Plaster Of Paris Idols: ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్​పై నిషేధం... మరి మేమెలా బతకాలి?

author img

By

Published : Jun 14, 2022, 3:28 PM IST

Idols

Plaster Of Paris Idols: వారిది యాభై, అరవై ఏళ్లుగా ఒకటే వృత్తి. దాన్ని నమ్ముకునే తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. తాము చేసే పనితోనే కాలం వెళ్లదీస్తున్నారు. విగ్రహల తయారీ పనే వారికి ఆదాయమార్గం. కానీ ఇప్పుడు ఆ మార్గం మూసుకుపోయింది. తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక వారు పడుతున్న మనోవేదన అంతాఇంతా కాదు. తినడానికి తిండిలేక, చేసుకోవడానికి పనిలేక, పిల్లలను పోషించలేక... వివిధ రాష్ట్రాల నుంచి రాజధానికి వచ్చి స్థిరపడిన విగ్రహ తయారీదారుల కన్నీటి వెతలివి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్​తో తయారు చేసిన వినాయక విగ్రహాలపై హైకోర్టు నిషేధం విధించడంతో వీరి బతుకులు అగమ్యగోచరంగా మారాయి.

ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్​పై నిషేధం... మరి మేమెలా బతకాలి?

Plaster Of Paris Idols: వినాయక చవితి అంటేనే రంగుల రంగుల విగ్రహాలు... ఆకట్టుకునే రూపాలు. నవరాత్రులు... ధగధగ మెరిసిపోయే గణనాథుల తయారీలో విగ్రహాల తయారీదారుల కష్టం దాగుంది. భక్తులను ఆకట్టుకునే విధంగా తయారు చేసే విగ్రహాల్లో వీరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినియోగిస్తుంటారు. వినాయక చవితి సమీపిస్తుండడంతో ఏటా విగ్రహాల తయారీదారులు ఎంతో బిజీబిజీగా గణేశ్ ప్రతిమల తయారీలో నిమగ్నమైపోయేవారు. కానీ వినాయక విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడకాన్ని హైకోర్టు గతేడాది నిషేధించింది. దీంతో విగ్రహాల తయారీదారుల గుండె గుభేల్ మంది. ఇటీవల కోర్టు, మేకర్స్‌కు మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. అయితే విజయవాడ జాతీయ రహదారి పక్కన హయత్​నగర్, పెద్ద అంబర్​పేట్ పరిధిలో 40, 50 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్న వారు నిషేధంతో తాము జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లాక్​డౌన్ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా పిల్లలను కూడా పోషించుకోలేని స్థితిలో ఉన్నాం. నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. రెండేళ్ల నుంచి సరైన పనిలేక నష్టాల్లో ఉన్నాం. ప్రభుత్వం చెబుతోంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్​తో విగ్రహాలను చేయొద్దని. కానీ మాకు మట్టితో గణేశ్ విగ్రహాలను తయారు చేయడం రాదు. మాకు రెండు, మూడేళ్ల సమయం ఇస్తే... మట్టి విగ్రహాలను తయారు చేయడం నేర్చుకుంటాం. -- సవీలాల్

ఇప్పటికే చితికిపోయాం: ఇప్పటికే రెండు, మూడు సంవత్సరాలుగా కొవిడ్‌తో ఆర్థికంగా చితికిపోయామని విగ్రహ తయారీదారులు వాపోయారు. ఇప్పుడిప్పుడే కోలుకుని వినాయక విగ్రహాలను తయారు చేస్తుంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడకాన్ని కోర్టు నిషేధించడం పట్ల ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు వచ్చిన పని ఇది ఒక్కటేనని... గత యాభై, అరవై సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ పనిపై నిషేధం విధిస్తే తాము ఎలా బతకాలని తయారీదారులు అర్థిస్తున్నారు.

ఏళ్లతరబడిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్​తో విగ్రహాలను తయారు చేస్తున్నాం. కానీ ప్రభుత్వం ఈ మధ్య మట్టితో విగ్రహాలను తయారు చేయమని చెబుతోంది. మాకు మట్టితో విగ్రహాలను తయారు చేయడం రాదు. వేరే పనులు చేసుకోవాలన్న మాకు రావు. చిన్నచిన్న పిల్లలు ఉన్నారు. వారిని ఏం పెట్టి పోషించాలి. -- కన్నయ్య

ఆలోచించండి: భయం భయంగా కొన్ని కొన్ని విగ్రహాలను తయారు చేస్తున్నప్పటికీ పోలీసులు, ఇతర అధికారులు మీకు ఎలాంటి పర్మిషన్ లేదంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. విగ్రహాల తయారీ నిలిపివేయాలని హెచ్చరించి వెళ్తున్నారని గోడును వెళ్లబోసుకున్నారు. యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర, బెంగాల్‌ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి స్థిరపడి అద్దెలు కట్టలేక, తినడానికి తిండి లేక, కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుతో తాము పస్తులుండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా గురించి ఆలోచించాలని కోరుతున్నారు.

ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మా పొట్ట కొట్టకండి. చేతలు జోడించి వేడుకుంటున్నా. మాకు వేరే పని రాదు. వచ్చిన పనిని చేయవద్దంటున్నారు. మేం ఎలా బతకాలి. -- మీరాబాయి

20,30 ఏళ్లుగా మా నాన్న, మా తాత ఇక్కడే విగ్రహాలు తయారు చేశారు. ఇప్పుడు నేను ఇదే వృత్తిలో ఉన్నా. ప్లాస్టర్ ఆఫ్​ ప్యారిస్​తో విగ్రహాలను తయారు చేయడం మాత్రమే వచ్చు. ప్రభుత్వం ఏమో మట్టి విగ్రహాలను తయారుచేయమంటోంది. కానీ మాకు రావు. ఏం చేయాలి. మా చావు, బతుకు అంతా విగ్రహాల తయారీలోనే ఉంది. -- ఉడారామ్

ఇదీ చదవండి: World Blood Donor Day : రక్తం కాదు ప్రాణదానం

భారత్​లో మళ్లీ తగ్గిన కరోనా కేసులు.. అమెరికా, బ్రెజిల్​లో ఉగ్రరూపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.