TS weather report today : రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు

author img

By

Published : May 21, 2023, 4:49 PM IST

Updated : May 21, 2023, 6:33 PM IST

rains

TS weather report today : తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గత రాత్రి వరంగల్‌లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది.

IMD ts weather report today : తెలంగాణలో ఈ రోజు ద్రోణి విదర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు.. సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

రాగల మూడు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుండి 44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్, చుట్టూ పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుండి 41 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వరంగల్‌లో గాలిదుమారం..: అటు వరుణుడు.. ఇటు వాయుదేవుడు ప్రజలను నానా ఇబ్బందులుకు గురి చేస్తున్నారు. మండు వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలతో పంట నష్టపోయి ఓ వైపు అన్నదాత విలవిలలాడుతుంటే.. ఈదురుగాలులతో ఇళ్ల పైకప్పులు ఎగరిపోయి ప్రజలు నిలువనీడ లేకండా పోతున్నారు. గత రాత్రి వరంగల్ నగరంలో గాలిదుమారం బీభత్సం సృష్టించింది. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటిపై కప్పులు ఎగిరిపోయాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్‌స్తంభాలు విరిగిపోవడం, కరెంట్‌తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అధికారులు సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని కాశీబుగ్గ, చింతల్, జేబీనగర్, ఆర్‌ఎస్‌నగర్, అబ్బోనికుంట, చారబౌలి తదితర ప్రాంతాల్లో 150 పైగా కుటుంబాల నివాసాల పైకప్పులు గాలిదుమారం ధాటికి కొట్టుకుపోయాయి.

రుతుపవనాల రాక ఆలస్యం..: జూన్‌ మొదటి వారంలో వచ్చే నైరుతి రుతుపవానాలు కాస్తంత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే మాట.. వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి వినిపిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా ఖరీఫ్‌ పనులతో పాటు.. పంటల దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. పగటిపూట ఎండతో పాటు వడగాలులు, రాత్రిపూట వర్షంతో కూడిన గాలి దుమారాలు వీస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న భిన్నమైన వాతావరణ స్థితిగతుల కారణంగా.. నైరుతి రుతుపవానాల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఒక్క వర్షంతోనే రైతులు విత్తనాలు వేయడానికి సిద్ధంకాకుండా వ్యవసాయ నిపుణుల సూచనలు, సలహాలు తీసుకొని సరైన సమయంలో విత్తుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

వరంగల్‌లో గాలిదుమారం బీభత్సం

ఇవీ చదవండి:

Last Updated :May 21, 2023, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.