RS Praveen kumar: ఎవరెన్ని కుట్రలు చేసినా బీఎస్పీదే అధికారం: ఆర్​ఎస్పీ

author img

By

Published : Sep 11, 2021, 9:00 PM IST

Updated : Sep 11, 2021, 10:59 PM IST

RS Praveen kumar

కొన్ని వేల సంవత్సరాలుగా ప్రభుత్వాలు బహుజనులను మోసం చేస్తున్నాయని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్ ఆరోపించారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న దళిత బిడ్డలను అన్యాయంగా జైళ్లలో పెడుతున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహుజనుల సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు.

రాబోయే రోజుల్లో అధికారమే లక్ష్యంగా బహుజనులు కృషి చేయాలని రాష్ట్ర బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్ పిలుపునిచ్చారు. ఏనుగు గుర్తుపై ప్రగతిభవన్​కు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకేంద్రంలో నిర్వహించిన బహుజనుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కొన్ని వేల సంవత్సరాలుగా మనం మోసపోతున్నామని ఇకపై ఎవరెన్ని కుట్రలు చేసినా బహుజనులదే రాజ్యాధికారమని అన్నారు. పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్న దళిత బిడ్డలను చంటి పిల్లలతో సహా జైళ్లలో పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను విక్రయిస్తూ వేల కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు.

ఎన్నిబంధులు వచ్చినా మనదే అధికారం

రాష్ట్రంలో కేసీఆర్ దళితబంధుతో పాటు ఎన్నిబంధులు అమలు చేసినా బహుజనులంతా ఎనుగు గుర్తుకే ఓటేస్తారని ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా నుంచే మన ప్రభంజనం మొదలవుతుందని అన్నారు. తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు మనమంతా ఒక్కతాటిపై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆదివాసీ కుటుంబాలకు పరామర్శ

బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం మధ్యాహ్నం నేరుగా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్ చేరుకున్నారు. ఇటీవల పోడుభూముల కేసులో జైలుకు విడుదలైన ఆదివాసీ కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం ఖమ్మం చేరుకున్న ఆయనకు బీఎస్పీ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. నగరంలో భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. జడ్పీ కూడలి వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి టీఎన్జీవో ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్​కు మహిళలు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. తెరాస ప్రభుత్వ విధానాలపై ఆయన నిప్పులు చెరిగారు. కోకాపేట భూములు అమ్మి ఆధిపత్య కులాలకు రూ.కోట్లు కట్టబెడుతున్న తెరాస సర్కారు.. అణగారిన కులాలకు మాత్రం తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి పట్టాలు సృష్టిస్తున్న వారిని పట్టించుకోకుండా.. కష్టజీవుల బతుకుల్ని ఛిద్రం చేస్తున్నారన్నారు. పోడు భూములకు నిజమైన వారసులు ఆదివాసీలేనన్నారు. బతుకుదెరువు కోసం పోడు చేసుకుంటున్న ఆదివాసీలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తూ... కుట్రపూరితంగానే వ్యవహరిస్తోందన్నారు.

హుజనుల గోస, ఆక్రందన, ఆవేదన అర్థంచేసుకునే ధ్యాస తెరాస, కాంగ్రెస్, భాజపాలకు లేదని.. బీఎస్పీతోనే ఆయా వర్గాల కష్టాలు తీరుతాయన్నారు. భాజపా, తెరాస తోడు దొంగలేనన్నారు. అణగారిన వర్గాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలు సాగనీయబోమన్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. ఏనుగుపై వచ్చి ప్రగతిభవన్​లో అడుగుపెట్టడం ఖాయమన్నారు. బహుజన రాజ్యం ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ స్థాపించుకోలేమని.. ఇందుకోసం గ్రామ గ్రామాన బీఎస్పీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.

1968లోనే తెలంగాణ కోసం దీక్షలు

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి 1968లోనే ఇల్లెందులో కలికోట రామ్​దాస్, రవీంద్రనాథ్​ అనే దళిత బిడ్డలు నిరాహార దీక్షలు చేశారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం చేయాల్సిన సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో నిమ్మరసం తాగారని ఎద్దేవా చేశారు. తెలంగాణను బతికించుకున్న మీరు 30 ఏళ్లుగా జీవనోపాధి కోసం వ్యవసాయం చేస్తున్నా కూడా మనం ఇంకా కూలీలుగానే మిగిలారని అన్నారు. ఆదివాసీ బిడ్డలకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన భూములు ఇవ్వకుండా చంటిబిడ్డలతో సహా జైల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 3 లక్షల ఎకరాలు గుంజుకుందని ఆరోపించారు. ఎస్సీ భూముల్లో పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, రైతు వేదికలు నిర్మించారని ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. అగ్రకులాల వారి భూముల్లో ఎందుకు నిర్మించడం లేదో చెప్పాలని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వం తెస్తున్న పెద్ద పెద్ద కంపెనీల్లో బహుజనుల వాటా ఎంతశాతం ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు ప్రారంభించినా.. ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకునే గురుకులాలను మాత్రం ఎందుకు తెరవలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీ పిల్లలకే చదువులు కావాలా.. బహుజన బిడ్డలకు వద్దా అని ప్రశ్నించారు. ప్రభుత్వం కుట్ర పూరితంగానే రాష్ట్రంలో దళితబందు ప్రవేశపెట్టిందని.. త్వరలో అన్నివర్గాలకు బంధు ప్రకటిస్తుందన్నారు.

ఈరోజు దళితబంధు పథకం.. రేపటి నుంచి అన్నిబంధులు వస్తాయి. ఏనుగు గుర్తుతో ప్రగతిభవన్​లో అడుగు పెడతాం. మీరు తరతరాలుగా పేదలను ఎన్నిబంధులు ఇచ్చినా ఏనుగు గుర్తుకే మనం ఓటేయ్యాలి. ఎన్ని కుట్రలు చేసినా మమ్మల్ని ఓడించలేరు. రాష్ట్రంలో బీసీ సోదరులు కూడా అన్యాయానికి గురవుతున్నారు. కేసీఆర్​ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించాలి. రాబోయే రోజుల్లో బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. మన పెద్దలు కలలు గన్న బహుజన రాజ్యాన్ని మనం సాధించాలి. ప్రతి ఇంటికి వెళ్లి మన బహుజన రాజ్యాన్ని విస్తరించాలి. రాబోయే రోజుల్లో గడీల పాలన పోవాలంటే ఏనుగు గుర్తునే గెలిపించాలి. - ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ కోఆర్డినేటర్

ఇదీ చూడండి: RS PRAVEEN KUMAR: ఆర్​ఎస్ ప్రవీణ్​కుమార్ ముద్దాడిన ఆ పాప ఎవరో తెలుసా?

Last Updated :Sep 11, 2021, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.