కిలిమంజారోను అధిరోహించిన గిరిజన యువకుడు

author img

By

Published : Sep 1, 2021, 4:43 PM IST

kilimanjaro

ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా లక్ష్యమే శ్వాసగా సాగిపోయాడు ఆ గిరిజన యువకుడు. అందుకే ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన కిలిమంజారోను అధిరోహించి ఔరా అనిపించారు. పర్వతారోహణ సమయంలో ఎన్ని అవరోధాలు వచ్చినా.. కిలిమంజారోపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే సంకల్పంతో లక్ష్యాన్ని సాధించినట్లు పేర్కొన్నారు మహబూబాబాద్​ జిల్లాకు చెందిన యశ్వంత్​ రాథోడ్​.

మహబూబాబాద్‌ జిల్లా బుక్కా తండాకు చెందిన గిరిజన విద్యార్థి యశ్వంత్‌ రాథోడ్‌.. దక్షిణాఫ్రికాలోనే ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఎంతో సాహసోపేతంగా కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి.. తిరిగి నగరానికి వచ్చిన యశ్వంత్‌ రాథోడ్‌ను హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా సత్కారంచారు. ఈ కార్యక్రమంలో గిరిజన అధికారులు, యశ్వంత్‌ తల్లిదండ్రులు రామ్మూర్తి నాయక్‌, జ్యోతిబాయిలు, తండా వాసులు పాల్గొన్నారు.

దృఢసంకల్పంతో

భారత త్రివర్ణ పతాకాన్ని కిలిమంజారో పర్వతంపై ఎగరవేయాలనే లక్ష్యంతో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతో ముందుకు సాగినట్లు యశ్వంత్‌ రాథోడ్‌ తెలిపారు. ఈ యాత్రలో 12 మంది బయలుదేరామని... అందులో నలుగురం మాత్రమే అక్కడికి చేరుకున్నట్లు చెప్పారు. పర్వతారోహణ సమయంలో మృతదేహాలు కాళ్లకు తగిలి భయంతో చాలా మంది వెనుదిరిగారని వెల్లడించారు. మార్గ మధ్యలో ఆక్సిజన్​ అందక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. దృఢసంకల్పంతో లక్ష్యాన్ని చేరుకున్నట్లు వివరించారు.

ప్రభుత్వం సాయం చేయాలి

యాత్రకు ముందు నెల రోజులపాటు రాజకీయ నాయకులను కలిసినా.. ఎవరూ ఆర్థిక సహాయం చేయలేదని యశ్వంత్​ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు ఆర్థికంగా సాయం చేస్తే మరిన్ని సాహసోతమైన యాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ భరోసా ఉంటే గిరిజన యువత అద్భుతాలు సృష్టిస్తుందని గిరిజన అధికారి డాక్టర్​ రాజ్​కుమార్​ యాదవ్​ అన్నారు. దేశంలో ఎందరో క్రీడాకారులను సత్కరిస్తున్న ప్రభుత్వం.. సాహసాలు చేస్తున్న గిరిజన విద్యార్థిని పట్టించుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే సాయం చేస్తున్నారని వాపోయారు.

ఇదీ చదవండి: KTR: తెలంగాణ అభివృద్ధికి నీతి ఆయోగ్ నివేదికే నిదర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.