నా చెట్టును నరికేశారు.. వారిపై చర్యలు తీసుకోండి..!

author img

By

Published : Aug 30, 2021, 12:50 PM IST

నా చెట్టును నరికేశారు.. వారిపై చర్యలు తీసుకోండి..!

తాను ప్రేమగా పెంచుకున్న చెట్టును నరికిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వ్యక్తి నిరసనకు దిగాడు. స్పందించిన అధికారులు... చెట్టును నరికిన వ్యక్తికి రూ.5 వేల జరిమానా విధించారు. అదే స్థానంలో మరో మొక్కను కూడా నాటారు.

తాను నాటిన చెట్టును కొట్టేశారని... వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి నిరసనకు దిగాడు. పట్టణంలోని ఎల్​జీరాం లాడ్జీ వెనుక ఉండే ప్రభాకర్... రోడ్డపై బైఠాయించాడు. తన ఇంటిముందు నాటిన చెట్టును... తన అన్న రాజేశమే కావాలని నరికేసినట్లు తెలిపాడు.

నా చెట్టును నరికేశారు.. వారిపై చర్యలు తీసుకోండి..!

నా పేరు ప్రభాకర్. మా తండ్రి పేరు లింగన్న. మేము మొత్తం ఐదుగురం అన్నదమ్ములం. ఉమ్మడి ఆస్తిలో... నేను దుబాయి వెళ్లిపోయినపుడు మా అన్నగారే ఎదురుంగ రెండు షెటర్లు వేసినాడు. నేను తిరిగొచ్చిన తర్వాత కూడా ఆయన వేసిన షెటర్లకు కిరాయి ఆయనే తీసుకుంటూ... మాకు అన్యాయం చేస్తున్నడు. ఉమ్మడి ఆస్తిని పంచిస్తలేడు. నా మీద కక్ష సాధింపు కోసం నేను పెట్టిన చెట్టు... దాదాపు అయిదారేళ్ల క్రితం నుంచి కష్టపడి పెంచిన చెట్టును నరికి... రాజేశం దాన్ని పెట్రోల్ పోసి భూస్తాపితం చేసిండు. కలెక్టర్ గారు, ప్రభుత్వమేమో మొక్కలను పెంచండి అని చెప్తరు. వీళ్లు మాత్రం ఇట్ల చేసుడు అమానుషం. నన్ను మానసికంగా హింసించినారు. నేను కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్న. దయచేసి చెట్టుకు, నాకు న్యాయం చేయండి. - ప్రభాకర్, నిరసనకారుడు

తనకు రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా మానసికంగా వేధించాలనే ఉద్దేశంతోనే... ఆరేళ్లుగా ప్రాణంగా పెంచుకున్న చెట్టును కొట్టేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఓ వైపు చెట్లు నాటాలని చెబుతుంటే మరోవైపు కొందరు చెట్లు నరుకుతున్నారని ప్రభాకర్ పేర్కొన్నాడు. అలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. తాను ఎంతో కష్టపడి పెంచుకున్న చెట్టును కొట్టేసిన సోదరుడు రాజేశాన్ని శిక్షించాలని కోరాడు.

ఈ రోజు ఈ ఎల్​జీ రాం లాడ్జీ వెనుక భాగంలో... ఒక చెట్టును నరికివేశారని చెప్పి మాకు కంప్లైంట్ చేస్తే మేము వచ్చినం. స్థానికంగా వచ్చి పరిశీలిస్తే.. చుట్టుపక్కల వాళ్లని అడిగితే ఎవరూ ఏం చెప్తలేరు. ఎవరు కొట్టేస్సిర్రనేది చెప్తలేరు. కానీ ఆ ఇంటి ఓనర్ మీద మేము ఫైన్ ఇంపోజ్ చేసినం. దానికి ఐదు వేల రూపాయల ఫైన్ కూడా వేసినం. వారు ఫైన్ చెల్లించడం జరిగింది. తర్వాతిప్పుడు మొక్కను కూడా నాటిస్తున్నం. అదే స్థానంలో వేరొక మొక్కను నాటిస్తున్నం. - మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ అధికారి

స్పందించిన మున్సిపల్ అధికారులు చెట్టు నరికిన... రాజేశానికి 5 వేల రూపాయల జరిమానా విధించారు. అదే స్థానంలోనే మరో మొక్కను కూడా నాటారు.

ఇదీ చూడండి: మహిళను వివస్త్రను చేసి.. వీధుల్లో తిప్పుతూ.. సభ్యసమాజం సిగ్గుపడేలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.