కూలిన వంతెన.. మూడు మండలాలకు నిలిచిపోయిన రాకపోకలు

author img

By

Published : Oct 20, 2022, 5:39 PM IST

Collapsed bridge

Collapsed bridge at Andevalli: కుమురం భీం జిల్లాలో కాగజ్‌నగర్‌ దహేగాం మండలాలను అనుసంధానిస్తూ నిర్మించిన వంతెన కూలిపోయింది. గతేడాది ఆగస్టులో కురిసిన వర్షాలకు వంతెన ఫిల్లర్ కొంతమేర కృంగిపోయింది. అయితే అధికార యంత్రాంగం సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో వంతెన కుప్పకూలింది. దీంతో మూడు మండలాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Collapsed bridge at Andevalli: 2004లో అందవెల్లి సమీపంలోని పెద్దవాగుపై 19 కోట్ల వ్యయంతో చేపట్టిన వంతెన ప్రారంభమైంది. దీంతో కాగజ్‌నగర్‌ నుంచి దహెగాం, భీమిని మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. 18 ఏళ్ల క్రితం ప్రారంభించిన వంతెన గతేడాది వరకు బాగానే ఉంది. 2021 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు వంతెనలోని ఒక ఫిల్లరు కుంగింది. దీంతో పాటు అప్పుడప్పుడు వంతెన అదిలినట్టు అనిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ఈ క్రమంలో వంతెనను పరిశీలించిన ఇంజనీర్లు,అధికారులు కుంగిన ఫిల్లర్ సరి చేస్తే చాలని నిర్ధారణకు వచ్చారు. తాత్కాలిక మరమ్మతులకు ప్రభుత్వం 22 లక్షలు మంజూరు చేసినప్పటికీ గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో శాశ్వత మరమ్మత్తులు చేయడానికి ప్రభుత్వం రెండు కోట్ల 90 లక్షల రూపాయలు మంజూరు చేయగా... ఒక్కరే టెండర్ వేశారు. ఇక పనులు ప్రారంభమవుతాయని ఆశిస్తున్న ప్రజలకు వంతెన కుప్పకూలడంతో ఆశలు నీరుగారాయి. అందెవల్లి వద్ద వంతెన కూలడంతో దహేగాం, భీమిని మండలాలతో పాటు కాగజ్‌నగర్ లోని జగన్నాథపూర్, బోడేపల్లి, జివాజీ గూడ తదితర గ్రామాలకు రవాణా సౌకర్యం దెబ్బతింది.

ఆయా గ్రామాల పిల్లలు చదువులు, వైద్య సేవలు, నిత్యవసర సరుకులు తెచ్చుకోవడానికి నిత్యం ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా కుంగిన వంతెనకు మరమ్మతులు చేపట్టకపోవడంతో భారీ వర్షాలు ఉన్నప్పుడు పెంచికలపేట, బెల్లంపల్లి మీదుగా రెట్టింపు దూరం ప్రయాణించాల్సి వస్తుందని తెలిపారు. నీటి ప్రవాహం తక్కువ ఉన్నప్పుడు తర్మకోల్ పడవలపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన వంతెన ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిర్‌పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూలిన వంతెనను అధికారులతో కలిసి పరిశీలించారు. వంతెనపై పూర్తి నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వంతెన కూలడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటు పడవలపై బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సివస్తుందంటున్న స్థానికులు... వీలైనంత త్వరగా నూతన వంతెనను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కూలిన వంతెన.. మూడు మండలాలకు నిలిచిపోయిన రాకపోకలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.