రాష్ట్రంలో బీటెక్‌ గరిష్ఠ రుసుము రూ.1.73 లక్షలు

author img

By

Published : Jul 20, 2022, 4:35 AM IST

బీటెక్‌

రాష్ట్రంలో ఈసారి బీటెక్‌లో అత్యధిక రుసుము సీబీఐటీకి రూ.1.73 లక్షలుగా ఖరారైంది. అదే గ్రూపునకు చెందిన ఎంజీఐటీ ఫీజును రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పుడున్న ఫీజుపై గరిష్ఠంగా 18 శాతమే పెంచుతామని ప్రకటించిన టీఏఎఫ్‌ఆర్‌సీ కొన్నింటికి 40 శాతం వరకూ పెంచినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ఈసారి బీటెక్‌లో అత్యధిక రుసుము సీబీఐటీకి రూ.1.73 లక్షలుగా ఖరారైంది. అదే గ్రూపునకు చెందిన ఎంజీఐటీ ఫీజును రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పుడున్న ఫీజుపై గరిష్ఠంగా 18 శాతమే పెంచుతామని ప్రకటించిన తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) కొన్నింటికి 40 శాతం వరకూ పెంచినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారం కనిష్ఠంగా రూ.10 వేలు, గరిష్ఠంగా రూ.60 వేల వరకు పెరగనున్నాయి.

వచ్చే మూడు విద్యాసంవత్సరాలకు(2022-25) ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ రుసుముల ఖరారుపై టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు ఈనెల 7వ తేదీ నుంచి కళాశాలల యాజమాన్యాలను పిలిచి విచారణ జరుపుతున్నారు. ఈనెల 20తో సమావేశాలు ముగియనున్నాయి. బుధవారం మరో 10 కళాశాలలకు ఫీజుల్ని ఖరారు చేయనుంది. గతంలో మాదిరిగానే ఈదఫా అత్యధిక ఫీజులో సీబీఐటీ ప్రథమ స్థానంలో ఉంది.

ప్రస్తుతం ఆ కళాశాల ఫీజు రూ.1.34 లక్షలు ఉండగా... ఇప్పుడు 2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలకు రూ.1.73 లక్షలుగా ఖరారైంది. అంటే రూ.39 వేలు పెరిగినట్లయింది. ఎంజీఐటీ ఫీజు రూ.లక్ష నుంచి రూ.1.60 లక్షలకు పెరిగింది. టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన ఫీజుపై ప్రభుత్వం జీఓ జారీ చేయాల్సి ఉంటుంది.

మళ్లీ మారుస్తారా?

హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీబీఐటీ, ఎంజీఐటీలకు ఇటీవల టీఏఎఫ్‌ఆర్‌సీ 2016-19 కాలానికి ఫీజులను సవరించింది. సీబీఐటీకి రూ.1.40 లక్షలు, ఎంజీఐటీకి రూ.1.20 లక్షలుగా నిర్ణయించింది. తమకు 2016-19 విద్యా సంవత్సరానికే రూ.1.40 లక్షలుగా నిర్ణయించినప్పుడు 2019-22కు రూ.1,34,500 ఎలా ఉంటుంది? వచ్చే మూడేళ్లకు పెంచాలని సీబీఐటీ మళ్లీ టీఏఎఫ్‌ఆర్‌సీకి విన్నవించుకున్నట్లు తెలిసింది.

ఎంజీఐటీదీ అదే వాదన. ఈక్రమంలో టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన రూ.1.73 లక్షలు, రూ.1.60 లక్షలు అలాగే ఉంచుతారా? మారుస్తారా? లేదో వేచిచూడాలి. ఒకవేళ మార్చే పక్షంలో సీబీఐటీ ఫీజు రూ.2 లక్షలు దాటే అవకాశం ఉందని అంచనా. శ్రీనిధి, సీవీఆర్‌ కళాశాలల ఫీజు రూ.లక్షన్నర వరకు చేరుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వాటి రుసుములు వరుసగా రూ.1.30 లక్షలు, రూ.1.15 లక్షలు ఉంది. స్టాన్లీ మహిళా కళాశాల ఫీజు రూ.78 వేల నుంచి రూ.90 వేలకు చేరింది. మల్లారెడ్డిలోని ఓ కళాశాలకు రూ.65 వేల నుంచి రూ.90 వేలకు పెరగనుంది. అంటే 38 శాతం పెరగడం గమనార్హం. ఓ ప్రముఖ గ్రూపునకు చెందిన మహిళా కళాశాలకు రూ.30 వేలు పెరిగింది.

ఫార్మసీ ఫీజుల నిర్ణయంపై 1నుంచి సమావేశాలు: ఫార్మసీ కళాశాలల ఫీజులు నిర్ణయించేందుకు ఆగస్టు 1 నుంచి 3వ తేదీ వరకు టీఏఎఫ్‌ఆర్‌సీ విచారణ సమావేశాలు జరగనున్నాయి. 3న ఆర్కిటెక్చర్‌ కళాశాలలకు, 10, 11, 12 తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల ఫీజుల ఖరారు కోసం సమావేశాలు నిర్వహిస్తారు. ఒక్కోరోజు 40 నుంచి 52 కళాశాలలకు ఎలా ఫీజుల్ని నిర్ణయిస్తారని తెలంగాణ స్కూల్స్‌, టెక్నికల్‌ కాలేజెస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్‌ ప్రశ్నించారు. అధికశాతం కళాశాలలు.. ఉద్యోగులకు వేతనాలివ్వడం లేదని, వాటితోపాటు ఉద్యోగుల ఖాతాలు, పేస్లిప్‌లను పరిశీలించి ఫీజులను నిర్ణయించాలని ఆయన కోరారు.

రూ.లక్ష, ఆపై ఫీజులున్న కళాశాలలు రెట్టింపు: రాష్ట్రంలో 2016-19కి 191 కళాశాలలకు మూడేళ్ల ఫీజులను నిర్ణయిస్తూ 2019 జులై 5న ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఆ ప్రకారం రూ.లక్ష, ఆపై రుసుములు 21 కళాశాలల్లో ఉన్నాయి. ఈసారి వాటిసంఖ్య రెట్టింపు కానుంది. ప్రస్తుతం రూ.75 వేల నుంచి రూ.లక్షలోపు ఉన్న కళాశాలలు 25 వరకు ఉన్నాయి. వాటిల్లో అధిక కళాశాలల్లో ఈదఫా రూ.లక్ష కానుంది. ఇప్పుడు 160 వరకు మాత్రమే కాలేజీలున్నాయి. అంటే నాలుగో వంతువాటిల్లో ఫీజు రూ.లక్ష, ఆపైన ఉండనుంది. 2016-19కి రూ.లక్ష దాటిన వాటి సంఖ్య కేవలం నాలుగు మాత్రమే.

ఇవీ చదవండి: రైతుబీమా అప్లికేషనల్లో మార్పులకు అవకాశం.. రేపే చివరి తేదీ..!

నీట్ వివాదం.. ఐదుగురు అరెస్ట్.. నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.