వసూలు చేయాల్సింది రూ.749 కోట్లు.. చేసింది రూ.11 కోట్లు

author img

By

Published : Nov 22, 2022, 8:21 AM IST

Karimnagar Granite Issue

Karimnagar Granite Issue: కరీంనగర్​ గ్రానైట్​ వ్యవహారంలో ఈడీ విచారణతో విజిలెన్స్​ సిఫార్సులు బుట్టదాఖలుపై మరోసారి చర్చ జరుగుతోంది. కరీంనగర్​ జిల్లాలో రాయల్టీ చెల్లించకుండా గ్రానైట్​ను ఎగుమతి చేసిన 8 కంపెనీల నుంచి రూ.749 కోట్లు వసూలు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ విభాగం గతంలో చెప్పగా.. గనుల శాఖ ఇంతవరకు రూ.11 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ రంగప్రవేశం చేయడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Karimnagar Granite Issue : మరోసారి కరీంనగర్​ గ్రానైట్​ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గ్రానైట్​ రాయల్టీ ఎగవేత అక్రమాలపై నాడు విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ విభాగం నివేదిక ఇచ్చినప్పటి నుంచి జరిగిన పరిణామాలపై గత ఏడాది జులై 17న కరీంనగర్​లోని గనుల శాఖ ఏడీ, రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్​కు లేఖ రాశారు. అందులో పలు అంశాలను వివరించారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో 8 కంపెనీలకు ఇచ్చిన లీజులు, ఆ కంపెనీలు రైల్వే వ్యాగన్ల ద్వారా, కాకినాడ సీ పోర్టు తదితర ప్రాంతాల నుంచి రవాణా చేసిన, ఎగుమతి చేసిన గ్రానైట్, వీటికి చెల్లించిన సీనరేజి తదితర అంశాలపై అప్పట్లో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ విభాగం లోతుగా దర్యాప్తు చేసింది. ఏ రైల్వే స్టాక్​ యార్డు నుంచి ఎంత రవాణా చేశారన్న వివరాలనూ సేకరించింది. 7 లక్షల 68 వేల 889.937 క్యూబిక్​ మీటర్ల గ్రానైట్​ను రాయల్టీ చెల్లించకుండా తరలించినట్లు గుర్తించింది.

Karimnagar Granite Mining Issue : ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఈ గ్రానైట్​కు రూ.124.94 కోట్ల రాయల్టీ చెల్లించాల్సి ఉందని, అనధికారికంగా తరలించినందున చట్టప్రకారం 5 రెట్లు పెనాల్టీ చెల్లించాల్సి ఉందని.. ఈ పెనాల్టీ 624.72 కోట్లు కలిపి.. మొత్తం 749.66 కోట్లు వసూలు చేయాలని 2013 మే 29న విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ సిఫార్సు చేసింది. నాడు ఆ నివేదికను పరిశీలించిన పరిశ్రమలు-వాణిజ్య శాఖ.. మైనింగ్​ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అదే ఏడాది జులై 20న గనుల శాఖ డైరెక్టర్​కు మెమో జారీ చేసింది. దీని ఆధారంగా 8 ఏజెన్సీలకు కరీంనగర్​లోని మైనింగ్ ఏడీ నోటీసులు జారీ చేశారు. తర్వాత 7 ఏజెన్సీల్లోని 198 మంది లీజుదారులకు డిమాండ్​ నోటీసులు ఇవ్వడంతో పాటు, ఆ ఏజెన్సీలు ఇచ్చిన ఆధారాల్లో కవర్​ కాని గ్రానైట్​కు సంబంధించి కూడా షోకాజ్​ నోటీసులు ఇచ్చారు.

సంబంధిత లీజుదారులకు గ్రానైట్​ డిస్పాచ్​ పర్మిట్లను నిలిపివేశారు. దీంతో కొందరు లీజుదారులు ప్రభుత్వానికి అప్పీలు చేసుకోగా, సాధారణ సీనరేజి ఛార్జీతో పాటు వన్​ టైం పెనాల్టీ విధించి పరిష్కరించిందని లేఖలో వివరించారు. చట్టప్రకారం పెనాల్టీని తగ్గించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. రూ.749 కోట్లు వసూలు చేయాల్సి ఉన్నా.. చేయలేదని 2018లో ఒకరు కోర్టుకు వెళ్లారని, దీనిపై కౌంటర్ అఫిడవిట్​ దాఖలు చేశామని, విజిలెన్స్​ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకొన్నామని డైరెక్టర్​కు రాసిన లేఖలో వివరించారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.