మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల పరంపర - మంచిర్యాల, క్యాతనపల్లి పురపాలకల్లో అలజడి
No Confidence Motions in Mancherial District Municipalities : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకున్న దగ్గర నుంచి మున్సిపాలిటీలలో అవిశ్వాసాల పరంపర కొనసాగుతోంది. తాజాగా మంచిర్యాల, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి పట్టుపట్టారు.

Published : January 11, 2024 at 8:39 PM IST
No Confidence Motions in Mancherial District Municipalities : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో మున్సిపాలిటీలలో పాలకవర్గాలపై అవిశ్వాస తీర్మానాలు మొదలయ్యాయి. మంచిర్యాల పట్టణంలోని మున్సిపాలిటీ(Municipality) పాలక వర్గంపై కాంగ్రెస్ మెజారిటీ కౌన్సిలర్లు నెగ్గే విధంగా ఉండడంతో ఛైర్మన్ రాజయ్య, వైస్ ఛైర్మన్ ముఖేశ్లు ముందుగానే రాజీనామా చేశారు. మంచిర్యాల పురపాలక కార్యాలయంలోని ఆర్డీఓ వి. రాములు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బల నిరూపణ జరిగింది.
మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో 27 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్(Congress) వైపు తమ బల నిరూపణ చేశారు. దీంతో మంచిర్యాల మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు కాంగ్రెస్ పరం కానున్నాయి. ఛైర్మన్గా రావుల ఉప్పలయ్య, వైస్ ఛైర్మన్గా మహేశ్లను ఎన్నుకోనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీనిపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
ఈ సమావేశంలో మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని నస్పూర్, లక్షెట్టిపేట మున్సిపాలిటీలలో త్వరలోనే అవిశ్వాస తీర్మానాలు జరుగుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచాయని, మంచిర్యాలలో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న పనులను పరిష్కారం దిశగా మొదలు పెట్టామని అన్నారు. మంచిర్యాల ఫ్లైఓవర్పై గుంతలు గుంతలుగా ఉన్న రహదారిని పూర్తి చేశామని, దండేపల్లి మండలంలోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకాన్ని లీకేజీలు లేకుండా పునఃప్రారంభించామని 20వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.
No Confidence Motion Against Chairman Vijayalakshmi : సమావేశంలో కంటతడి పెట్టుకున్న ఛైర్మన్
క్యాతనపల్లి పురపాలకలో అవిశ్వాస తీర్మానం : అలాగే మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలక బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఛైర్పర్సన్ జంగం కళ, వైస్ ఛైర్మన్ సాగర్ రెడ్డిపై అవిశ్వాసం(No Confidence Motion) ప్రవేశపెట్టాలని జిల్లా పాలనాధికారి బదావత్ సంతోశ్కు అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు వినతి పత్రం అందజేయడం చర్చనీయాంశమైంది. పురపాలకలో మొత్తం 22 మంది కౌన్సిలర్లు ఉండగా వారంతా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిగిలిన వారిలో 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టాలని పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. కౌన్సిల్ సమావేశాల్లో వారు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతో విసుగు చెందామని వాపోయారు. అలాగే అన్ని వార్డులకు సమానంగా అభివృద్ధి పనులను కేటాయించకుండా, అభివృద్ధిని అడ్డుకుంటుండడం వల్లే అవిశ్వాసం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
'కాగజ్నగర్ మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్పై అవిశ్వాస తీర్మానం'
బీఆర్ఎస్కు కొత్త తలనొప్పి.. మున్సిపాలిటీల్లో పెరుగుతోన్న అసంతృప్త గళాలు..

