కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన లింగారెడ్డి అనే రైతు ఆరేపల్లి స్టేజి వద్ద పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకుని నడిరోడ్డుపై ట్రాక్టర్ నిలిపి హంగామా సృష్టించాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. లింగారెడ్డి వ్యవసాయ పొలం వద్ద కొద్ది రోజుల కింద ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది.
విద్యుత్ సిబ్బంది ట్రాన్స్ ఫార్మర్కు మరమ్మత్తులు చేయలేదు. వారి చుట్టూ తిరిగి విసుగు చెందిన లింగారెడ్డి గ్రామ స్టేజి వద్దకు ట్రాక్టర్ను తీసుకొచ్చాడు. రహదారిపై ట్రాక్టర్ నిలిపి దాని పైకి ఎక్కి పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విద్యుత్ అధికారులు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని రైతు లింగారెడ్డికి సర్ది చెప్పారు. ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు చేస్తామని చెప్పటంతో లింగారెడ్డి ఆందోళన విరమించాడు.
ఇదీ చదవండి: 4 కోట్ల ప్రజల భవిష్యత్ హుజూరాబాద్ బిడ్డల చేతిలో ఉంది: రేవంత్ రెడ్డి