'ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సత్తా.. కేసీఆర్‌ నాయకత్వమే ఆకర్షణ మంత్రం'

author img

By

Published : Jan 22, 2023, 8:55 AM IST

KTR Davos Tour Updates Today

KTR Davos Tour Updates Today: కేవలం ఎనిమిదిన్నరేళ్లలోనే అంతర్జాతీయంగా పెట్టుబడుల ఖజానాగా తెలంగాణ నిలిచిందని, దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుపై మరోసారి రాష్ట్ర సత్తా చాటామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర, దేశ అభివృద్ధి, ఉపాధి కల్పన తదితర లక్ష్యాలను సాధించేందుకు పెట్టుబడుల అన్వేషణను నిరంతరం కొనసాగిస్తామన్నారు.

KTR Davos Tour Updates Today: కేవలం ఎనిమిదిన్నరేళ్లలోనే అంతర్జాతీయంగా పెట్టుబడుల ఖజానాగా తెలంగాణ నిలిచిందని, దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుపై మరోసారి రాష్ట్ర సత్తా చాటామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రం గర్వించేలా మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ లాంటి ప్రసిద్ధ సంస్థలు పరిశ్రమల స్థాపనకు, వాణిజ్య నిర్వహణకు ముందుకొచ్చాయని చెప్పారు.

ముఖ్యమంత్రి నాయకత్వ పటిమతో రాష్ట్రం సాధించిన సంతులిత ప్రగతే పెట్టుబడులకు ఆకర్షణ మంత్రమని, తనది కేవలం ప్రమోషన్‌ వర్క్‌ మాత్రమేనని ఆయన చెప్పారు. రాష్ట్ర, దేశ అభివృద్ధి, ఉపాధి కల్పన తదితర లక్ష్యాలను సాధించేందుకు పెట్టుబడుల అన్వేషణను నిరంతరం కొనసాగిస్తామన్నారు. అభివృద్ధితో పాటు పలు రాజకీయ అంశాలపైనా అభిప్రాయాలు పంచుకున్నారు.

దావోస్‌ పర్యటన ఎలా సాగింది?: ఈసారి దావోస్‌ అద్భుత ఫలితాలను ఇచ్చింది. మధురానుభవాలను మిగిల్చింది. దేశాధినేతలు, మంత్రులు, ప్రసిద్ధ సంస్థల అధిపతులు, శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, చాలామంది ప్రముఖులను కలుసుకున్నాను. కొలంబియా, టాంజానియాల అధ్యక్షులు, వియత్నాం ఉప ప్రధాని, బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌, యూఏఈ, ఈజిప్టు మంత్రులను కలిశాను.

కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, మన్‌సుఖ్‌ మాండవీయలతోనూ భేటీ అయ్యాను. ఒకరితో ఒకరు కలవడమే కాకుండా చాలామంది గొప్ప వ్యక్తులు తారసపడ్డారు. పెట్టుబడుల సాధనే కాదు.. తెలంగాణ, భారత్‌ల గురించి వారికి తెలియజెప్పేందుకు, వారి సలహాలు, సూచనలు వినేందుకు, నేర్చుకునేందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాను. బయోటెక్‌ విప్లవం, ఆహార కార్యాచరణ ప్రణాళికలపై జరిగిన చర్చాగోష్ఠుల్లో పాల్గొన్నాను.

బయోటెక్‌ సాంకేతికత ఫలితాల కోసం దేశం, ప్రపంచం ఏం చేయాలి, తెలంగాణ ఏం చేస్తోందో చెప్పాను. కరోనా వంటి వ్యాధులు మళ్లీ వస్తే ఆహార భద్రత కోసం ఏం చేయబోతున్నామో వివరించాను. దేశంలో అన్నపూర్ణగా ఉన్న తెలంగాణ.. ప్రపంచానికి ఆహారం అందించే స్థాయిలో ఉందని చెప్పాను. ఇతర రాష్ట్రాలు, దేశాలతో పోలిస్తే ఎన్నో రెట్లు ముందుందని నిరూపించగలిగాం. ఈ సదస్సు ఫలాలతో ముందుకు సాగుతాం. తెలంగాణకు అవి ఉపయుక్తమయ్యేలా భవిష్యత్తును నిర్దేశించుకుంటాం.

..

భారీ పెట్టుబడుల లక్ష్యం నెరవేరిందా?: ఈసారి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రసిద్ధ సంస్థలు పెట్టుబడులను ప్రకటించాయి. మరికొన్ని రావాల్సి ఉంది. సమయాభావం, భేటీ జరగకపోవడం వల్ల 4 సంస్థలు తమ పెట్టుబడుల ప్రకటనలు చేయలేకపోయాయి. త్వరలోనే అవి వస్తాయి. ఫిబ్రవరి నెల మొత్తం పెట్టుబడుల మాసమే. 5 నుంచి 11వ తేదీ వరకు ఇ-మొబిలిటీ వారోత్సవాల్లో భాగంగా భారీ సదస్సు, ప్రదర్శనలు, ఫార్ములా-ఇ రేసు ఉన్నాయి.

