అమలులో చతికిల పడుతోన్న 'మన ఊరు-మన బడి'.. లక్ష్యం చేరేనా..?

author img

By

Published : Jul 21, 2022, 4:18 PM IST

అమలులో చతికిల పడుతోన్న 'మన ఊరు-మన బడి'.. పనులు ఎప్పటికి పూర్తయ్యేనో..?

సర్కారీ బళ్ల బలోపేతమే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి పథకం అమల్లో చతికిల పడుతోంది. పథకం కింద చేపట్టాల్సిన 12 రకాల పనులు పాఠశాలలు తెరిచేలోపే పూర్తై.. విద్యార్థులకు అందుబాటులోకి రావాల్సి ఉండగా.. ఇప్పటికీ పనులెక్కడా పూర్తి కాలేదు.

అమలులో చతికిల పడుతోన్న 'మన ఊరు-మన బడి'.. లక్ష్యం చేరేనా..?

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో 'మన ఊరు.. మన బడి' కింద చేపట్టాల్సిన పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా తయారయ్యాయి. 3,139 పాఠశాలలు ఉండగా.. 1099 పాఠశాలలను తొలి విడత ఎంపిక చేశారు. చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిలో 1,042 పాఠశాలలకు విద్యుదీకరణ, మరమ్మతులు, తాగునీటి సౌకర్యం పనులకు పరిపాలన అనుమతులు రాగా.. పనులెక్కడా పూర్తి కాలేదు. 520 పాఠశాలల్లో అసలు పనులే మొదలు కాలేదు. ఇప్పటికీ పరిపాలన అనుమతులు లభించని పాఠశాలలు.. ఉమ్మడి జిల్లాలో 17 ఉన్నాయి. బళ్లు తెరిచే సమయానికే పూర్తి కావాల్సిన పనులు.. విద్యా సంవత్సరం ముగిసే నాటికీ పూర్తయ్యేలా కనిపించడం లేదు.

రూ.30 లక్షలకు పైబడిన పనులు చేపట్టాల్సి ఉంటే.. టెండర్ పిలవాల్సి ఉంటుంది. టెండర్ ద్వారా పనులు చేపట్టేందుకు స్పందన కరవైంది. పాఠశాలలు తెరిచే సమయానికే అన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది. జరిగిన జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కో మండలంలో కనీసం రెండు పాఠశాలలనైనా జూన్-30 నాటికి 100 శాతం పనులు పూర్తి చేసి నమూనాగా అభివృద్ధి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అలా ఎంపిక చేసిన రెండు పాఠశాలల్లోనూ పనులు ఇప్పటికీ నత్తనడకనే కొనసాగుతున్నాయి. 12 రకాల పనుల్లో పాఠశాలకు రంగులు, డ్యూయల్ డెస్కులు, డిజిటల్ పరికరాలు, ఫర్నీచర్.. రాష్ట్రస్థాయి నుంచే పంపాల్సి ఉండగా వాటి టెండర్లు ఖరారు కాకపోవడంతో ఆ పనులు సైతం ఆగిపోయాయి. దీంతో 100 శాతం పనులు పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి గండి పడింది.

అందని పుస్తకాలు..: మన ఊరు-మన బడి పనులే కాకుండా మిగతా పాఠశాలల్లో అన్ని పనుల్లో జాప్యం జరుగుతుంది. పాఠశాలలు ప్రారంభమై.. నెల రోజులైనా పాఠ్య పుస్తకాలు అందలేదు. పాత సిలబస్​తోనే పాఠాలు చెబుతున్నారు. విద్యార్థులకు అందించాల్సిన యూనిఫామ్ ఊసేలేదు. విద్యుత్​ బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో సగం పాఠశాలలలోని తరగతి గదులు అంధకారంలో ఉన్నాయి.

చర్యలు తీసుకుంటాం..: పనుల తీరుపై జోగులాంబ గద్వాల డీఈవో సిరాజొద్దీన్​ను సంప్రదించగా.. 41 పాఠశాలల్లో టెండర్ల ద్వారా పనులు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. మిగిలిన అన్ని చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ జిల్లాలో 134 పాఠశాలలు మినహా మిగిలిన పాఠశాలల్లో టెండర్ల ద్వారా పనులు చేపడుతున్నామని వనపర్తి డీఈవో రవీందర్ వెల్లడించారు.

ఇవీ చూడండి..

నూతన ఆవిష్కరణల్లో రెండో స్థానంలో తెలంగాణ

పిడుగుపాటుకు ఒక్కరోజే 14 మంది బలి.. సీఎం విచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.