నేటి నుంచి దేవి శరన్నవరాత్రోత్సవాలు.. ఒక్కో క్షేత్రానికి ఒక్కో విశిష్టత

author img

By

Published : Oct 7, 2021, 7:16 AM IST

devi sarannava ratrulu

‘సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే..’ అని వేనోళ్ల పొగిడే దేవి శరన్నవరాత్రోత్సవాలు.. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో అంగరంగ వైభవంగా నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఆలయ కమిటీలు, దేవాదాయ శాఖ తగిన ఏర్పాట్లు చేశారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి అమ్మవారిని దర్శించుకొని అర్చించుకునేందుకు భక్తులు విచ్చేస్తారు. ఒక్కో ఆలయ క్షేత్రానిది ఒక్కో విశేషం. ఒకటి అర్చనల్లో, మరొకటి నైవేద్యాల సమర్పణలో, ఇంకొకటి అలంకరణలో.. ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ఆలయాలు చతుష్షష్టి పూజలు, పారాయణాలు, వేదమంత్రోచ్ఛారణలతో భక్తులను దృశ్యపరంగా, వినసొంపుగా అలరించనున్నాయి.

  • వనదుర్గ.. ఘన శోభ

రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఉత్సవ శోభ సంతరించుకోనుంది. దేవాలయంలో దేవి శరన్నవరాత్రులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలయ ఈవో సార శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు.

గోకుల్‌ షెడ్‌లో పూజలు
నవరాత్రోత్సవాలను గోకుల్‌షెడ్‌లో నిర్వహించేందుకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీపాలు, రంగురంగుల కాగితాలు, అరటి కొమ్మలు, తోరణాలతో అలంకరించారు. సింగూరు నీరు ప్రవహిస్తుండటంతో ఈసారి ప్రధానాలయం జలదిగ్బంధంలో ఉంది. వరద తగ్గకపోతే రాజగోపురం వద్ద నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా షెడ్డులో ప్రతిష్ఠిస్తారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవాలు ప్రారంభించనున్నారు. అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో దర్శనమివ్వనుంది. వరుసగా శైలపుత్రి, మహాలక్ష్మి, చంద్రఘంట, కూష్మాండ, కాత్యాయని, సరస్వతి, మహాగౌరి, సిద్ధిరాత్రి, శ్రీరాజరాజేశ్వరి రూపాల్లో అలంకరిస్తారు. ఆరో రోజున వనదుర్గకు బోనాలు సమర్పిస్తారు.

  • విద్యాసరస్వతి.. నవార్చన ధాత్రి


విద్యుత్తు కాంతుల్లో వర్గల్‌ క్షేత్రం

వర్గల్‌: సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం శంభుగిరి కొండలలో వెలసిన విద్యాసరస్వతి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయం ముస్తాబయింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ నెల 7 గురువారం నుంచి తొమ్మిది రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జరిపించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్‌ యాయవరం చంద్రశేఖరశర్మ తెలిపారు. హైదరాబాద్‌కు 50 కి.మీ. దూరమే ఉండటంతో జంట నగరాల నుంచి ఎక్కువగా వచ్చి అక్షరాభ్యాసాలు చేయిస్తారు. సరస్వతి అమ్మవారి జన్మనక్షత్రం మూల సందర్భంగా ప్రతి నెల విశేష పూజలు జరుగుతాయి. నేటి నుంచి వరుసగా బాలత్రిపుర సుందరి, గాయత్రి, లలిత, అన్నపూర్ణ, మహాలక్ష్మి, సరస్వతి, దుర్గ, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అవతారాల్లో దర్శనమిస్తారు. మహాభిషేకం, చతుష్షష్టి పూజ, పారాయణాలు నిర్వహిస్తారు.

