Kadapa Flood Victim: వరద మిగిల్చిన వేదన.. భర్త ఆచూకీ కోసం భార్య తపన

author img

By

Published : Nov 24, 2021, 9:06 PM IST

kadapa flood victims

చూస్తుండగానే వరద వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కళ్ల ముందే కట్టుకున్నోడు (women search for husband dead body) కనుమరుగయ్యాడు. వరద పోయాక ఆమె తన వాళ్ల కోసం కళ్లలో వత్తులేసుకుని వెదుకుతోంది. భర్త మృతదేహం ఆ చుట్టుపక్కలే ఉందని ఆమెకు ఎవరో చెప్పారు. అంతే..కాళ్లరిగేలా వెదుకుతూనే ఉంది కానీ భర్త కానరాలేదు. కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరుకు చెందిన ఆయేషా ఆవేదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.

Flood Victim: వరద మిగిల్చిన వేదన.. భర్త ఆచూకీ కోసం భార్య తపన

పోలీసులు అక్కడ ఉన్నారు.. శవాలను తీస్తున్నారు పోయి నీ భర్త శవం ఉన్నదేమో చూసుకోండని ఎవరో చెప్పారు. అక్కడ చూస్తే ఏ శవమూ లేదు.. ఎవరిని అడగాలో తెలియడం లేదు. పోలీసులను చూస్తే సాయం చేసేలా కనిపించడంలేదు. పోలీసులకు ఎన్ని సార్లు ఫోన్​ చేసినా స్విచ్​ఆఫ్​ వస్తోంది. ఇంకెవరిని అడగాలో తెలియడం లేదు.. ఉగ్రరూపం దాల్చిన ప్రవాహంలో కొట్టుకుపోయిన భర్త జాడ కోసం గాలిస్తున్న ఓ భార్య కన్నీటి ఆక్రందన ఇది!

రుధ్రభూమిగా మారిన పరిసరాల్లో భర్త జాడకోసం... అశ్రువులు నిండిన నయనాలతో శోధిస్తోంది ఆ మహిళ.. వరద మిగిల్చిన విషాద బురదలో భర్త కోసం వెతుకుతుండగా.. ఏ శవం కాలికింద తగులుతుందో తెలియదు.. ఉబికి వస్తున్న కన్నీటితో కంటి చూపు మసకబారుతుంటే.. కనుగుడ్డును తుడుచుకుంటూ.. ఆ కనిపించే శవం తన భర్తది కాకపోయి ఉంటే బాగుండు.. అనుకుంటూనే తన భర్తదేమోననే భయంతో వెతుకులాడుతోంది.

వరద ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కళ్ల ముందే భర్త నీటి ప్రవాహంలో కనుమరుగయ్యాడు. ఆరు రోజులు గడిచిన ఇంతవరకూ ఆచూకీ దొరకలేదు. తన భర్త మృతదేహం కోసం కళ్లలో వత్తులేసుకుని వెదుకుతోంది....కడపజిల్లా రాజంపేట మండలం గుండ్లూరుకు చెందిన ఆయేషా. ఎక్కడ శవం కనిపించిందని తెలిసినా పరుగెత్తుకుంటూ వెళ్తోంది.. అది తన భర్తది కాకూడదు అని దేవుడిని పార్థిస్తూనే.. తన భర్త జాడ చూపించమని వేడుకుంటుంది. ఇవాళ వస్తాడు.. రేపు కచ్చితంగా కనిపిస్తాడు అనుకుంటూనే ఇన్ని రోజులు ఎదురు చూసింది.. చివరికి భర్త శవంగానైనా ఇంటికి వస్తాడా అని చూస్తోంది. ఓట్లు కోసం ఇంటి చుట్టూ తిరిగే నేతలు... తమ పసుపుకుంకాలు కొట్టుకుపోయిన వేళ ఏమయ్యారంటూ ప్రశ్నిస్తోంది.

'వర్షాకాలం ఆ డ్యామ్​ ఖాళీగా ఉండాలి.. వచ్చిన నీళ్లు దానిలో నిల్వ ఉంటాయి. ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడప్పుడూ వదిలేస్తూ ఉండాలి. వరదలు, వర్షాల గురించి ప్రభుత్వాలకు ముందే తెలుస్తుంది కదా.. మరి అప్పుడేమయ్యారు. ఒక్క ప్రాణం పోయినా ప్రభుత్వానిదే కదా సార్​ బాధ్యత.. మళ్లీ ఓట్ల కోసం ఇంటి చుట్టూ తిరుగుతారు.. అమ్మా ఓటు అయ్యా ఓటు అని.. అప్పటికి ఈ ప్రజలు బతికి ఉంటేనే కదా.. ఓట్లు అడుగుతారు.. ఈ ప్రజలు ఉంటేనే కదా అప్పుడు మీకు ఓటు వేసేది..' అంటూ ఇన్ని రోజులుగా తన మదిలో గూడుకట్టుకున్న వేదనను కన్నీటి పర్యంతమవుతూ వెళ్లగక్కింది..

కనీ వినీ ఎరగని జల ప్రళయం ఇళ్లను చుట్టుముట్టి.. కల్ల ముంది అయినవాళ్లను తనలో కలిపేసుకుంటే.. ఆ ప్రకృతిపై కోపాన్ని.. మరుగుతున్న రక్తం సాక్షిగా.. ఉబుకి వస్తున్న కన్నీటి తోడుగా.. ఇలా చెప్పుకుంది..

'వచ్చింది సార్​.. సర్వ నాశనమై పోయే కాలం వచ్చింది. ఇక మనిషి అనే వాడు ఉండడు... పాపం పండిపోయింది..అందుకే సార్​ ఏదో ఒక రూపంలో కోట్ల సంఖ్యలో శవాలు కుప్పలుగా మారుతున్నారు. పేద, బీద అనేది ఏమీ లేదు.. అంతా నాశనం అయిపోయింది...' అంటూ మాటకు అడ్డుపడిన దుఃఖాన్ని ఆపుకోలేక గొంతు ఆమె గొంతు మూగబోయింది..

ఇదీ చూడండి: child death with vaccine: ఒకేసారి ఐదు టీకాలు.. మూణ్నెళ్ల చిన్నారి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.