RAINS: కాళేశ్వరానికి పోటెత్తిన వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

author img

By

Published : Jul 23, 2021, 10:24 AM IST

Updated : Jul 23, 2021, 10:41 AM IST

kaleshwaram floods, first warning to kaleshwaram project

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం జలాశయానికి వరద పోటెత్తింది. గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. వరద ఉద్ధృతి కారణంగా కాళేశ్వరంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

కాళేశ్వరానికి పోటెత్తిన వరద

రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద అధికారులు మెుదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతుండగా... నీటి ప్రవాహం పుష్కర ఘాట్లను ముంచెత్తింది. మహారాష్ట్ర, తెలంగాణలో భారీ వర్షాలతో పాటు ఎగువ ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 12 మీటర్ల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది.

వర్షార్పణం

పార్వతి బ్యారేజ్ 68 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంథని మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాలు చాలా వరకు నీటిలో మునిగిపోయాయి. మంథని పట్టణంలోని బొక్కల వాగు గోదావరిలో కలిసే ప్రాంతంలో వరద పోటెత్తడంతో ఎగ్లాస్పూర్ జలదిగ్భందంలో చిక్కుకుంది. గోదావరి ఒడ్డున ఉన్న శ్రీ గౌతమేశ్వర స్వామి దేవాలయం చుట్టూ నీరు చేరటంతో 28 మంది ప్రజలు వరదలో చిక్కుకుపోయారు. వారిని ఒడ్డుకు చేర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

మేడిగడ్డకు వరద

లక్మీ (మేడిగడ్డ) బ్యారేజీలో 85 గేట్లకు గానూ 70 గేట్లు ఎత్తారు. ఇన్‌ఫ్లో 9,65,030 క్యూసెక్కులు... అవుట్ ఫ్లో 9,65,030 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా... 8 టీఎంసీలకు చేరింది.

వరద ఉద్ధృతి

కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం(సరస్వతి) బ్యారేజీకి వరద పోటెత్తింది. 65 గేట్లకు గానూ 56 గేట్లు ఎత్తారు. ఇన్‌ఫ్లో 8,02,300 క్యూసెక్కులు... అవుట్ ఫ్లో 9,00,000 క్యూసెక్కులుగా ఉంది. సామర్థ్యం 10.87 టీఎంసీలకు గానూ... 4.29 టీఎంసీలకు చేరింది. గేట్లు ఎత్తడంతో సమీప మహాదేవపూర్ మండలంలోని మద్దులపల్లి, అన్నారం, చంద్రుపల్లి, కాటారం మండలం గుండ్రత్ పల్లి గ్రామాల్లో వందల ఎకరాల్లో పంట నీట మునిగింది.

జల విలయం

గోదావరి ఉప్పొంగడంతో తీరం వెంబడి ఉన్న పంట పొలాలు వర్షార్పణం కాగా... విద్యుత్ మోటార్లు, ట్రాక్టర్లు, పైపులు నీట మునిగిపోయాయి. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉద్ధృతి పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరిలో లక్షా 98 వేల 230 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా... 20.3 అడుగుల మేర నీరు కొనసాగుతుంది. వరద పెరగనుందని సీడబ్ల్యూసీ సూచన మేరకు గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇదీ చదవండి: RAINS: దంచికొట్టిన వానలు.. పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు

Last Updated :Jul 23, 2021, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.