మల్లన్న జాతరకు... యాభైవేల బోనాలు!

author img

By

Published : Mar 28, 2021, 1:07 PM IST

Fifty thousand bonalu For Mallanna fair in peddapur

ఆ ఊళ్లో ఆదివారం నాడు మాంసం, మద్యం ముట్టకపోవడం ఒకెత్తయితే... ఏడాదికోసారి మల్లన్నజాతర పేరుతో స్వామికి యాభైవేల బోనాలను సమర్పించి తమ భక్తిని చాటుకోవడం మరొకెత్తు. ఆ సమయంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆ ఊరివాళ్లంతా అక్కడకు చేరుకుని కుటుంబ సమేతంగా వేడుకలో పాల్గొనడం ఓ సంప్రదాయంగా పాటిస్తారు. మరెన్నో విశేషాలున్న ఈ జాతరను చూడాలంటే జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్‌కి వెళ్లాలి.

చుట్టూ పచ్చని పొలాలున్న ఊరి మధ్యలో కనిపిస్తుంది మల్లికార్జునస్వామి దేవాలయం. స్వామిని తమ ఇలవేల్పుగా కొలిచే ఈ గ్రామస్థులు ఏడాదికోసారి హోలీ తరువాత వచ్చే ఆదివారం నాడు... పెద్ద ఎత్తున నిర్వహించే వేడుకే మల్లన్నస్వామి జాతర. ఏటా యాభైవేలకు పైగా సమర్పించే ఈ బోనాల కార్యక్రమాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు లక్షమంది భక్తులు ఈ ఊరికి చేరుకుంటారు. ఈ ఆలయం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ గ్రామంలో ఉంది. ఈ ఏడాది మార్చి 28న జాతరను నిర్వహిస్తున్నారు భక్తులు.

భోనాలతో భక్తుల సందోహం...

స్థలపురాణం
గర్భగుడిలో గుర్రంపైన కూర్చుని భక్తులకు దర్శనమిచ్చే మల్లన్నస్వామి వందేళ్లక్రితం ఈ ఊళ్లో రాయి రూపంలో వెలిశాడని అంటారు. అయితే... మొదట్లో ఈ ఊళ్లోని యాదవులు మాత్రమే స్వామిని పూజించేవారనీ, కొన్నాళ్లకు ఊరివాళ్లంతా తమ ఇలవేల్పుగా కొలవడం ప్రారంభించారనీ చెబుతారు స్థానికులు. మొదట తాటికమ్మలతో వేసిన చిన్న గుడిసెలోనే ఈ ఆలయం ఉండేదనీ క్రమంగా ఇక్కడకు వచ్చే భక్తులు గర్భగుడిని నిర్మించారనీ అంటారు. సంతానం, పెళ్లి, వ్యాపారం, ఇల్లు... ఇలా ఏది కోరుకుని స్వామికి మొక్కుకున్నా నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం. అలా తమ కోరికలు తీరినప్పుడల్లా భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నా... ఏడాదికోసారి ఇలా జాతర నిర్వహిస్తారు.

రెండురోజుల ముందే...
జాతరకు ముందురోజున ...అంటే శనివారం సూర్యోదయం వేళలో ఆలయంలోని మల్లన్నస్వామి విగ్రహాన్ని గోదావరి నదికి తీసుకెళ్తారు. ఆ తరువాత గ్రామ సింహద్వారం నుంచి డప్పు చప్పుళ్లతో శోభాయాత్రగా తీసుకొచ్చి మళ్లీ ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. ఆ రాత్రి స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించి మర్నాడు బోనాలను సమర్పిస్తారు. ఉదయం పూట భక్తులు స్వామి వారిని దర్శించుకుని పసుపు, బెల్లం, గొర్రెపిల్లలను కానుకలుగా సమర్పిస్తారు. ఉపవాస దీక్షతో స్వామికి నైవేద్యం వండి ఆ తరువాత యాభైవేలకు పైగా బోనాలు సమర్పిస్తారు. ఆ సమయంలో ఒకేసారి ఆలయం చుట్టూ బోనాలతో భక్తులు చేసే ప్రదక్షిణ చూసేందుకు రెండుకళ్లూ చాలవంటారు. శివసత్తుల పూనకాలు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు, రథోత్సవంతో ఆ ప్రాంతం కళకళలాడుతుంది. మంగళవారం నాగవెల్లి నిర్వహించి రాత్రి స్వామికి ఒగ్గుకథ చెబుతారు. అది పూర్తయ్యాక ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం మీదుగా భక్తులు నడవడంతో ఈ జాతర పూర్తవుతుంది.

ఉత్సవాళ్లో సంస్కృతిక కార్యక్రమాలు...

మాంసం తినరు

ఈ ఆలయంలో ఒకటే ధర్మశాల ఉండటంతో దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్థానికులు ఆశ్రయం కల్పిస్తారు. ఈ జాతర పూర్తయ్యేవరకూ ఒక్కో ఇల్లు పదిహేను నుంచి ఇరవై కుటుంబాలకు విడిది కల్పించడం విశేషం. అంతేకాదు... సాధారణంగా మంసాహారు లెవరైనా ఆదివారం వచ్చిందంటే మాంసం లేనిదే ముద్ద దిగదని చెబుతుంటారు, కానీ పెద్దాపూర్‌ గ్రామస్థులు మాత్రం ఆదివారం రోజున మాంసం, మద్యం ముట్టరు.
వివాహాది శుభకార్యాలు చేసుకుంటున్నా, పండగలు వచ్చినా సరే ఆదివారం మాత్రం మాంసం ముట్టమనీ, ఇది స్వామికి ఇచ్చిన మాటనీ చెబుతారు గ్రామస్థులు. అంతేనా ఈ గ్రామస్థులు వేరే ప్రాంతాలకు వెళ్లినా సరే... ఆదివారం మాత్రం మాంసం ముట్టకుండానే ఉంటారు.

ఎలా చేరుకోవచ్చంటే..

జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి పెద్దాపూర్‌ గ్రామం 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగిత్యాల వరకూ చేరుకుంటే... అక్కడినుంచి జాతరకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులతో పాటు ప్రయివేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఇదీ చూడండి: 'ఈ హోలీతో కలర్​ఫుల్​ లైఫ్​కి వెల్​కమ్ చెబుదాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.