సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదానికి కారణం షార్ట్​ సర్క్యూట్ కాదు.. మరి దేనివల్ల?

author img

By

Published : Jan 20, 2023, 3:47 PM IST

Secunderabad fire accident

Secunderabad fire accident: సికింద్రాబాద్​లో జరిగిన అగ్ని ప్రమాదం విద్యుదాఘాతం వల్ల జరిగింది కాదని విద్యుత్​శాఖ అధికారి శ్రీధర్​ వెల్లడించారు. ఇది ఇలా ఉంటే భవన యజమాని పరారీ అయ్యాడు. ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు యువకుల ఆచూకీ ఇంకా లభించలేదు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సికింద్రాబాద్​లోని మినిస్టర్​ రోడ్డులో ఉన్న దక్కన్​ నిట్​వేర్​ భవన అగ్ని ప్రమాదం విద్యుదాఘాతం వల్ల జరగలేదని విద్యుత్​ శాఖ అధికారి శ్రీధర్​ తెలిపారు. ఆరో అంతస్తు నుంచి మంటలు రావడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆరోపించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఈ ప్రాంతంలో విద్యుత్​ నిలిపివేసినట్లు ఆయన వివరించారు. మంటలు వ్యాపిస్తున్న సమయంలో విద్యుత్​ మీటర్​లో విద్యుత్​ సరఫరా అవుతుందని.. షార్ట్​ సర్క్యూట్​ అసలు ప్రమాదానికి కారణం కాదని విద్యుత్​శాఖ అధికారి శ్రీధర్​ స్పష్టం చేశారు. అసలు షార్ట్​ సర్క్యూట్​ ఉంటే సబ్​స్టేషన్​లో ట్రిప్​ అయ్యేది కదా అని ప్రశ్నించారు. కానీ సబ్​స్టేషన్​లో అలా జరగలేదన్నారు. నిన్న అగ్ని ప్రమాదం జరిగిందని ఫోన్ ​రాగానే వెంటనే ఆ ప్రాంతానికి విద్యుత్​ను నిలిపివేశామని చెప్పారు. ఒకవేళ షార్ట్​ సర్క్యూట్​ జరిగి ఉంటే మీటర్లు, విద్యుత్​ తీగలు కాలిపోయేవని వెల్లడించారు.

భవన యజమాని పరారీ: సికింద్రాబాద్​ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే భవన యజమాని జావేద్​ పరారీ అయ్యాడు. ఇతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోనే పనిలో పోలీసులు పడ్డారు. దర్యాప్తును ముమ్మరం చేశారు. భవనం చుట్టూ మంటలు వ్యాపించగానే 17మంది కూలీలు భవనం నుంచి బయటకొచ్చారని స్థానికులు తెలిపారు. సామాగ్రి కోసం లోపలికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు లోపల చిక్కుకు పోయారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. చిక్కినపోయిన ఈ ముగ్గురు వ్యక్తులు గుజరాత్​కి చెందిన కార్మికులుగా గుర్తించారు. వీరు జునైద్​, జహీర్​, వసీంగా స్థానికులు వెల్లడించారు.

ముగ్గురి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు: ఈ ఘటనలో ముగ్గురు గుజరాత్ కూలీలు జునైద్(25), జహీర్‌(22), వసీం(32) గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆచూకీ దొరక్కపోవడంతో వీరి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కూలీల సెల్‌ఫోన్లు సిగ్నళ్లు.. కాలిపోయిన భవనంలోనే చూపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. సెల్‌ఫోన్లు లోపలే వదిలేసి ఉండొచ్చన్న కోణంలోనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఒకవేళ వారు భవనం లోపలే చిక్కుకుని ఉంటే మృతదేహాలు కాలి బూడిదై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ముగ్గురి ఆచూకీ కోసం పోలీసులు క్రేన్ సాయంతో గాలిస్తున్నారు. గాలింపు చర్యలు పూర్తైన తర్వాత ఈ భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు.

ఎవరి ఆచూకీ లభించలేదు: భవనం లోపల వారిని కాపాడేందుకు సిబ్బంది ఆ దట్టమైన పొగలో భవనం మధ్యలోకి వెళ్లి గాలించారు. వీరు ఆక్సిజన్​ సిలిండర్లు, ప్రత్యేక మాస్కులు ధరించి భవనం లోపలికి ప్రవేశించారు. ఆరంస్తుల భవనం మొత్తం అణువణువు వెతికారు. ధైర్యంగా అద్దాలను పగలకొట్టి క్షుణ్ణంగా గాలించిన ఎవరి ఆచూకీ లభించలేదు. ఈ దట్టమైన పొగలో సహాయ చర్యల్లో పాల్గొన్న జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారి ధనుంజయ్‌ రెడ్డి.. సిబ్బంది నర్సింగ్‌రావు.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరిని అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరు చికిత్స పొందుతున్నారు. అయితే టైర్లు, రెక్సీన్‌ సామాగ్రి, రసాయనాలు, రంగులు వంటివి.. అధిక శాతం భవనంలో నిల్వ చేయడం వలనే మంటలు వేగంగా తీవ్రంగా వ్యాపించాయని.. అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.