డేటా విశ్లేషణ కోసం ఐఎస్బీతో TSRTC అవగాహన ఒప్పందం

డేటా విశ్లేషణ కోసం ఐఎస్బీతో TSRTC అవగాహన ఒప్పందం
TSRTC MoU With ISB: డేటా విశ్లేషణ కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో టీఎస్ఆర్టీసీ అవగాహన ఒప్పందం చేసుకుంది. రూట్ల క్రమబద్ధీకరణ, లాభాల గరిష్ఠీకరణపై డేటా విశ్లేషణ కోసం ఈ ఒప్పందం దోహదం చేస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇది ఇతర ప్రజా రవాణా సంస్థలకు రోల్ మోడల్గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
TSRTC MoU With ISB: టీఎస్ఆర్టీసీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో డేటా విశ్లేషణ కోసం అవగాహన ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లోని ఐఎస్బీ క్యాంపస్లో ఇవాళ టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల సమక్షంలో ఐఎస్బీ డేటా సైన్స్ విభాగ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనీష్ గంగ్వార్, టీఎస్ఆర్టీసీ ఐటీ చీఫ్ ఇంజినీర్ రాజశేఖర్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
రూట్ల క్రమబద్ధీకరణ, లాభాల గరిష్ఠీకరణపై డేటా విశ్లేషణ కోసం ఐఎస్బీతో చేసుకున్న ఈ అవగాహన ఒప్పందం దోహదం చేస్తుందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇది ఇతర ప్రజా రవాణా సంస్థలకు రోల్ మోడల్గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎస్ఆర్టీసీ 10 వేల బస్సులతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చుతోందని పేర్కొన్నారు. ప్రతి రోజు సగటున 35 లక్షల మంది ప్రయాణికులు తమ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని చెప్పారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంతో పాటు ప్రజల సురక్షిత ప్రయాణానికి ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన, మెరుగైన సేవలందిస్తోన్న టీఎస్ఆర్టీసీతో కలిసి పని చేయడం గొప్ప అనుభవమని ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ రవాణా వ్యవస్థను పటిష్ఠపరచడానికి డేటా విశ్లేషణ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
ఇవీ చూడండి..
మీరు ప్రయాణించాల్సిన ఆర్టీసీ బస్సు ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా...?
భక్తులకు గుడ్న్యూస్.. వసంత పంచమికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
