Dengue: ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి..

author img

By

Published : Aug 10, 2021, 12:33 PM IST

Dengue

2019 వరకు డెంగీ జ్వరాలు జనానికి కంటిమీద కునుకులేకుండా చేశాయి. శుభ్రమైన నీటిలో తయారై పగలుకుట్టే దోమతో డెంగీ వ్యాప్తి చెందుతోంది. ఏడీస్‌ ఈజిప్టు దోమ కారణంగా ప్రభలే జ్వరం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తద్వారా ప్లేట్లేట్ల సంఖ్య పడిపోయి ప్రమాద స్థాయికి చేరుకొని ప్రాణాలు కోల్పోయిన సంఘటనలను ఖమ్మం జిల్లా వాసులు చవిచూశారు. దోమ పుట్టకుండా, కుట్టకుండా వైద్య ఆరోగ్య శాఖ ఇతర విభాగాల సమన్వయంతో చేస్తున్న ప్రయత్నాలు ఒకింత సత్ఫలితాలను ఇస్తున్నాయనే చెప్పవచ్ఛు అయితే ప్రజల్లోనూ నివారణ మార్గాలపై చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది. ఖమ్మంలో దోమ కారక వ్యాధుల్లో ప్రధానమైన డెంగీపై ప్రత్యేక కథనం.

జిల్లా వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం ఖమ్మం జిల్లాలో 2019లో 1,972 డెంగీ కేసులు నమోదయ్యాయి. 25 మరణాలు చోటుచేసుకున్నాయి.

ప్రైవేటు ఆసుపత్రుల లెక్క కూడా తీసుకుంటే మరింత ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు కూడా ఏటా వేల కేసులు నమోదయ్యాయి. 2020 సంవత్సరంలో కరోనా ఉద్ధృతిలో ఈ కేసులు మరుగున పడ్డాయి. లాక్‌డౌన్‌, వీధుల్లో ద్రవాలు చల్లడం, ప్రజలు వ్యక్తిగత, పరిసరాల శుభ్రతపై చూపిన శ్రద్ధ వెరసీ గతేడాది దోమల బెడద చాలా తక్కువనే చెప్పాలి. ఈ తరుణంలోనూ ప్రభుత్వ లెక్కల్లో 23, ప్రైవేటులో వందల సంఖ్యలో డెంగీ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక 2021 సంవత్సరంలో ఇప్పటి వరకు 50 డెంగీ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వైద్య పరీక్షల్లో తేల్చారు. రెండు నెలల నుంచి కేసుల తీవ్రత పెరుగుతున్నట్లు అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ డెంగీ జ్వరంతో రోగులు పెద్ద సంఖ్యలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. గతేడాదితో పోల్చుకుంటే ఇప్పుడు కరోనాతోపాటు డెంగీ జ్వరాలు కూడా పెరుగుతున్నట్టు నమోదవుతున్న కేసులు వివరిస్తున్నాయి.

టైగర్‌ దోమ ఇలా..

పగలు, మధ్యాహ్నం ఇంట్లో నల్లగా ఉండిపైన తెల్లటి సారలు ఉన్న దోమలను గమనిస్తే జాగ్రత్త పడాలి. చిన్నపిల్లలు ఉన్న చోట దోమలు దరిచేరకుండా చూసుకోవాలి. మైక్రోస్కోపునకు కూడా అంతుచిక్కని ఆర్బోవైరస్‌ దోమల ద్వారా మనిషిలోకి చేరుతున్నాయి. పరిసరాలను గమనించడం, చెత్తా, ముఖ్యంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలి. వీలుకాని వారు వ్యర్థ నూనెలను దోమలు ఉన్న ప్రదేశంలో వేయడంతో దోమలు నశిస్తాయి.

డెంగీ బారిన పడిన రోగి శరీరంలో రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది. దీంతో ప్లేట్లేట్లు తగ్గి ప్రాణాంతకంగా మారుతుంది. తీవ్రమైన కడుపునొప్పి, దాహం, నీరసం, కళ్ల వెనుక భాగంలో నొప్పి, వాంతులు, నిద్రలేమి ఇలాంటి లక్షణాలు ఉంటే జాగ్రత్త పడాలని వైద్యులు సూచించారు.

డ్రైడే పాటిస్తూ..

వారానికి రెండుసార్లు డ్రైడే పాటించేలా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది. మెప్మా, ఐకేపీ, పంచాయితీ, మున్సిపల్‌ విభాగాల సమన్వయంతో నీటి నిల్వలు లేకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. జ్వరం కేసులు ఉన్నాయని గమనించిన ప్రాంతాల్లో ఫైరత్రీన్‌, టీమోపాస్‌ పిచికారి, పాగింగ్‌ చేయిస్తున్నాం. దోమ లార్వా వృద్ది చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. బాధితులు నమోదైన ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి రక్తనమూనాలు సేకరిస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో అదుపులోని ఉందని చెప్పాలి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలి.

సంధ్య, డీఎంవో

జిల్లాలో వ్యాప్తి

జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్‌, కల్లూరు పట్టణాల్లో డెంగీ విజృంభణ ఉన్నట్లు ఆరోగ్య శాఖ తాజా గణాంకాల్లో తేల్చింది. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వివరాలు గమనిస్తే.. కల్లూరులో 19, ఖమ్మంలో 9 కేసులు నమాదయ్యాయి. చెన్నూరు, మంచుకొండ పీహెచ్‌సీ పరిధిలో ఐదేసీ కేసులు, ఎం.వి.పాలెంలో 4, ఏన్కూరు, సింగరేణి 2, కూసుమంచి కొణిజర్ల, కామేపల్లి ఒక్కో కేసు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: కేరళలో జికా విజృంభణ- కొత్తగా డెంగ్యూ కేసులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.