TSRTC Electric Buses Launch Today : నేడు భాగ్యనగరంలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రారంభం

author img

By

Published : May 15, 2023, 7:13 PM IST

Updated : May 16, 2023, 7:18 AM IST

TSRTC Electric Buses Launch

TSRTC To Launch Electric Buses : టీఎస్​ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్​-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. వాటిలో 10 బస్సులను నేడు ప్రారంభించనుంది. మిగతా బస్సులు ఈ ఏడాది చివరినాటికి విడతల వారీగా అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.

TSRTC To Launch Electric Buses : పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించే ఈ బస్సులకు టీఎస్​ఆర్టీసీ 'ఈ-గరుడ'గా నామకరణం చేసింది. హైటెక్ హంగులతో ప్రయాణికులకు ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చామని, హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకి ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని ఆ సంస్థ ప్రకటించింది.

హైదరాబాద్​లో ఆర్టీసీ డబుల్​ డెక్కర్ బస్సులు: రాబోయే రెండేళ్లలో కొత్తగా 1,860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపింది. వాటిలో 1,300 బస్సులను హైదరాబాద్ సిటీలోనూ.. అలాగే 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామని పేర్కొంది. భాగ్యనగరంలో 10 డబుల్ డెక్కర్ బస్సులను ఇవాళ ప్రారంభిస్తామని వివరించింది. హైదరాబాద్​లో ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు మియాపూర్ క్రాస్ రోడ్ సమీపంలోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద నేడు సాయంత్రం 5 గంటలకు ప్రారంభోత్సవం జరగనుంది.

అందుబాటులోకి రానున్న 'ఈ-గరుడ': దీనికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్​తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 'ఈ-గరుడ' బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇవి హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్​ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు.

41 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో ప్రతి సీటు దగ్గర మొబైల్ చార్జింగ్ సౌకర్యంను ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేశారు. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను బిగించారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది.

బస్సులోని ప్రయాణికులను లెక్కించే ఆటోమెటిక్ ప్యాసింజర్ కౌంటర్(ఏపీసీ) కెమెరాను అమర్చారు. ఈ బస్సులకు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనుక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిపిప్తాయి. అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఈ ఏసీ బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టంను కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సులను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. సుమారు 325 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :May 16, 2023, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.