తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు, రిమాండ్ రిపోర్టులో ఏ1 పేరు మాయం

author img

By

Published : Aug 20, 2022, 12:04 PM IST

Tammineni Krishnaiah Murder Case

Tammineni Krishnaiah Murder Case సంచలనం రేపిన తెరాస నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులకు ఖమ్మం న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధింపుతో 8 మందిని జైలుకు తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే కృష్ణయ్యను హత్య చేసినట్లు పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

Tammineni Krishnaiah Murder Case : ఖ‌మ్మం జిల్లా తెల్దారుప‌ల్లిలో ఈనెల15న హత్యకు గురైన త‌మ్మినేని కృష్ణయ్య కేసులో నిందితుల అరెస్టు నుంచి కోర్టులో హాజరుపర్చే వరకు పోలీసులు గోప్యత పాటించారు. శుక్రవారం రాత్రి 9గంటల 45 నిమిషాలకు... 8మంది నిందితులు బోడపట్ల శ్రీనివాసరావు, గజ్జి కృష్ణ, నూకల లింగయ్య, బండారు నాగేశ్వరరావు, కన్నెగంటి నవీన్, జక్కంపూడి కృష్ణయ్య, మల్లారపు లక్ష్మయ్య, S.K.రంజాన్‌లను ఖమ్మం గ్రామీణ పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. నిన్న మధ్యాహ్నమే వీరందరికి వైద్య పరీక్షలు నిర్వహించగా.... రాత్రి 8గంటల 50నిమిషాల సమయంలో పోలీసు బందోబస్తు మధ్య కోర్టులోకి తీసుకెళ్లారు. న్యాయమూర్తి మౌనిక నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 8మంది నిందితుల్ని జిల్లా జైలుకు తరలించారు.

తమ్మినేని కృష్ణయ్యను వ్యక్తిగత కారణాలతోనే పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. తమ ప్రణాళికను అమలు చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న నిందితులు ఆగస్టు 15న ఉదయం 11 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.... తెల్దారుపల్లి సమీపంలోని దోభీఘాట్ వద్ద మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. ఏ1గా ఉన్న బోడపట్ల శ్రీను, ఏ5 కన్నెకంటి నవీన్ ఇద్దరూ.... హత్యకు ప్రణాళికలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏ6 జక్కంపూడి కృష్ణయ్య, ఏ7 మల్లారపు లక్ష్మయ్య.. తమ్మినేని కృష్ణయ్య కదలికలపై నిఘా ఉంచి.... బోడపట్ల శ్రీనుకు సమాచారం ఇచ్చారు.

ఏ1 నుంచి ఏ5 వరకు నిందితులు ఆటోలో వచ్చి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం నలుగురు నిందితులు మారణాయుధాలో తమ్మినేని కృష్ణయ్యపై దాడి చేసి హత్యచేశారు. తర్వాత అక్కడి నుంచి రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్లిపోయారు. అంతా మళ్లీ సమావేశమైన సమయంలో అరెస్టు చేసిన పోలీసులు.. హత్యకు ఉపయోగించిన 5 మారణాయుధాలు, 3 ద్విచక్రవాహనాలు, ఒక ఆటో, 9 సెల్‌ఫోన్లతోపాటు 2వేల రూపాయల నగదు సీజ్ చేసినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

మృతుడు తమ్మినేని కృష్ణయ్య కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా తమ్మినేని కోటేశ్వరరావు పేరు ఉంది. తాజాగా పోలీసులు న్యాయస్థానానికి నివేదించిన హత్య కేసు రిమాండ్ రిపోర్టులో ఏ1గా ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.