భారత్ జోడో యాత్రతో పాలమూరు కాంగ్రెస్‌లో జోష్‌.. పునర్వైభవం వచ్చేనా.?

author img

By

Published : Nov 21, 2022, 3:41 PM IST

Congress Party

Congress Party Situation in Palamuru District: పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌కు పునర్వైభవం వస్తుందా? ఇటీవల ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే మొదలైంది. మక్తల్ నుంచి షాద్‌నగర్‌ వరకూ జనం నుంచి మంచి స్పందన వచ్చింది. శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది టికెట్లు ఆశించడం, గ్రూపు రాజకీయాలు, పార్టీకి సమస్యగా మారాయి. వీటన్నింటినీ అధిగమించి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి పునర్వైభవం వస్తుందా అనే అంశంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

భారత్ జోడో యాత్రతో పాలమూరు కాంగ్రెస్‌లో జోష్‌

Congress Party Situation in Palamuru District: పాలమూరు జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్‌కు కాస్త పట్టున్న జిల్లా. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14 శాసనసభ నియోజక వర్గాలుంటే... 2009 ఎన్నికల్లో 3స్థానాలు, 2014 ఎన్నికల్లో 5స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. వైఎస్ హయాంలో పాలమూరు నేతలు... జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ మంత్రులుగా పనిచేశారు. మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన జైపాల్‌రెడ్డి యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా చక్రం తిప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ పాలమూరు నేతల హవా కొనసాగింది. అలాంటి కాంగ్రెస్ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రాభవం కోల్పోతూ వస్తోంది.

ప్రస్తుతం పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ తరపున ఒక్క శాసనసభ్యుడు లేరు. 2018లో కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున అక్కడ పోటీ చేసి గెలిచిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎన్నికల తర్వాత తెరాసలో చేరారు. జిల్లాలో కీలకనేతగా ఉన్న డీకే అరుణ ఎన్నికల తర్వాత భాజపాలో చేరారు. అలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పట్టు కోల్పోతూ వస్తోంది. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్‌లో కొంత ఊపు కనిపించింది. ఇటీవల ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభంకావడం శ్రేణుల్లో కొత్త ఉత్సహాన్ని నింపింది. జోడోయాత్రకు జనం స్పందన కనిపించడం పార్టీకి సానుకూలంగా మారింది. కానీ మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలుకావడం శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో హస్తం పార్టీకి పునర్వైభవం వస్తుందా అన్న అంశం చర్చ సాగుతోంది.

ఎవరికి టికెట్ దక్కుతుందో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున ఎవరికి టికెట్టు దక్కుతుందో స్పష్టత కరవైంది. గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా... ఎవరిదారిలో వాళ్లు నియోజకవర్గంలో సొంత ఇమేజ్‌ను పెంచుకునేందుకు కార్యక్రమాలు మొదలుపెట్టారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఢీకొనే అభ్యర్ధి పార్టీలో కరవయ్యారు. జడ్చర్లలో అనిరుధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ మధ్య వర్గపోరు సాగుతోంది. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవికి సైతం జడ్చర్లపై మంచిపట్టుంది. వీరిలో ఎవరికి టికెట్ దక్కుతుందో తెలియక శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.

దేవరకద్రలో జీఎంఆర్, ప్రదీప్‌గౌడ్‌, కొండా ప్రశాంత్‌రెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరిమధ్య శ్రేణులు గ్రూపులుగా విడిపోయాయి. నారాయణపేటలో శివకుమార్ పోటీ పడుతున్నా... కొన్ని ఆరోపణల నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తొలగించారు. టికెట్ దక్కుతుందో లేదో అనుమానమే. మక్తల్‌లో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ వీరారెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. తెదేపాకి చెందిన కీలకనేత కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారంతో.. వాళ్లిద్దరిలోనూ టికెట్ దక్కడంపై అనుమానాలున్నాయి. కొల్లాపూర్‌లో జగదీశ్వర్‌రావు, అభిలాశ్‌రావు మధ్య పోటాపోటీ సాగుతోంది. కల్వకుర్తిలోనూ ఓ ఎన్​ఆర్​ఐ కాంగ్రెస్ టికెట్టు ఆశిస్తూ నియోజకవర్గంలో ఇప్పటికే సేవా కార్యక్రమాలు విస్తృతం చేశారు. ఇలా ఒక్కో నియోజకవర్గంలో ఒకరిద్దరికి మించి ఎమ్మెల్యే అభ్యర్దులు ఉండటం పార్టీకి తలనొప్పిగా మారుతోంది.

ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. తెరాస, భాజపాతో... ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గట్టిపోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రూపు రాజకీయాలు హస్తం పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. టిక్కెట్ ఎవరికిస్తారో ముందే భరోసా ఇస్తే శ్రేణులంతా కలిసికట్టుగా ముందుకు సాగొచ్చని అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. టికెట్‌ దక్కుతుందో లేదోనన్న అనుమానంతో కొందరు ఇతర పార్టీలతోనూ అంతర్గతంగా మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానేనని జనం భావిస్తే హస్తం పార్టీ అసంతృప్త నేతలు కమలదళంలోకి వలసలు సాగొచ్చని అంచనా. ఆ పార్టీలోనూ బలమైన అభ్యర్ధులు లేకపోవడం వల్ల... కాంగ్రెస్ నుంచి కాషాయం పార్టీలోకి తలుపులు ఎప్పటికీ తెరచే ఉంటాయని భావిస్తున్నారు. చివరి నిమిషంలో టిక్కెట్లు ఖరారు చేస్తే అసంతృప్తులు సైతం పార్టీకి నష్టం చేసే అవకాశం ఉంది. అందుకే ముందుగానే అభ్యర్ధుల విషయంలో స్పష్టతకొస్తే భవిష్యత్తులో ఫలితాలు బాగుంటాయనే కాంగ్రెస్‌ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.