ఖమ్మం బీఆర్​ఎస్​ సభతో నయా చరిత్ర సృష్టిస్తాం: మంత్రి హరీశ్​రావు

author img

By

Published : Jan 17, 2023, 7:04 AM IST

harish rao special interview

Minister Harish Rao Interview : ఖమ్మంలో రేపు నిర్వహించే బీఆర్​ఎస్​ తొలి బహిరంగ సభ జాతీయ రాజకీయాలను మలుపు తిప్పనుందని మంత్రి, బహిరంగ సభ ఇన్‌ఛార్జి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సభా వేదికగా సమరభేరి మోగిస్తామన్నారు. దేశమంతటా తెలంగాణ విధానాల అమలే లక్ష్యంగా నిర్వహిస్తోన్న ఈ సభలో 4 జాతీయ పార్టీల నేతలు.. నలుగురు ముఖ్యమంత్రులు పాల్గొంటున్నట్లు ఆయన వివరించారు.

Minister Harish Rao Interview : టీఆర్​ఎస్​ ఆవిర్భావం సందర్భంగా కరీంనగర్‌లో నిర్వహించిన మొదటి బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికి ప్రత్యేక తెలంగాణ అవతరించగా.. ఖమ్మంలో నిర్వహించే బీఆర్​ఎస్​ తొలి బహిరంగ సభ జాతీయ రాజకీయాలను మలుపు తిప్పనుందని మంత్రి, బహిరంగ సభ ఇన్‌ఛార్జి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు.

విచ్ఛిన్నకర విధానాలు కలిగిన బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగనున్న ఈ సభ జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుందని పేర్కొన్నారు. ఈ నెల 18న నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న హరీశ్‌రావు ‘ఈనాడు-ఈటీవీ భారత్​’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

ఖమ్మం సభ ప్రాధాన్యమేంటి?

ప్రత్యేక తెలంగాణ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన టీఆర్​ఎస్​ (ప్రస్తుతం బీఆర్​ఎస్​) గత ఎనిమిదిన్నరేళ్లలో అనేక రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచింది. సంక్షేమం.. అభివృద్ధి.. రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చి పని చేసింది. ఫలితంగా తెలంగాణ ధాన్యాగారంగా మారింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తక్కువ సమయంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. రైతులకు ఉచిత విద్యుత్తు, గృహాలు, పరిశ్రమలకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా, రైతులకు పెట్టుబడికోసం రైతుబంధు, పారిశామ్రికాభివృద్ధికి ప్రోత్సాహకాలతో అనేక అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా చేపట్టింది. అభివృద్ధికి ఓ నమూనాను ఆచరణలో పెట్టి విజయవంతం చేసింది.

ఇలాంటి ప్రయోజనాలను దేశ ప్రజలందరికీ అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీఆర్​ఎస్​ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తలపెట్టిన భారీ బహిరంగసభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు. కచ్చితంగా ఇది ఓ చరిత్రాత్మక సభ. దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలుకుతుందనడంలో సందేహం లేదు. తెలంగాణ తొలిదశ ఉద్యమం ఖమ్మం జిల్లాలో సింగరేణి కార్మికుల నుంచే ప్రారంభమైంది. కేసీఆర్‌ తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసి ఖమ్మం ఆసుపత్రిలో ఉన్నప్పుడే ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. కేంద్రం ప్రకటన చేసింది. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు మలిదశ ఉద్యమం కూడా ఖమ్మం నుంచే ప్రారంభం కానుంది.

మోదీ ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందని బీజేపీ అంటోంది కదా?

ఏ వర్గం సంతృప్తిగా ఉందో చెప్పమనండి. బీఆర్​ఎస్​ రైతు అనుకూల విధానాలు అవలంబిస్తే, బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు చేపట్టింది. మనం పండించిన ధాన్యం కూడా కొనకుండా రైతులను వేధిస్తున్న పరిస్థితి ఉంది. కార్మిక, రైతు, యువత ఇలా అన్ని వర్గాలకు వ్యతిరేక విధానాలే.నిరుద్యోగ సమస్యను మరింత పెంచడం తప్ప.. తగ్గించడానికి కేంద్రం ఏం చేసింది?

దేశంలో మత చిచ్చు పెట్టడం, విచ్ఛిన్నకర రాజకీయాలు చేయడం, గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేసి రాష్ట్రాలను ఇబ్బందుల పాల్జేయడం..ఇలా చెప్పుకొంటూ పోతే కేంద్రానివి అన్నీ వైఫల్యాలే. అన్ని వ్యవస్థలను దుర్వినియోగపరిచి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది. ఈ విధానాలను జాతీయ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కేసీఆర్‌ నిర్ణయం తీసుకొని మొదటి అడుగుగా భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. ఈ సభ దేశానికి ఓ సంకేతం ఇస్తుందనడంలో సందేహం లేదు.

కేంద్రంలోని బీజేపీకు వ్యతిరేకంగా నిర్వహించే ఈ సభకు అన్ని విపక్షాలను ఆహ్వానించినట్లు లేదు కదా?

ఈ సభకు నాలుగు జాతీయ పార్టీలు హాజరవుతున్నాయి. ముఖ్యమంత్రులు విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌సింగ్‌ మాన్‌, మన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి మొత్తం నలుగురు ఒక వేదికపైకి చేరి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల గురించి మాట్లాడనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ హాజరవుతున్నారు. సీపీఐ, సీపీఎంల జాతీయ నేతలు హాజరవుతున్నారు.

అందువల్ల ఇది జాతీయ ప్రాధాన్యం కలిగిన సభ అనడంలో సందేహం లేదు. ఇది ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో అనేకమంది వచ్చి చేరే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో వామపక్ష పార్టీలతో కలిసి పని చేస్తున్నాం. ఆ పార్టీలు పూర్తి స్థాయిలో ఖమ్మం సభలో పాలుపంచుకొంటున్నాయి. ఒక వేదికపైకి ఇన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, ముఖ్యమంత్రులు చేరడం అంటే సాధారణం కాదు. ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు ఈ సభ దోహదపడుతుంది. జాతీయ దృష్టిని ఆకర్షించడంలో ఇది తొలి అడుగు అని చెప్పవచ్చు.

ఈ సభకు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది?

కచ్చితంగా అతి భారీ బహిరంగ సభ. దీనికి తగ్గట్లుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సుదూర ప్రాంతాల నుంచి నలుతరలి వస్తారు. ఖమ్మానికి వంద కిలోమీటర్ల దూరం నుంచే ఎక్కువ మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, వైరా, మధిర, ఇల్లందు, పాలేరు, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలో డోర్నకల్‌, మహబూబాబాద్‌, పాలకుర్తి, సూర్యాపేట జిల్లాలో కోదాడ, హుజూర్‌నగర్‌, సూర్యాపేటల నుంచి ఎక్కువగా తరలిరానున్నారు.

మిగిలిన చోట్ల నుంచి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి వేలల్లో వస్తారు. రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులందరూ హాజరవుతారు. ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమం కంటివెలుగును నలుగురు ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభిస్తారు. ఖమ్మం కలెక్టరేట్ భవనాన్ని కూడా ప్రారంభించిన తర్వాత బహిరంగ సభ ఉంటుంది.

ఇవీ చూడండి..

దేశ రాజకీయాలను మలుపు తిప్పేదిగా ఖమ్మం సభ.. షెడ్యూల్​ ఇదే: మంత్రి హరీశ్​రావు

అగ్గిరాజేస్తోన్న జగిత్యాల మాస్టర్​ ప్లాన్​.. తిమ్మాపూర్​లో రోడ్డెక్కిన రైతన్నలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.