నీళ్లు, నిధులు, నియామకాలు సవాలుగానే మిగిలాయి: ప్రహ్లాద్‌సింగ్‌

author img

By

Published : Apr 20, 2022, 4:27 PM IST

Updated : Apr 20, 2022, 6:10 PM IST

Bandi Sanjay Praja Sangrama Yatra

Bandi Sanjay Praja Sangrama Yatra: జోగులాంబ గద్వాల జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర ఏడో రోజు కొనసాగుతోంది. మల్దకల్​ నుంచి ప్రారంభమైన యాత్ర.. సద్దలోనిపల్లి మీదుగా అమరవాయికి చేరుకుంది. పాదయాత్రలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ సింగ్​ పాల్గొన్నారు. నీళ్లు- నిధులు- నియామకం సవాలుగానే మిగిలిందని ప్రహ్లాద్​ సింగ్​ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బండి సంజయ్​ ఆరోపించారు.

Bandi Sanjay Praja Sangrama Yatra: రాష్ట్రంలో తెరాస అరాచకాలు అంతమవ్వాలన్నా.. భాజపా అధికారంలోకి రావాలన్నా ప్రజల మద్దతు కావాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ సింగ్​ స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు సవాలుగానే మిగిలాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు అధికార మార్పిడి కోసం సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే వచ్చినట్లు ఆయన చెప్పారు. గద్వాల జిల్లాలో ఏడో రోజు కొనసాగుతున్న బండి సంజయ్​ పాదయాత్ర మల్దకల్​లో ప్రారంభమై.. సద్దలోనిపల్లి మీదుగు అమరవాయికి చేరుకుంది. పాదయాత్రలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ సింగ్​, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. అమరవాయి గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు.

నీళ్లు, నిధులు, నియామకాలు సవాలుగానే మిగిలాయి: ప్రహ్లాద్‌సింగ్‌

"నీళ్లు, నిధులు, నియామకాలు సవాలుగానే మిగిలాయి. ఆర్డీఎస్ వద్ద హెడ్‌రెగ్యులేటరీ ఏర్పాటుకు కేంద్రం కృషిచేసింది. హెడ్‌రెగ్యులేటరీ ఏర్పాటుకు 3 రాష్ట్రాలు అంగీకరించాయి. కృష్ణా బేసిన్‌లో 811 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. 299టీఎంసీలు చాలని తెలంగాణ అంగీకరించడం తొందరపాటే. మీ అంగీకారం వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది. ఆర్డీఎస్‌ నీటి పంపిణీపై టెలిమెట్రీ ద్వారా వాటాలు తేలుతాయి. ట్రైబ్యునల్ లేకుండా నీటి వాటాలు ఎలా తేలుతాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ సమర్పించారా?. డీపీఆర్‌ లేకుండా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా వస్తుంది?. తెలంగాణ ప్రజలు అధికార మార్పిడి కోసం సిద్ధంగా ఉన్నారు." -ప్రహ్లాద్‌సింగ్‌, కేంద్ర మంత్రి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియమాకాల కోసమని... కానీ పాలమూరు ప్రాంతానికి సీఎం కేసీఆర్​ తీవ్ర అన్యాయం చేస్తున్నారని బండి సంజయ్​ ధ్వజమెత్తారు. 299 టీఎంసీల నీటి వాటాకు ఒప్పుకొన్నది కేసీఆర్​ అని.. కానీ రాష్ట్రానికి రావాల్సిన నీటివాటాను తెచ్చుకునేందుకు భాజపా సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. అందులో భాగంగానే 3 రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయించామన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్​ తోమర్​.. సమావేశ వివరాలు ప్రకటించారని వెల్లడించారు. భేషజాలకు పోకుండా రైతులకోసం పనిచేయాలని హితవు పలికారు.

'పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. కానీ అందుకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటి వరకు కేంద్రానికి సమర్పించలేదు. ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని ఓ వైపు డిమాండ్‌ చేస్తూనే.. సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆ కేసును విరమించుకుంటే ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పడంతో కేసును విరమించుకున్నారు. కేవలం ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్​ ప్రయత్నాలు. గోదావరి నుంచి 200 కిలోమీటర్ల దూరం.. లక్షా 20వేల కోట్లు పెట్టి కాళేశ్వరం పూర్తి చేసుకుని కేసీఆర్‌ ఫాం హౌస్‌కు నీళ్లు తెప్పించుకున్నారు. అదే రూ. 2 వేల కోట్లు కేటాయిస్తే పాలమూరు జిల్లాలో ఉన్న పెండింగ్​ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి. కమీషన్లు రావని కేటాయించడం లేదు.' -బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

భాజపా దీక్ష: రాష్ట్రంలో కేసీఆర్‌ అవినీతికి పాల్పడుతున్నారని.. కేంద్రం నుంచి నిధులు పంపిస్తున్నా.. ప్రజలకు ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వడం లేదని బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు తెలుసుకునేందుకే ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రిని ఇక్కడికి పంపించారని వివరించారు. అంతకుముందు మంగపేట శివారులో పొలాల్లో పని చేస్తున్న కూలీలతో కేంద్రమంత్రి ముచ్చటించారు. పాదయాత్రకు ముందుగా మల్దకలోని ‘ప్రజా సంగ్రామ యాత్ర’ శిబిరం వద్ద డీకే అరుణతో పాటు బండి సంజయ్​ దీక్షలో పాల్గొన్నారు. ముఖానికి నల్ల మాస్కులు ధరించి నిరసన చేపట్టారు.

ఇది ప్రభుత్వ హత్యే: నిజాం కాలం నాటి అరాచకాలను తెరాస నేతలు ఇప్పుడు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఖమ్మంలో తెరాస నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా భాజపా కార్యకర్త సాయిగణేశ్‌ పోరాడారని చెప్పారు. పోలీసుల వేధింపులు తాళలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని సంజయ్‌ ఆరోపించారు. సాయిగణేశ్‌ వాంగ్మూలాన్ని పోలీసులు ఎందుకు తీసుకోలేదని సంజయ్‌ ప్రశ్నించారు. అతడిది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యేనని.. పోలీసులు ప్రణాళిక ప్రకారమే చేశారన్నారు. రామాయంపేటకు చెందిన తల్లీకుమారుడి ఆత్మాహుతి, కోదాడ అత్యాచార ఘటన, వామనరావు దంపతుల హత్య వెనుక ఉన్నది తెరాస నేతలేనని సంజయ్‌ ఆరోపించారు. ఈ ఘటనలపై సీఎం కేసీఆర్‌ సీబీఐ విచారణ కోరాలని.. ఆయనే బయటకు వచ్చి వీటిని ఖండించాలని డిమాండ్‌ చేశారు. భాజపా తరఫున న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

ఇవీ చదవండి: తల్లీకుమారుడి ఆత్మాహతి కేసు.. సీఐ నాగార్జున గౌడ్ ఎక్కడ..?

'సంప్రదాయ ఔషధాలపై ఆయుష్ ముద్ర.. వారికి ప్రత్యేక వీసా'

Last Updated :Apr 20, 2022, 6:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.