Hanuman Jayanti 2023 : కొండగట్టులో వైభవంగా హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు
Published: May 14, 2023, 10:17 AM


Hanuman Jayanti 2023 : కొండగట్టులో వైభవంగా హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు
Published: May 14, 2023, 10:17 AM
Hanuman Jayanti celebrations in Kondagattu : తెలంగాణలోని ప్రసిద్ధ హనుమాన్ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయం రామనామ జపంతో మార్మోగుతుంది. పెద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హనుమాన్ దీక్షాధారులు తరలివస్తున్నారు. పవనసుతుని భజనలు చేస్తూ బారులు తీరి స్వామిని దర్శించుకున్నారు.
Hanuman Jayanti celebrations in Kondagattu : జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం రోజును పురస్కరించుకొని ఏటా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఇవాళ కార్యక్రమాల్లో భాగంగా.. స్వామి వారికి 108కిలోల పండ్లతో అభిషేకం, చమేలీ తైలంతో చందనాలంకరణ నిర్వహించారు. యాగశాలలో స్థపన తిరుమంజనం, లక్ష తమలపాకులతో అర్చన నిర్వహించనున్నారు.
"ఇవాళ కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. ఈరోజు స్వామి వారిని దర్శించుకున్నట్లయితే బుద్ధి, బలం, ఆరోగ్యం లభిస్తాయి. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు".- జితేందర్, ఆలయ ప్రధానార్చకులు
హనుమాన్ జయంతి సందర్భంగా అంజన్న ఆలయం విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిపోతోంది. మండలం రోజులు నిష్టతో ఆచరించిన వేలాది మంది మాలధారులు దీక్ష విరమణ కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరటంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల కోసం అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొండగట్టులో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
"కొండగట్టులో యాత్ర చాలా బాగుంది. అధికారులు ఏర్పాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కోనేరులో ఎప్పటికప్పుడు నీరు నింపుతున్నారు. దర్శనం కూడా వేగంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం కన్నా ఈ ఏడాది ఏర్పాట్లు చాలా బాగున్నాయి. దర్శనంలో ఎటువంటి అసౌకర్యం లేదు. చాలా హ్యాపీగా దర్శనం జరిగింది."- భక్తులు
కరీంనగర్లో హింతూ ఏక్తా యాత్ర: హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ కరీంనగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరుకానున్నారు. సాయంత్రం 4 గంటలకు వైశ్యభవన్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు నిర్వహకులు తెలిపారు.
Hanuman Jayanti celebrations in Telangana : మరోవైపు హనుమాన్ జయంతి పరష్కరించుకొని భద్రాద్రి రామాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఇవాళ కార్యక్రమాల్లో భాగంగా.. ప్రధాన ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామికి విశేష అభిషేకం.. సాయంత్రం ఆంజనేయ స్వామికి తిరువీధి సేవ, సుందరకాండ పారాయణం జరపనున్నారు.
ఇవీ చదవండి:
