. కార్యకర్తలు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి విషయంలో అందరినీ కలుపుకుని పోలేదు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. మా నియోజకవర్గాలకు నామినేటెడ్ పదవులు రావట్లేదు. పదవులు ఇప్పిస్తామని గతంలో మా కార్యకర్తలకు హామీ ఇచ్చాం. పదవులన్నీ ఒక్క మేడ్చల్ నియోజకవర్గానికే వెళ్తున్నాయి. మాకెందుకు పదవులు రావట్లేదని కార్యకర్తలు అడుగుతున్నారు. కార్యకర్తలకు న్యాయం జరిగేలా కృషి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది." - బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మేడ్చల్ జిల్లా