అంతరించిపోతున్న వరివంగడాలను పండిస్తూ ఔర అనిపిస్తోన్న రైతు!

author img

By

Published : Dec 10, 2022, 7:22 PM IST

రైతు మణిగంటి కుమారస్వామి

farmer producing new varieties of rice: అంతరించిపోతున్న వరివంగడాలను పరిరక్షిస్తూ ఓ రైతు ఆదర్శంగా నిలుస్తున్నారు. పది గుంటల స్థలంలో 36 రకాల వరి వంగడాలను సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జగ్గయ్యపేటకు చెందిన యువ రైతు మణిగంటి కుమారస్వామి. పదేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ అరుదైన వరి రకాల విత్తనోత్పత్తిపై దృష్టి సారిస్తున్నారు.

అంతరించిపోతున్న వరివంగడాలను పండిస్తూ ఔర అనిపిస్తోన్న రైతు

farmer producing new varieties of rice: ఆయన కొన్నాళ్ల కిందట కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆనారోగ్యానికి గురయ్యారు... రసాయన ఎరువులతో పండించిన పంటలు, ఆహారపు అలవాట్లే అనారోగ్యానికి కారణమని వైద్యులు చెప్పడంతో.. అప్పటినుంచి సేంద్రియ పద్ధతులతో గోఆధారిత వ్యవసాయం మొదలు పెట్టారు. మొదట బర్మాబ్లాక్ రైస్ వరి వంగడాన్ని సాగు చేశారు. ఆ తర్వాత సత్తుపల్లి, సిద్ధిపేట, భైంసాల నుంచి బర్మాబ్లాక్ (పొట్టిరకం), మణిపూర్ బ్లాక్, కృష్ణ వ్రీహి, కాలసూర్ లాంటి బ్లాకు వంగడాలతో పాటు గుజిపటాలియ, ఆర్ఎన్ఆర్ వంగడాలను సాగుచేశారు.

సేంద్రియ పద్ధతులతో తక్కువ ఖర్చుతో సాగు చేయడం గమనించిన పలువురు రైతులు కూడా ఆయన వద్ద విత్తనాలు తీసుకుని అరుదైన వంగడాలను పండిస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం వినియోగించిన విత్తనాలను ఈ ఏడాది సేకరించారు. అంతరించిపోతున్న 36 రకాల వరి విత్తనాలను.. ఒక్కో రకం 100 గ్రాముల చొప్పున సేకరించి. కేవలం 10 గుంటల్లో విత్తనోత్పత్తి చేస్తున్నారు. వాటిలో తెలుపు, ఎరుపు, నలుపు రంగు వరి ధాన్యాలున్నాయి.

చమర్ మామ్, రక్తశాలి, సిద్ధసన్నాలు, మైసూర్ మల్లిగ, కంద సాగర్, బోరచంపా, మోహిని, కాలబట్టి, కాలచంపా, జాన్కార్, బహురూపి, జఠా, తదితర రకాలను పండిస్తున్నారు. 130 రోజుల నుంచి 150 రోజులు కోతకు వచ్చేవి ఉన్నాయి. జీవామృతం, ఘన జీవామృతం, పుల్ల మజ్జిగ, తదితర సేంద్రియ ఎరువులనే వినియోగిస్తారు. ఇందు కోసం ఇంటి వద్ద రెండు ఆవులను పెంచుతున్నారు. గోఆధారిత వ్యవసాయం లాభసాటిగా ఉంటోందని కుమార స్వామి చెబుతున్నారు.

రైతు కుమారస్వామి ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ సేంద్రియ సాగు రైతుగా సన్మానం పొందారు. అలాగే మైసూర్ లో జరిగిన పది రాష్ట్రాల సేంద్రియ రైతుల మేళాలో పాల్గొన్నారు. అలాగే గ్రామ భారతి ఆధ్వర్యంలో నిర్వహించే రైతు కార్యక్రమాల ద్వారా మెలకువలు నేర్చుకుంటున్నారు. పాత రకాల వరివంగడాల్లో ఆరోగ్యానికి మేలు చేసేవే. ఎక్కువ అంతరించిపోతున్న బర్మాబ్లాక్, మణిపూర్ బ్లాక్, కృష్ణవ్రీహి, కాలాసూర్, కుజిపటాలియ లాంటి వారి వంగడాలను సాగుచేయడం హర్షణీయం.

వాటిలో పోష కాలు ఎక్కువగా ఉంటాయి. బ్లాక్ రైస్లో బీటా కెరో టిన్ ఉంటుంది. కంటి చూపునకు ఎంతో మంచిది.. దిగుబడి తక్కువగా వచ్చినా ఆరోగ్యానికి మంచిదని జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ చెప్పారు. రసాయన ఎరువులతో అనారోగ్యానికి గురైనట్లు తెలుసుకుని బియ్యమే కాకుండా పత్తి, మిర్చి, వేరుశనగ, కూరగాయలను కూడా సేంద్రియ పద్ధతిలోనే పండిస్తున్నాను. ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు రావడం లేదని ఎవరైనా విత్తనాలు కావాలంటే ఇస్తున్నాని రైతు మణిగంటి కుమారస్వామి చెబుతున్నారు.

"గత నాలుగు సంవత్సరాల నుంచి గోఆధారిత వ్యవసాయం చేస్తున్నా. అందులో భాగంగా దేశవాళి రకాలను పండిస్తున్నా. మంచి అరుదైన రకాలను పండిస్తూ ప్రోటీన్, పోషక విలువలు ఎక్కువగా ఉన్నా వంగడాలను ఉత్పత్తి చేస్తున్నా. మొత్తం 36 రకాల వరి వంగడాలను ఉత్పత్తి చేస్తున్నా. దేశవాళీ రకాలలో ఉండే పోషకాలు హైబ్రీడ్ రకాలలో ఏ మాత్రం ఉండవు. అందుకే దేశవాళి విత్తనాలు సాగుచేస్తున్నా."-మణిగంటి కుమారస్వామి, రైతు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.