గిరిజన ఆశ్రమ పాఠశాల పప్పులో వానపాము.. 36 మందికి అస్వస్థత

author img

By

Published : Jul 30, 2022, 8:39 AM IST

Food Poison

Food Poison : వానపాము పడిన పప్పు తిని.. 36 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కాగా.. అందులో 9 మంది ఆసుపత్రి పాలయ్యారు. మిగతా వారికి వసతి గృహంలోనే పరీక్షలు నిర్వహించి ఔషధాలు అందజేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా​లో చోటుచేసుకుంది.

Food Poison : మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వానపాము పడిన పప్పు తిని.. 36 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అందులో 9 మంది ఆసుపత్రి పాలయ్యారు. గురువారం మధ్యాహ్న భోజన సమయంలో ఒక విద్యార్థినికి పప్పులో వానపాము వచ్చింది. తోటి విద్యార్థినులు ఈ విషయాన్ని వార్డెన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆ పప్పు తింటే ఏం కాదని వార్డెన్‌ చెప్పడంతో తామంతా తిన్నామని విద్యార్థినులు తెలిపారు.

భోజనం చేసిన వారిలో కొంత మందికి కడుపు నొప్పి రావడంతో వార్డెన్‌ మాత్రలు ఇచ్చారు. రాత్రి 12 గంటల సమయంలో మరికొందరు.. శుక్రవారం ఉదయం ఇంకొందరు కడుపునొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకోవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన 9 మందిలో ఒకరిని ఐసీయూలో ఉంచారు. మిగిలిన 27 మందికి వసతి గృహంలో పరీక్షలు నిర్వహించి ఔషధాలు అందజేశారు.

ఈ ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ విచారణకు ఆదేశించారు. ఫోన్​లో జిల్లా కలెక్టర్, ట్రైబల్ వెల్ఫేర్ డి.డి, ఆసుపత్రి సూపరింటెండెంట్​లతో మాట్లాడి విద్యార్థుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విచారణ జరిపి.. కలుషిత ఆహారం వడ్డించిన వార్డెన్‌, వంట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ తెలిపారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం ఆశ్రమ పాఠశాలకు వెళ్లి.. విద్యార్థినిల సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.