Pensions pending: మూడున్నరేళ్లుగా పట్టాలెక్కని కొత్త పింఛన్లు..  తప్పని ఎదురుచూపులు

author img

By

Published : May 12, 2022, 4:59 AM IST

Pensions

Pensions pending: రాష్ట్రంలో కొత్తగా ‘ఆసరా’ అందాల్సిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఎదురుచూపులు తప్పడం లేదు. మూడున్నరేళ్లుగా నూతన పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో వారి అవస్థలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో.. పెండింగ్‌లో ఉన్నవాటితోపాటు 57 ఏళ్ల వయసు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించినప్పటికీ, ఏప్రిల్‌ గడిచినా ఎలాంటి పురోగతి లేదు.

Pensions pending: రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా కొత్త పింఛన్లు పట్టాలెక్కడం లేదు. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు తప్పని ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటికే 3.3 లక్షల దరఖాస్తులకు మండల స్థాయిలో ఆమోదం లభించినా మోక్షం దక్కడం లేదు. అధికారుల పరిశీలనలో మరో 7.7 లక్షల అర్జీలు ఉండగా లక్షల మంది అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లికి చెందిన ఎల్లయ్యకు 69 ఏళ్లు. గత నిబంధనల ప్రకారం 65 ఏళ్లు పూర్తికాగానే 2018లో వృద్ధాప్య పింఛనుకు దరఖాస్తు చేసుకున్నారు. మూడున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పింఛను మంజూరు కాలేదు. దీంతో ఆయన జీవనోపాధికోసం చెత్త రిక్షా పనిని కొనసాగిస్తున్నారు.

మొత్తంగా 11 లక్షలు దాటిన దరఖాస్తులు: అరవై ఐదు ఏళ్లు నిండిన వారు, వితంతువులు, దివ్యాంగులు తదితర వర్గాలకు చెందిన 3.3 లక్షల దరఖాస్తులను మండల, పంచాయతీ కార్యాలయాల్లో పరిష్కరించినప్పటికీ.. రాష్ట్రస్థాయిలో ఆమోదం లభించకపోవడంతో వారికి పింఛను అందడం లేదు. ఈ దరఖాస్తులన్నీ రాష్ట్రస్థాయి లాగిన్‌లో నిలిచిపోయాయి. రోజూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, క్షేత్రస్థాయి అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. గతంలోని పెండింగ్‌లో ఉన్నవాటితోపాటు వృద్ధాప్య పింఛను అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించడంతో వచ్చిన 7.8 లక్షలకు పైగా దరఖాస్తుల పరిశీలనకు అధికారిక ఆదేశాలు జారీ కాలేదు. దీంతో రాష్ట్రంలో ఆసరా పింఛను కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య 11 లక్షలు దాటినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

2018 నుంచీ పెండింగ్‌: తెలంగాణలో వృద్ధాప్య పింఛన్లకు 2021 ఆగస్టు వరకు అర్హత వయసు 65 ఏళ్లుగా ఉంది. వితంతువులు, దివ్యాంగులకు వయసుతో సంబంధం లేకుండా ‘ఆసరా’ అందిస్తోంది. తెరాస ప్రభుత్వం 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నాటికి పెండింగ్‌లో ఉన్నవి, ఆ తర్వాత అందిన దరఖాస్తులకు పింఛను మంజూరు కాలేదు.
హుజూరాబాద్‌, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించిన ప్రభుత్వం మిగతా నియోజకవర్గాల్లో పట్టించుకోలేదు. నెలకు రూ.2,016 వస్తే వ్యక్తిగత, ఆరోగ్య ఖర్చుల, రోజువారీ జీవన అవసరాలు తీరుతాయని దరఖాస్తుదారులు భావిస్తున్నా.. ఆసరా లభించడం లేదు.

భారీగా బడ్జెట్‌ పేర్కొన్నా: రాష్ట్రంలో ప్రస్తుతం 38.41 లక్షల మంది వివిధ రకాల ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారు. దివ్యాంగులకు నెలకు రూ.3,016, ఇతర కేటగిరీల వారికి నెలకు రూ.2,016 అందుతోంది. పెండింగ్‌లో ఉన్నవాటితోపాటు 57 ఏళ్లు దాటిన వారందరికీ పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ మేరకు భారీగా రూ.11,728 కోట్ల నిధులను పేర్కొంది. అయినా దరఖాస్తుదారులకు నిరాశే ఎదురవుతోంది.

ఆగిపోయిన పింఛన్లు

ఇవీ చూడండి: 'తెలంగాణ బాయిల్డ్​ రైస్​ కోటా పెంచినందుకు కృతజ్ఞతలు'

కూతురి కోసం 30ఏళ్ల పాటు 'మగాడి'లా మారిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.