  • దశాబ్ద కాలం.. కాపాడేందుకు ఉత్సవం

వెలుగుల్లో పెద్దశంకరంపేట కోట

పెద్దశంకరంపేట: రాజ్యాలు పోయినా వారు నిర్మించుకున్న కళా సౌధాలు నేటి తరాలకు చారిత్రక సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పెద్దశంకరంపేటలోని చారిత్రక శంకరమ్మ గడికోటను కాపాడుకోవాలనే లక్ష్యంతో గ్రామస్థులు ముందుకొచ్చి.. పదేళ్లుగా దేవి నవరాత్రోత్సవాలు నిర్వహిస్తూ కొత్త కళ తీసుకొస్తున్నారు. 18వ శతాబ్దంలో రాణి శంకరమ్మ సంస్థానంలో నల్లరాతి, డంగు సున్నం ఉపయోగించి 40 అడుగుల ఎత్తులో ఈ కోటను నిర్మించారు. అది శిథిలం కాకుండా ఉండేందుకు ఆషాఢమాసంలో మహంకాళి బోనాలు, దసరా సందర్భంగా అమ్మవారి ఉత్సవాలు చేస్తున్నారు. ఉత్సవ కమిటీగా ఏర్పడి పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. పురాతన కట్టడాలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించడంతో స్థానికుల్లో ఆశలు నెలకొన్నాయి. నిధులు వెచ్చించి పర్యాటక ప్రదేశంగా చేయాలని కోరుతున్నారు.

  • అఖండ జ్యోతి.. ఒడి బియ్యం..

తాండూరులో కాళికాదేవి

తాండూరు టౌన్‌: తాండూరులోని కాళికాదేవి అమ్మవారి ఆలయంలో ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారుగా 400 ఏళ్ల క్రితం పురాతన ఆలయమిది. ప్రజలు గ్రామ దేవతగా కొలుస్తున్నారు. ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. స్థానికమే కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో ముస్తాబు చేశారు. రోజూ రాత్రి 8 గంటలకు అమ్మవారికి మంగళ హారతి ఇస్తారు. రోజొక ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తారు. అఖండ జ్యోతి పారాయణం, ఒడి బియ్యం సమర్పణ, అక్షరాభ్యాసం, భజనలు, పల్లకి సేవ, దసరా వేడుకలతో తొమ్మిది రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తారు.

  • గిరిజన పుత్రులు.. భవాని దీక్షలు..

కంది, నారాయణఖేడ్‌: గిరిజన తండాలలో భవాని మాత దీక్షలు ‘జై భవానీ మాత.. జై సేవలాల్‌.. జై రాంరావు మహరాజ్‌’ అంటూ భక్తిశ్రద్ధలతో పూజలు కొనసాగుతున్నాయి. మద్యపానానికి, అబద్ధాలకు దూరంగా సన్మార్గంలో తమను నడిపించేందుకు దీక్షలు చేపడతామని వారు చెబుతున్నారు. 41, 21, 11 రోజుల్లోనూ దీక్ష తీసుకుంటారు. ఎర్రని చొక్కా, తెల్లని ప్యాంటు, లుంగీ, గులాబి కండువా, రుద్రాక్షమాల ధరిస్తారు. ఇళ్లకు దూరంగా ఉంటారు. విజయ దశమి రోజున మహారాష్ట్రలోని పౌరాలో కొలువైన అమ్మవారిని దర్శించుకుని దీక్షలు విరమిస్తారు. గురువు సంత్‌ తపస్వి శ్రీరాంరావు మహరాజ్‌ ఆదేశాల మేరకు నియమాలు పాటిస్తారు. రోజూ హోమం, ఉపవాసం, భజన ఉంటాయి. ప్రతి ఏడాది జిల్లాలో 800 తండాల్లో 20 వేలకు పైగా భవాని సేవాలాల్‌ దీక్షలు తీసుకుంటారని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జైపాల్‌నాయక్‌ తెలిపారు. ఆధునిక, సాంకేతికాలు సమాజాన్ని ముంచెత్తుతున్నా యువ గిరిజనుల్లో ఆధ్యాత్మిక చింతన రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిఏటా దసరాకు ముందు దీక్షలు చేపడతారు. చేతనైన సామగ్రి సాయం పేదలకు చేస్తుంటారు. దీక్షలు ముగిసే వరకు భోగ్‌భండార్‌లో భాగంగా భవాని మాత మందిరాల ముందు గోతులు తవ్వి కర్రలతో మంటలు మండిస్తారు. రాగి పాత్రలో రవ్వ, చక్కెర, ఆవు నెయ్యి, పదార్థాలో పాయసం వండుతారు. పాయసాన్ని మంత్రోక్తంగా అగ్నికి ఆహుతినిస్తారు.

విజయాలనిచ్చే ‘దుర్గ’

మర్పడ్గలో..

