TSRTC BUS Charges Hike: ఆర్టీసీ ఛార్జీల పెంపు దస్త్రం సీఎం కార్యాలయానికి!

author img

By

Published : Nov 10, 2021, 6:56 AM IST

TSRTC BUS Charges Hike

టీఎస్​ఆర్టీసీ ఛార్జీల పెంపుదల దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఇటీవల సంస్థ యాజమాన్యం బస్సు ఛార్జీలు పెంచాలని నిర్ణయించింది. దీనిపై త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బస్సు ఛార్జీలు(tsrtc bus ticket price) పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఛార్జీల పెంపుదల దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి (cmo) చేరింది. ఇటీవల రవాణా మంత్రి అజయ్‌ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్‌, అధికారులు ముసాయిదా ప్రతిపాదనలను రూపొందించారు. పల్లెవెలుగు, ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటరుకు 25 పైసల చొప్పున, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో బస్సులకు 30 పైసల చొప్పున పెంచాలని ప్రతిపాదించారు. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సమ్మె తర్వాత పెరిగిన ఛార్జీలు..

ఆర్టీసీలో 48,189 మంది ఉద్యోగులు, 9,705 బస్సులు ఉన్నాయి. కొవిడ్​కు ముందు ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 37.93 లక్షల మంది ప్రయాణించేవారు. ఆ తర్వాత బస్సులెక్కేవారి సంఖ్య తగ్గినప్పటికీ... ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో సుమారు 35 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. 3,422 రూట్లలో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం ఆర్టీసీలో సమ్మె తర్వాత 2019 డిసెంబరులో ఛార్జీలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో కిలోమీటర్​కు రూ.20 పైసల చొప్పున ఆర్టీసీ పెంచింది. ఆ తర్వాత చిల్లర కష్టాల పేరుతో మరో 10పైసలు పెంచింది.

ఇప్పుడు ఎంత వసూలు చేస్తున్నారంటే..

ప్రస్తుతం ఆర్టీసీ సంస్థలో మొత్తం 17 రకాల సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సుల్లో సీటింగ్ కెపాసిటీ తక్కువలో తక్కువ 30 సీట్ల నుంచి ఎక్కువలో ఎక్కువ 59 సీట్ల వరకు ఉంటుంది. కిలోమీటర్​కు కనీస ఛార్జీ రూ.10 నుంచి గరిష్ఠ ఛార్జీ రూ.35 వరకు ఉంది. ఆర్టీసీలో టికెట్ ఛార్జీలను ఎప్పుడైనా ఓఆర్ ఫ్యాక్టరీని దృష్టిలో పెట్టుకుని పెంచుతారు. వీటి ఆధారంగానే ఛార్జీలు పెంచుతారు. ప్రస్తుతం సిటీ ఆర్డీనరీ బస్సులకు కిలోమీటర్​కు కనీస ఛార్జీ రూ.10, సిటీ సబర్బన్ బస్సులకు రూ.10, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులకు రూ.10, మెట్రో డీలక్స్ రూ.15, పల్లెవెలుగు రూ.10, ఎక్స్ ప్రెస్ బస్సులకు రూ.15, డీలక్స్ బస్సులకు రూ.20, సూపర్ లగ్జరీ బస్సులకు రూ.25, రాజధాని ఏసీ బస్సులకు రూ.35, గరుడప్లస్ ఏసీ బస్సులకు కిలోమీటర్​కు రూ.35 వసూలు చేస్తున్నారు.

ఎంత పెరగనున్నాయంటే..

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై అధికారులు ప్రాథమికంగా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పల్లెవెలుగు బస్సులకు కిలోమీటర్ కు రూ.25 పైసలు, ఎక్స్​ప్రెస్ ఆపైన బస్సులకు కిలోమీటర్​కు రూ.30 పైసలు, సిటీ ఆర్డినరీ బస్సులకు కిలోమీటర్​కు రూ.25 పైసలు, మెట్రో ఎక్స్​ప్రెస్ ఆపై సర్వీసులకు రూ.30పైసలు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవాళ జరిగిన సమావేశంలో.. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ మూకుమ్మడి అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఛార్జీలపై వీరు రూపొందించిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. వీలైనంత త్వరగానే సీఎం కేసీఆర్ ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటారని అభిప్రాయపడ్డారు.

నష్టాలు కొంత తగ్గే అవకాశం..

గడిచిన మూడేళ్లలో ఆర్టీసీ ఆదాయానికి, ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఈ మూడేళ్లలోనే ఆర్టీసీకీ రూ.4,260 కోట్ల నష్టాలు వచ్చాయి. కరోనా వల్ల కొద్దిరోజులు నష్టాలు వస్తే... పెరిగిన డీజీల్ ధరలతో మరికొన్ని నష్టాలు వచ్చాయి. పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవాలంటే టిక్కెట్ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆర్టీసీ యాజమాన్యం అభిప్రాయపడుతుంది. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచితే... ఇప్పుడున్న నష్టాల్లో కొంతమేరకైనా తగ్గే అవకాశాలున్నాయని ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తోంది. తద్వారా ఆర్టీసీ తిరిగి గాడినపడే అవకాశాలున్నట్లు అధికారులు ఆకాంక్షిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.