BJP Training Classes In Shamirpet: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేటలో బీజేపీ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఈ శిక్షణ తరగతులను ప్రారంభించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యదర్శులు వివిధ జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. శిక్షణ తరగతుల్లో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై చర్చించారు.
ఏకాత్మ మానవతావాదమే బీజేపీ మూల సిద్ధాంతం: ఒకప్పుడు రెండే సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు దేశంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చామని.. మూడోసారి కూడా అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. ఏకాత్మ మానవతావాదమే బీజేపీ మూల సిద్దాంతమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఆలస్యమైనా మూల సిద్ధాంతం ఆధారంగానే తెలంగాణలోనూ అధికారంలోకి రావాలన్నదే పార్టీ లక్ష్యమని బండి సంజయ్ వెల్లడించారు.
భేదాభిప్రాయాలు పక్కన పెడదాం: ప్రపంచంలో అతిపెద్ద సభ్యులు కలిగిన పార్టీ బీజేపీ అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికి అందరం కలిసి పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్లో ఉన్న కొంతమంది రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కుటుంబ పాలన కారణంగా అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు. పారదర్శకంగా కేంద్రప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఓట్ల కోసం హిందూయిజాన్ని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణలో బీజేపీని ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని తెలిపారు. చెప్పుకోవడానికి ఏమీ లేక తెరాస తప్పుడు ప్రచారం చేస్తోందని... 2023ఎన్నికల్లో పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని కిషన్రెడ్డి విశ్వాసం వ్యక్తంచేశారు. మూడ్రోజులపాటు జరగనున్న ఈ శిక్షణా తరగతులకు జాతీయనేతలు కూడా రానున్నారు. పార్టీని ఎలా ముందుకెళ్లాలని తీసుకెళ్లానే విషయంపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. టీఆర్ఎస్ సర్కార్ విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే అంశంపై పార్టీ నేతలు స్పష్టత ఇవ్వనున్నారు.
"బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎప్పుడో వచ్చేవాళ్లం. అడ్డదారులు తొక్కి దేశంలో, రాష్ట్రాలలో అనేక రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. కానీ బీజేపీ సిద్ధాంతాలను నమ్ముకొంది. అందుకోసం ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకొంది. అందుకే దేశంలో అధికారంలోకి రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. రాబోయే రోజుల్లో ఈ మూల సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంగా ఉన్నామని చెప్పడమే ఈ శిక్షణా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం." - బండి సంజయ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
"ఈరోజు ఇక్కడ అధికారంలో ఉన్న రాజకీయపార్టీ దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉందో దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పార్టీని విమర్శించి గెలవాలనే చూస్తున్నారు. వారు చేసిన పనులు చెప్పే పరిస్థితుల్లో లేరు. ఎట్టి పరిస్థితుల్లో 2023 తెలంగాణలో మార్పు రానుంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని దుర్వినియోగాలు చేసినా తెలంగాణలో మార్పు రావడం తథ్యం." - కిషన్రెడ్డి కేంద్రమంత్రి
ఇవీ చదవండి: కేసీఆర్ అహంకారం హింసా ప్రవృత్తిగా మారింది: తరుణ్చుగ్
ఈయన 'స్కెచ్' వేస్తే నేరస్థులకు వణుకే.. 500 మందిని పట్టించిన నితిన్!