Hyderabad Tourism Development : ట్యాంక్​బండ్ తీరాన సరికొత్త సొబగులు.. ప్రత్యేక ఆకర్షణగా ఆ రెండు..

author img

By

Published : May 21, 2023, 7:48 AM IST

Hyderabad Tourism Development

Hyderabad Tourism Development : ట్యాంక్​బండ్ తీరం సరికొత్త సొబగులు సంతరించుకుంటోంది. అద్భుత నిర్మాణ శైలితో రూపుదిద్దుకున్న నూతన సచివాలయ భవనం, అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ట్యాంక్​బండ్​, లుంబినీ పార్క్‌, ఎన్టీఆర్ ​మార్గ్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్డు, పీవీ ఘాట్ తదితర ప్రాంతాల సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాంతో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. గతంతో పోల్చితే రోజురోజుకూ ట్యాంక్​బండ్ ప్రాంతానికి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Hyderabad Tourism Development : హుస్సేన్​సాగర్ ప్రాంతం నగరంలో టూరిజానికి కేరాఫ్ అడ్రస్​గా మారుతోంది. నగర నడిబొడ్డున ఉన్న ట్యాంక్​బండ్​ను చూసేందుకు వచ్చే విదేశీయుల సంఖ్య కూడా పెరుగుతోంది. హైదరాబాద్​కు వచ్చిన ఎక్కువ మంది హుస్సేన్​సాగర్​ను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశంలోనే ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, సచివాలయం నిర్మాణం ఈ ప్రాంతానికి మరింత శోభ తెచ్చింది. మున్ముందు పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అందుకు తగ్గట్లుగా రోడ్లు, ఫుట్​పాత్​లు, లైటింగ్ ఇతర సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన పనులు ఊపందుకున్నాయి. ఈ పనులన్నీ పూర్తయితే సాగరతీరం మరింత కొత్తగా కనిపిస్తుంది.

ట్యాంక్​బండ్‌ను ఇటీవల రూ.60 కోట్లతో సుందరీకరించారు. భవిష్యత్తులో కేబుళ్లు, మురుగు నీటి వ్యవస్థ కోసం ఫుట్‌పాత్‌లు ధ్వంసం చేయకుండా భూగర్భంలో ప్రత్యేకంగా పీవీసీ పైపులు వేస్తున్నారు. వీధి దీపాల కోసం డివైడర్ల మధ్యలో నూతన సాంకేతికతతో కూడిన అలంకరణ స్తంభాలను వినియోగిస్తున్నారు. ఎన్టీఆర్​ మార్గ్​లో అభివృద్ధి పనులకు రూ.23 కోట్లు వెచ్చిస్తున్నారు. నెక్లెస్​రోడ్డులో రూ.26 కోట్లతో కొత్త సాంకేతికతతో కూడిన వ్యాక్యూమ్ డీవాటర్డ్ సిమెంట్ కాంక్రీట్‌తో రహదారుల నిర్మాణ పనులు సాగుతున్నాయి.

హుస్సేన్‌సాగర్‌లోని కలుషిత జలాల నుంచి దుర్వాసన రాకుండా బయో రెమిడేషన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం రూ.2 కోట్లకు పైగా ఖర్చవుతుందని హెచ్​ఎండీఏ అంచనా వేసింది. హుస్సేన్‌సాగర్, నెక్లెస్​రోడ్, ట్యాంక్​బండ్, ఎన్టీఆర్ ​మార్గ్‌తో పాటు పరిసర ప్రాంతాలు నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక హౌస్​ కీపింగ్ బృందాలను నియమించారు. ఇందుకోసం ఏటా రూ.6 కోట్ల వరకు వెచ్చించనున్నారు. ఇలా అన్ని రకాల హంగులతో అభివృద్ధి చెందుతున్న ట్యాంక్‌బండ్‌ తీరాన్ని సందర్శించడానికి పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు.

చార్మినార్​​ తరహాలో నైట్​బజార్..​: త్వరలో నైట్​బజార్ అందుబాటులోకి తెచ్చే కసరత్తు ముమ్మరమైంది. చార్మినార్ చుడీ బజార్ తరహాలో ఇది ఉంటుందని అధికారులు తెలిపారు. సాగర్​లో ఇప్పటికే రూ.7 కోట్లతో తీర్చిదిద్దిన తేలియాడే మ్యూజికల్ ఫౌంటెయిన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. పర్యాటకులకు అనువుగా ఉండేందుకు త్వరలో దీన్ని పీపుల్స్ ప్లాజా వైపు మార్చనున్నారు. లుంబినీ పార్కు, సచివాలయం మధ్య సుందరమైన ఐలాండ్​ను తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మరికొద్ది రోజుల్లో ప్రారంభించే తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం చూపరులను మంత్రముగ్దుల్ని చేసే అవకాశం ఉంది. నగర వాసులు ట్యాంక్​బండ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాంక్​బండ్​ తీరాన కొత్త సొబగులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.