కొండపాక: కొండపాక మండలం మర్పడ్గలో విజయదుర్గకు నవరాత్ర వైభవం నేటి నుంచి ప్రారంభం కానుంది. వెయ్యేళ్ల క్రితం నిర్మితమైన సంతాన మల్లికార్జునస్వామి క్షేత్రంలో వెలసిన విజయదుర్గ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ భక్తులకు కొంగుబంగారమైంది. క్షేత్రనిర్వాహకుడు, దేవి ఉపాసకుడు చెప్పెల హరినాథశర్మ నేతృత్వంలో పదిహేనేళ్ల క్రితం కేసీˆఆర్‌, వెదురుపాకగాడ్‌ ఆధ్వర్యంలో సహస్ర చండీయాగం జరిగింది. పన్నెండేళ్ల క్రితం కేసీఆర్‌ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ప్రతి నెల మూల నక్షత్రం రోజు చండీ యాగం.. వంద నెలలు పూర్తి కాగానే నవావరణ హోమం నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ ఉద్ధృతిలోనూ నిబంధనలు పాటిస్తూ యాగం చేశారు. ఆశ్వీయుజంలో నవరాత్రులు.. కార్తీకంలో వార్షికోత్సవం.. మాఘంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రానికి సిద్దిపేట నుంచి చేరుకోవచ్చు.

  • దినమొక వర్ణం.. ‘కేతకి’లో విశేషం..


కేతకి సంగమేశ్వరస్వామి ఆలయం

ఝరాసంగం: హైదరాబాద్‌ నుంచి ముంబయికి వెళ్లే జాతీయ రహదారిపై జహీరాబాద్‌కు 15 కి.మీ. దూరంలో ఝరాసంగం శ్రీకేతకి సంగమేశ్వరస్వామి ఆలయం నెలకొంది. శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తారు. ఆలయ పాలక మండలి, దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు భారీగా వస్తారు. రోజూ ఒక వర్ణం చీరను దుర్గకు అలంకరిస్తారు. వరుసగా పసుపు, నీలం, గంధం, ఆకుపచ్చ, గులాబి, ఊదా, తెలుపు, ఎరుపు, కాషాయం బంగారు రంగుల్లో వస్త్ర ధారణతో భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. రోజూ ఉదయం 10 నుంచి దంపతులతో హోమం చేయిస్తామని ఈవో శ్రీనివాసమూర్తి చెప్పారు.

  • చాముండి.. దర్శనం సులభమండీ..

మంజీరా తీరాన చాముండేశ్వరి గుడి

చిలప్‌చెడ్‌: మంజీరా నదీ తీర ప్రదేశంలో చాముండేశ్వరి మాత ఆలయం వెలసింది. చిలప్‌చెడ్‌ మండల పరిధి చిట్కుల్‌ గ్రామ శివారులో ఉన్న ఈ గుడిలో అమ్మవారు 11 అడుగుల ఎత్తు, జ్వాల కిరీటం, 12 హస్తాలతో శాకంబరిగా, శాంతస్వరూపిణిగా దర్శనమిస్తోంది. భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకోగానే ఎంత దూరం ఉన్నవారికి అయినా అమ్మవారి దర్శన భాగ్యం కలగడం ఇక్కడి ప్రత్యేకత. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుంచి భక్తులు తరలివస్తారు. ఆలయ వార్షికోత్సవం, దేవీ శరన్నవరాత్ర వేడుకలు ప్రతి ఏటా నేత్రపర్వంగా సాగుతాయి. వేయి కడవల నీటితో మొదటి రోజు అభిషేకిస్తారు. నిత్య పారాయణాలు, హోమం, కుంకుమార్చన చేస్తారు. రోజూ కొత్త అలంకరణలో దర్శనమిస్తారు.

  • వీరభద్రకాళీ.. శరణు శరణు..

బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయం

గుమ్మడిదల: వీరన్నగూడెం (బొంతపల్లి) శ్రీవీరభద్రస్వామి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్‌ గటాటి భద్రప్ప, ఈఓ శశిధర్‌ తెలిపారు. భద్రకాళి అమ్మవారిని వరుసగా బాలత్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలిత, మహాలక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, మహాకాళి అలంకరణలో భక్తులను అలరిస్తారు. దసరా రోజున సాయంత్రం శమీ పూజ చేస్తారు. కానుకుంట మహంకాళి అమ్మవారి ఆలయంలో రోజూ ప్రత్యేకంగా నైవేద్యాలు సమర్పిస్తామని అర్చకులు రామశర్మ, దీప్తిశర్మ చెప్పారు.

ఇదీచూడండి: Bathukamma celebrations: ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.