అద్దెగర్భంలో ఆవుదూడలు.. పాడి పశువుల్లోనూ తొలిసారి 'సరోగసీ' సక్సెస్​

author img

By

Published : Jul 27, 2022, 4:05 AM IST

Updated : Jul 27, 2022, 4:13 AM IST

Animals Surrogacy

Animals Surrogacy: రాష్ట్రంలో పాడి పశువులకు సరోగసీ విధానాన్ని అమలుచేయగా.. తొలిసారి మూడు దూడలు పుట్టాయి. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ(ఎల్‌డీఏ), కోరుట్ల పశువైద్య కళాశాల సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడం.. పాడి పశువుల అభివృద్ధికి కీలక మలుపు అని ఎల్‌డీఏ సీఈఓ డా.మంజువాణి తెలిపారు.

Animals Surrogacy: అద్దెగర్భం (సరోగసీ) విధానం రాష్ట్రంలో పాడి పశువులకు అమలుచేయగా తొలిసారి మూడు దూడలు పుట్టాయి. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ(ఎల్‌డీఏ), కోరుట్ల పశువైద్య కళాశాల సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమై ఒక ఆవుకు పెయ్య, మరో ఆవుకు కోడె కవల దూడలు జన్మించాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడం రాష్ట్రంలో పాడి పశువుల అభివృద్ధికి కీలక మలుపు అని ఎల్‌డీఏ కార్యనిర్వహణాధికారి (సీఈఓ) డాక్టర్‌ మంజువాణి చెప్పారు. రాష్ట్రంలో పశుగణాభివృద్ధికి ఆ సంస్థ అనేక కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగా సరోగసీ విధానం చేపట్టి.. సాహివాల్‌ దేశీజాతి గిత్త నుంచి సేకరించిన వీర్యాన్ని ప్రయోగశాలలో ఫలదీకరణం చేయించి ఆ ఎంబ్రియోలను జెర్సీ ఆవు గర్భంలో ప్రవేశపెట్టగా ఈ దూడలు పుట్టాయి. కేంద్రం ఈ ప్రాజెక్టు అమలుకు రూ.5.83 కోట్లను రాష్ట్రానికి మంజూరుచేసి ఎల్‌డీఏను నోడల్‌ ఏజెన్సీగా నియమించింది.

.

ఈ ప్రయోగాన్ని జగిత్యాల జిల్లా కోరుట్ల పశువైద్య కళాశాలలో చేపట్టి మొత్తం 19 ఎంబ్రియోలను ప్రయోగశాలలో అభివృద్ధి చేసి ఆవుల గర్భంలో ప్రవేశపెట్టినట్లు ఆమె వివరించారు. వీటిలో 3 దూడలు పుట్టాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కుచునూరుపల్లిలో అరవిందరెడ్డికి చెందిన జర్సీ ఆవుకు పెయ్య(ఆడ) దూడ, ఇదే జిల్లా రాయికల్‌ మండలం సింగారావుపేట రైతు రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఆవుకు కవల మగదూడలు పుట్టాయి. సరోగసీ విధానంలో ఎంబ్రియోలను ఆవుల గర్భంలో ప్రవేశపెట్టిన తరవాత ఇలా దూడలు పుట్టడం రాష్ట్రంలో ఇదే ప్రథమం అని ఆమె వివరించారు. రైతుల ఆర్థికాభివృద్ధికి, పాల ఉత్పత్తి పెంచడానికి పెయ్యదూడలు మాత్రమే పుట్టేలా మేలైన గిత్త వీర్యాన్ని ప్రయోగశాలలో విభజించే పరిజ్ఞానంపై ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నామని, వచ్చే ఏడాదికల్లా అది కూడా సాధిస్తామన్నారు. అధికంగా పాలు ఇచ్చే ఆవుల ఉత్పత్తికి ఈ పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దేశంలో కొన్ని ప్రైవేటు సంస్థలు సరోగసీ విధానంలో దూడలు పుట్టేందుకు ఒక ఎంబ్రియోను పాడి పశువు గర్భంలో ప్రవేశపెట్టడానికి రుసుం కింద రూ.16500 వసూలు చేస్తున్నాయి. కానీ ఎల్‌డీఏ పూర్తి ఉచితంగా రాష్ట్ర రైతులకు దీనిని అందుబాటులోకి తెచ్చినట్లు మంజువాణి చెప్పారు.

ఇదీ చదవండి: తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం.. 18 మందికి పాజిటివ్​

Last Updated :Jul 27, 2022, 4:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.