వాహనాల కంపెనీలతో అవగాహన ఒప్పందాలు జరుగుతాయి. చివరి వారంలో 24 నుంచి 26 వరకు బయో ఆసియా సదస్సు ఉంది. ఈ సందర్భంగానూ పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ఆశిస్తున్నాం. ప్రపంచ ఆర్థిక వేదికకు చెందిన నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం(సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌) హైదరాబాద్‌లో అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటు చేయడం తెలంగాణకు గర్వకారణం.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు రాని అవకాశం తెలంగాణకు, తద్వారా భారత్‌కు వచ్చింది. జీవశాస్త్రాల రంగంలో రాష్ట్రానికి ఉన్న అనుకూలతలు, ఘనతకు ఈ కేంద్రం ఏర్పాటే నిదర్శనం. తెలంగాణ, దేశం జీవశాస్త్రాలు, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో అగ్రగామిగా నిలిచేందుకు ఇది దోహదపడుతుంది. ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమన్వయంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పన విషయాల్లో హైదరాబాద్‌ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. రోగ నిర్ధారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధనలకు ఉపకరిస్తుంది.

పెట్టుబడులను ప్రకటించాక వాటి కార్యాచరణ ఎప్పుడుంటోంది? అన్ని ఫలవంతమవుతున్నాయా?: రెండు నుంచి మూడు నెలల్లోనే అవి కార్యరూపం దాలుస్తున్నాయి. మా హయాంలో ప్రకటించిన సంస్థలన్నీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. హామీ ఇచ్చి వెనుకడుగు వేసినవేమీ లేవు. అలాంటి పరిస్థితులు రాకుండా అన్ని ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎంవోయూల సమయంలోనే క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసి అంగీకరిస్తున్నాం.

దావోస్‌లో ప్రవాస భారతీయులను కలిశారు. వారి స్పందన ఎలా ఉంది?: ప్రవాసులు మనకు సంపద లాంటి వారు. విదేశాల్లో మన ఘనతను చాటడమే కాదు.. దేశం, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు. వారికి దేశంలో ఏం జరుగుతోందన్న ఆసక్తితో పాటు దేశానికి ఏమైనా చేయాలన్న తపన కనిపిస్తోంది. ఈసారి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ప్రవాసులు తరలివచ్చి తమ ఆలోచనలను పంచుకున్నారు. పెట్టుబడుల సాధనలో భాగస్వాములమవుతామని వారు చెప్పారు.

విదేశీ వేదికలపై ప్రధానిపై విమర్శలు చేశారంటూ విపక్షాలు తప్పుబట్టాయి: ఇది వాస్తవం కాదు. భారత్‌కు చెందిన ప్రసార మాధ్యమాలు దేశ రాజకీయాలపై ప్రశ్నలు వేసినప్పుడు మాత్రమే ప్రతిస్పందనగా సమాధానం చెప్పాను. విదేశీ వేదికలపై ఎప్పుడూ, ఎవర్నీ విమర్శించలేదు.

బీఆర్ఎస్​కు సంబంధించిన మూడు ముఖ్యమైన సమావేశాలకు మీరు హాజరు కాలేదు? దీనికి కారణమేమిటి?: అది నిజమే. కాకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి ముందస్తు అనుమతులు తీసుకునే వాటికి హాజరు కాలేకపోయాను. దిల్లీలో జరిగిన భారాస ఆవిర్భావ కార్యక్రమం రోజున రాష్ట్రానికి జర్మనీ బృందం వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంది. అందుకే దిల్లీ వెళ్లలేదు. ఏపీ ముఖ్యనేతలు బీఆర్ఎస్​లో చేరిన కార్యక్రమం రోజున మా మామయ్య చనిపోయారు.

అ సమయంలో పార్టీ కార్యక్రమానికి హాజరు కావడం సబబు కాదు. దావోస్‌ పర్యటన ఖరారు అయ్యాకే ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఖరారైంది. దావోస్‌కే వెళ్లాలని సీఎం సూచించడంతో ఇక్కడికి వచ్చాను. ఆయన సందేశం ఒకటే. రాష్ట్రం, దేశం గురించి ఎవరి పని వారే అంటే బహుముఖంగా చేయాలి. కేసీఆర్‌ సభ ఏర్పాటు చేస్తే.. నేను పెట్టుబడుల సాధనకు వచ్చాను. రాష్ట్రానికి తిరిగివచ్చాక బీఆర్ఎస్ పని ఉంటే దానిలోనూ నిమగ్నమవుతాను. మా ఆశ, శ్వాస బీఆర్ఎస్​యే. పార్టీ, ప్రభుత్వం రెండు కళ్ల లాంటివి.

బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఎలా జరిగింది?: ఖమ్మం సభ చరిత్ర సృష్టించింది. జనం ప్రభంజనంలా వచ్చారు. అది దేశంలో ప్రబల మార్పునకు నాందీవాచకమైంది. కేసీఆర్‌ నాయకత్వం కోసం దేశం, ఇతర రాష్ట్రాల నేతలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాకు తెలిసి నాలుగు రాష్ట్రాల విపక్ష సీఎంలు హాజరైన సభ ఇటీవలి కాలంలో ఇదే మొదటిది. సభ ద్వారా ప్రజలకు, కర్షకులు, కార్మికులు, సైనికులకు కావాల్సిన ఆయన ద్వారానే అవుతాయని నమ్మకం కలిగింది. తెలంగాణ మాదిగానే దేశానికి కావాల్సిన ఎజెండాను ఆయన రూపొందిస్తున్నారు. అది రాజకీయ విప్లవానికి దారితీస్తుంది.

పెట్టుబడుల్లో దేశంలో తెలంగాణ అగ్రస్థానం పొందడానికి కారణం?అది నా గొప్పతనం కాదు. సీఎం కేసీఆర్‌ హయాంలో తెలంగాణ సాధించిన పురోగతే కారణం. ఆయన పనితనం, ప్రభుత్వ విధానాలు, విద్యుత్‌, నీరు, ఇతర మౌలిక వసతుల గురించి తెలియజెప్పడం(ప్రమోషన్‌) ద్వారానే పెట్టుబడులను కోరుతున్నాం. ఇవేమీ లేకుండా రాష్ట్రానికి పరిశ్రమలు, విదేశీ సంస్థలు రావు. ప్రతి సంస్థ తెలంగాణపై సమగ్ర పరిచయంతో వస్తున్నాయి. కొత్త పెట్టుబడులే కాకుండా విస్తరణకు మొగ్గు చూపుతున్నాయి. స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నాయి.

..

తమ దావోస్‌ పర్యటన విజయవంతమైందని, నాలుగు రోజుల్లోనే రూ.21 వేల కోట్లను సమీకరించామని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో తెలిపారు. కొత్త పెట్టుబడులతో పాటు భవిష్యత్తు పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మార్చడానికి తాము చేస్తున్న కృషి ఫలిస్తోందన్నారు. ఆది నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక తెలంగాణకు అన్ని విధాలా అచ్చొస్తోందని, దీని ద్వారా వివిధ దేశాల వ్యాపార, వాణిజ్య సంస్థలతో రాష్ట్ర సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయని పేర్కొన్నారు.

పెట్టుబడులకు సంబంధించి వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలతో జరిపిన చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చి పెద్దఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనే నిరంతరం తమను నడిపిస్తోందన్నారు. తనతో పాటు శ్రమించిన పరిశ్రమలు, ఐటీ, ఇతర శాఖల ఉన్నతాధికారులకు, తమ బృందానికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు.

9 సంస్థలు.. రూ.21వేల కోట్ల పెట్టుబడులు: దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్రం 4 రోజుల్లో సుమారు రూ.21 వేల కోట్ల పెట్టుబడులను సాధించింది. కేటీఆర్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం 52 వాణిజ్య, 6 రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, 2 ప్యానెల్‌ చర్చల్లో పాల్గొంది.

పెట్టుబడుల వెల్లువ:

  • రూ.16,000 కోట్లతో మూడు మైక్రోసాఫ్ట్‌ డేటా కేంద్రాలు.
  • రూ.2,000 కోట్లతో దేశంలోని అతిపెద్ద డేటా కేంద్రం నెలకొల్పనున్న భారతీ ఎయిర్‌టెల్‌ గ్రూపు.
  • రూ.1,000 కోట్లతో జీనోమ్‌ వ్యాలీలో ఫ్రాన్స్‌ సంస్థ యూరోపిన్స్‌ అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటు.
  • రూ.1,000 కోట్లతో పెప్సికో విస్తరణ.
  • రూ.210 కోట్లతో అలాక్స్‌ అడ్వాన్స్‌ మెటీరియల్స్‌ సంస్థ తెలంగాణలో మల్టీ గిగావాట్‌ లిథియం క్యాథోడ్‌ మెటీరియల్‌ తయారీ కేంద్రం.
  • రూ.150 కోట్లతో వెబ్‌ పీటీ సంస్థ ప్రపంచ స్థాయి సామర్థ్య కేంద్రం.
  • రూ.100 కోట్లతో అపోలో టైర్స్‌ డిజిటల్‌ ఆవిష్కరణల కేంద్రం.
  • రూ.100 కోట్లతో ఇన్‌స్పైర్‌ బ్రాండ్స్‌ ప్రపంచస్థాయి మద్దతు కేంద్రం.
  • రూ.100 కోట్లతో ప్రపంచ ఆర్థిక వేదిక 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం(సీ4ఐఆర్‌)

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.