Revanth Reddy Fires on BJP : 'కాంగ్రెస్‌లో కోవర్టులెవరూ లేరు.. ఎవరి మధ్య విభేదాలు లేవు'

author img

By

Published : May 22, 2023, 6:01 PM IST

Revanth Reddy

Revanth Reddy Fires on BJP : అధికారంతో విర్రవీగిన మోదీకి కర్ణాటక ప్రజలు గుణపాఠం చెప్పారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కలిసికట్టుగా నిలబడితే కర్ణాటక తీర్పు తెలంగాణలోనూ వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూత్ డిక్లరేషన్‌ను భవిష్యత్ కార్యాచరణగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన వెల్లడించారు.

Revanth Reddy Fires on BJP : దేశాన్ని విభజించి అధికారాన్ని పదిలం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందుకే దేశ సమైక్యత కోసం రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని వివరించారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ప్రజల సంపదను అదానీ, అంబానీలకు కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతుందని దుయ్యబట్టారు. అందుకే రాహుల్‌గాంధీ పేదల పక్షాన నిలబడి వారి గళం వినిపించారని వెల్లడించారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈవ్యాఖ్యలు చేశారు.

కర్ణాటక ప్రజలు గుణపాఠం చెప్పారు : ఈక్రమంలోనే కక్షసాధింపు చర్యలో భాగంగా రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోదీని ప్రశ్నించినందుకే రాహుల్ ఇంటిని ఖాళీ చేయించారని విమర్శించారు. అధికారం ఉందని విర్రవీగిన ప్రధానికి కర్ణాటక ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. ఇందులో భాగంగానే కన్నడ ప్రజలను అభినందిస్తూ.. దీనికి కారణమైన మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ను అభినందిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు.

యూత్ డిక్లరేషన్‌ను భవిష్యత్ కార్యాచరణగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. పేదల పక్షాన నిలవాలంటే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలని వివరించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. రాజీవ్‌గాంధీ ఆన్‌లైన్ క్విజ్ కోసం 100 నియోజకవర్గాల్లో 25 లక్షల మందిని నమోదు చేయించాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ క్రియాశీలక పాత్రను ప్రజలకు మరోసారి గుర్తు చేయాలని నేతలకు రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.

కర్ణాటక తీర్పు తెలంగాణలోనూ వస్తుంది : ఈక్రమంలోనే కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేస్తే.. కర్ణాటక తీర్పు తెలంగాణలోనూ వస్తుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీలో కోవర్టులెవరూ లేరని.. ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. పార్టీ కోసం, ప్రజల కోసం పది మెట్లు దిగడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు రేవంత్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, పీసీసీ కార్యవర్గంతో పాటు డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ఛైర్మన్‌లు, పీసీసీ సభ్యులు హాజరయ్యారు.

"అధికారంతో విర్రవీగిన మోదీకి కర్ణాటక ప్రజలు గుణపాఠం చెప్పారు. కలిసికట్టుగా నిలబడితే కర్ణాటక తీర్పు తెలంగాణలోనూ వస్తుంది. యూత్ డిక్లరేషన్‌ను భవిష్యత్ కార్యాచరణగా ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీ జూన్ 2న రాష్ట్రావిర్భావ వేడుకలు ఘనంగా జరపాలి. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో వేడుకలు ఘనంగా జరపాలి. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్రను ప్రజలకు గుర్తు చేయాలి. పార్టీలో కోవర్టులెవరూ లేరు.. ఎవరికీ విభేదాలు లేవు." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి: KCR Review on Telangana Decade Celebrations : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

ఎద్దులబండిపై అసెంబ్లీకి కాంగ్రెస్​ ఎమ్మెల్యే.. గోమూత్రంతో శుభ్రం.. డీకే- బొమ్మై గుడ్​ హగ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.