భూమి కబ్జాపై ప్రశ్నించినందుకు.. కుల బహిష్కరణ.!

author img

By

Published : Aug 9, 2021, 2:04 PM IST

caste deportation in thadvoy

'పెదరాయుడు' సినిమా చూసి ఉంటారు కదా.. అందులో తప్పు చేసిన వారిని, పంచాయతీ నిబంధనలు ఉల్లంఘించిన వారిని.. ఊరి నుంచి కొన్నేళ్లపాటు బహిష్కరించేలా తీర్మానిస్తారు గ్రామ పెద్ద. వారితో ఎవరూ మాట్లాడకూడదని, ఇతరుల నుంచి ఏ సహాయం అందకూడదని, వారి ఇళ్లల్లో మంచీచెడులకు ఎవరూ వెళ్లొద్దని.. ఊళ్లో ఏ శుభాశుభకార్యాలకైనా బహిష్కరణకు గురైన కుటుంబీకులు వెళ్లకూడదని తీర్మానిస్తారు. ఆ తీర్పును ఊరంతా గౌరవించి.. ఆ మాటకు కట్టుబడి ఉంటారు. ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకు అనుకుంటారా.. ఇంచుమించు ఇలాంటి స్టోరీనే ఒక ఊళ్లో జరిగింది. కానీ ఇక్కడ ట్విస్ట్​ ఏంటంటే.. బాధితులు చూస్తూ ఊరుకోలేదు. న్యాయం కోసం అధికారులను ఆశ్రయించారు.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఓ భూవివాదం విషయంలో కుల పెద్దలు మూడు కుటుంబాలను బహిష్కరించారు. అకిటి రవీందర్ రెడ్డి, గుట్టకాడి రామ్​రెడ్డి, అకిటి శ్రీకాంత్ రెడ్డిల కుటుంబాలను కుల పెద్దలు బహిష్కరించారు. ఈ కుటుంబాలతో ఎవరు మాట్లాడినా, మంచి చెడులకు వెళ్లినా రూ. 10 వేలు జరిమానా విధిస్తామని కుల పెద్దలు తీర్మానం చేశారు. ఈ విషయంపై బాధితుడు రవీందర్ రెడ్డి స్థానిక తహసీల్దార్​కు ఫిర్యాదు చేశారు.

కబ్జాకు యత్నం

తాడ్వాయి గ్రామానికి చెందిన రామ్​రెడ్డి, సావిత్రిలు భార్యాభర్తలు. వీరికి సరిత, స్వాతి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పెళ్లిళ్లు అయ్యాయి. దంపతులకు అబ్బాయిలు లేకపోవడంతో ఇంటి పెద్దల్లుడు అకిటి రవీందర్​ రెడ్డి.. ఇల్లరికం వెళ్లాడు. వీరికి సుమారు 19 ఎకరాల భూమి ఉండటంతో రవీందర్ రెడ్డి సాగుచేస్తూ అత్తామామలకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. అయితే ఆ భూమిలో ఎకరం 30 గుంటలు తమదంటూ తమ బంధువులైన గుట్టకాడి మణెమ్మ కుమారులు స్వామి, సంజీవరెడ్డి, రంజిత్ రెడ్డి.. ఆ పొలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 8 నెలల క్రితం అకిటి రవీందర్ రెడ్డితో పాటు సావిత్రిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. దీంతో రవీందర్ రెడ్డి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఈటీవీ భారత్​తో వాపోతున్న బాధితులు

మా కుటుంబం, చిన్నమామ కుమారులు అందరూ ఆస్తులు పంచుకున్నారు. ఇప్పుడు నా పేరు మీద ఉన్న భూమిని పట్టా చేయాలని వేధిస్తున్నారు. సంతకం పెట్టమన్నారు. లక్ష రూపాయల జరిమానా కట్టమంటే కడతాం అన్నాం. కానీ ఇప్పుడు మా మీద దాడులకు పాల్పడుతున్నారు. -సావిత్రి, బాధితురాలు

మా అత్తమామలకు మగపిల్లలు లేకపోవడంతో నేను ఇల్లరికం వచ్చాను. ఎకరం 30 గుంటలు పట్టా చేయాలని మా బంధువులు వేధిస్తుంటే కుల పెద్దలను ఆశ్రయించాం. వారు రిజిస్ట్రేషన్​ లేదా రూ. లక్ష కట్టమన్నారు. డబ్బు కట్టడానికి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు మళ్లీ మమ్మల్ని కుల బహిష్కరణ చేశారు. ఎవరూ మాతో మాట్లాడటం లేదు. అందుకే న్యాయం చేయాలని తహసీల్దార్​ను ఆశ్రయించాం. -రవీందర్​ రెడ్డి, బాధితుడు

కుల బహిష్కరణ

అనంతరం కుల పెద్దల సమక్షంలో మాట్లాడుకునేందుకు వెళ్లగా వారు సైతం దాడి చేసిన వారికి మద్దతుగా మాట్లాడారు. పొలం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని లేదా.. రూ. లక్ష జరిమానా కట్టాలని తీర్మానం చేశారు. అయితే రవీదర్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించి జరిమానా కట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు జరిమానా కట్టేందుకు వెళ్లిన రవీందర్ రెడ్డిని కుల బహిష్కరణ చేస్తున్నట్లు కులపెద్దలు ప్రకటించి తీర్మానం చేశారు. అతని కుటుంబంతో పాటు అత్తామామలు, రామ్​రెడ్డి తమ్ముడు శ్రీకాంత్ రెడ్డిల కుటుంబాలను బహిష్కరించారు.

తహసీల్దార్​కు ఫిర్యాదు

దీంతో గ్రామంలో కులస్థులు ఎవరూ తమతో మాట్లాడటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రవీందర్ రెడ్డికి ఉన్న ఫెర్టిలైజర్ దుకాణంలో ఎవరూ మందులు కొనుగోలు చేయవద్దని.. కొనుగోలు చేసిన వారికి రూ. పదివేలు జరిమానా విధిస్తామని కుల పెద్దలు హెచ్చరించారు. ఆందోళనకు గురైన బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలని తహసీల్దార్​కు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: KRMB, GRMB Meeting: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.