Paddy procurement issue: ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కుప్పలు.. లారీల కొరతతో తిప్పలు

author img

By

Published : Nov 20, 2021, 5:29 PM IST

Paddy procurement issue in telangana

ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు(Paddy procurement issue) అవస్థలు పడుతున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వానలు పడుతుండటంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. మిల్లులకు తరలించడంలో ఆలస్యం వల్ల కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. టన్నుల కొద్దీ ధాన్యం కుప్పలుగా పోసి... త్వరగా కొనాలంటూ అన్నదాతలు నిర్వాహకుల కాళ్లావేళ్లా పడుతున్నారు. మెదక్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల వద్ద "ఈటీవీ భారత్​" పరిశీలన చేయగా.. రైతులు తమ ఇబ్బందులు ప్రస్తావించారు.

మొగులు మబ్బుపట్టింది. సూర్యుడి జాడలేదు. కల్లాల నుంచి తెచ్చిన వడ్ల కుప్పలను చూస్తుంటే గుండె దడదడలాడుతోంది. ఒక వర్షం... ఆరు నెలల కష్టాన్ని నీటిపాలుచేస్తోంది. కొనుగోళ్లలో జాప్యం.... చెమటోడ్చి పండించిన పంటను(Paddy procurement issue) పనికిరాకుండా చేస్తోంది. నోటికాడికొచ్చిన ముద్ద ఎక్కడ చేజారుతుందోనని రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఓ వైపు వర్షాలు, మరో వైపు కొనుగోళ్లలో నిర్లక్ష్యంతో ఐకేపీ కేంద్రాల వద్ద అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు.

వడ్లు అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు

రోజుల తరబడి

మెదక్ జిల్లాలో ఈ ఏడాది 375 కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. దీపావళి తర్వాత కొనుగోళ్లు(Paddy farmers problems) ప్రారంభమయ్యాయి. కానీ సాంకేతిక సమస్యలు, లారీల కొరత, ఖాళీ సంచులు లేకపోవడం... ఇలా ఎన్నో కారణాలతో ధాన్యం కొనుగోలులో తీవ్రజాప్యం జరుగుతోంది. దీంతో ధాన్యం అమ్ముకునేందుకు రోజుల తరబడిగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పులు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేంద్రాల వద్ద ధాన్యాన్ని కాపాడుకునేందుకు పడరాని కష్టాలు పడుతున్నారు. వరి కుప్పలపై టార్పాలిన్​ కవర్లు కప్పుతూ.. కాపాడుకుంటున్నా.. ఇప్పటికే చాలాచోట్ల పంట వర్షార్పణమైంది. దీంతో ధాన్యం త్వరగా కొనాలంటూ అన్నదాతలు.... నిర్వాహకుల కాళ్లావేళ్లా పడుతున్నారు.

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు దాటింది. కాంటాలు వేసినా.. వీటిని మిల్లులకు తరలించేందుకు ఒక్క లారీ కూడా రావడం లేదు. లారీల కొరత, గన్నీ బ్యాగులు లేక అవస్థలు ఎదుర్కొంటున్నాము. ఓ వైపు మబ్బు పట్టడంతో ఆరబోసిన ధాన్యం పచ్చిగా అయిపోతుంది. వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిపోతోంది. హమాలీల ఖర్చు, కిరాయిలు భరించలేకపోతున్నాం. ఆరుగాలం శ్రమించిన పంట నీటి పాలయ్యే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలి. -రైతుల గోడు

లారీల కొరత

మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు అన్ని ఐకేపీ కేంద్రాల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ధాన్యం కొనాలంటూ... నిత్యం ఏదో ఒక చోట రోడ్డెక్కి మొరపెట్టుకున్నా తమ గోడు ఎవరికీ పట్టడంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనేందుకు తాము(Paddy procurement issue in telangana) సిద్ధంగా ఉన్నా.. లారీల కొరతతో కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు..

తాము ఇలా ఇబ్బందులు పడుతుంటే.. నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తాపై దాదాపు రెండున్నర కేజీలు తరుగు తీస్తున్నారని ఆరోపించారు. లారీల కొరత సాకుగా చూపి ఒక్కో బస్తా మీద మూడు రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పారు. వానలకు ధాన్యం తడిచి తాము నష్టపోకముందే వడ్లు కొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: RICE CROP DAMAGE 2021 : అకాల వర్షం.. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.