Mallaiah Cheruvu : మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం చెన్నయ్యపల్లి గ్రామపంచాయతీ పరిధిలో.. మూడు తండాలు ఉన్నాయి. గండీడ్ నుంచి ఆ తండాలకు వెళ్లాలంటే ఉన్నది ఒక్కటే మార్గం. అదే మల్లయ్య చెరువు. ఆ అలుగు దాటి చెరువు కట్టపైనుంచి వెళ్లాలి. కానీ వానాకాలంలో చెరువు నిండి అలుగుపారితే 200 కుటుంబాలు ఉన్న ఆ తండాలకు రాకపోకలు నిలిచిపోయినట్లే. తండాల నుంచి నిత్యం జనం ఏదో పనిమీద ఆ మార్గం గుండా ప్రయాణించాల్సిందే.
విద్యార్ధులు రోజు అలుగు దాటి పాఠశాల, కాలేజీకి వెళ్లాల్సిందే. మూడు తండాలకు కలిపి చెన్నయ్యపల్లిలో ప్రాథమిక పాఠశాల ఉండగా.. ఉన్నత పాఠశాల, కళాశాల విద్య కోసం గండీడ్కు విద్యార్ధులు వెళ్తుంటారు. అలుగు పారిందంటే బడులకు సెలవేనని చెబుతున్నారు. నిత్యం నీరుపారి పాకురు చేరడంతో సైకిళ్లు, ద్విచక్రవాహనాలు , అదుపుతప్పి కిందపడి ప్రమాదాలు జరుగుతున్నాయి. నడుచుకుంటూ వెళ్లే వాళ్లు జారి పడిపోయిన ఘటనలున్నాయి.
ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు మనుషులు, వాహనాలు సైతం కొట్టుకుపోయిన సందర్భాలూ లేకపోలేదు. వానాకాలమైనా, ఎండాకాలమైనా ఆ రహదారి ప్రమాదకరంగా మారిందని అంటున్నారు. అలుగుసమస్య పరిష్కరించాలని ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా ఫలితంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చెన్నయ్యపల్లెకు ప్రత్యామ్నాయ రహదారి లేదా అలుగు వద్ద వంతెన నిర్మించాలని వారు కోరుతున్నారు.
"మేం ఎక్కడికి వెళ్లాలన్న ఇదే దారి. విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది అలుగులో కొట్టుకుపోయారు. గత 50సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి వంతెన నిర్మించాలి." - స్థానికులు