ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించి, ప్రజలకు నమ్మకం కల్పించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనా నియంత్రణ, ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కొవిడ్ హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసిన బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, జిల్లాలో ప్రస్తుతం కొవిడ్ పాజిటివిటి రేటు 20 శాతం ఉందని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి కరోనా నియంత్రణకు కృషి చేయాలన్నారు.
ఆక్సిజన్, రెమ్డెసివర్ కొరత లేదు..
ఇంటింటికీ ఆరోగ్య సర్వే నిర్వహించి లక్షణాలున్న 5,510 మందికి మందులతో కూడిన హెల్త్ కిట్లు అందజేశామని, ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు చేపట్టి 1,889 మందికి హెల్త్ కిట్లు అందజేశామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. 4 రోజులు మందులు వాడిన లక్షణాలు తగ్గని 54 మందికి స్టెరాయిడ్స్ ఇవ్వడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో పడకలు, ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదన్నారు. ఎవరైనా కరోనా బారిన పడితే భయంతో హైదరాబాద్, వరంగల్కు వెళ్లకుండా జనగామకు వచ్చి చికిత్స పొందాలని, అక్కడ లేని సౌకర్యాలు జనగామ ఆసుపత్రిలో ఉన్నాయన్నారు.
పండించిన చివరి గింజనూ కొంటాం..
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. జిల్లా వ్యాప్తంగా 195 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. రోజుకు 5000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రైతులు కొన్ని రోజులు ఓపిక పట్టాలని... ఆలస్యమైనా పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని వివరించారు. రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.
ఇవీ చదవండి: నేడు, రేపు కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిపివేత