Special Trains: ప్రయాణ మార్గమదే, రైళ్లు అవే.. ప్రత్యేక బాదుడెందుకు!?

author img

By

Published : Sep 19, 2021, 7:56 AM IST

Special Trains

కొవిడ్‌కు ముందు ద.మ.రైల్వే నుంచి 196 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు 195 తిరుగుతున్నాయి. జోన్‌ మీదుగా గతంలో 100 రైళ్లు తిరిగేవి. ఇప్పుడు 83 ప్రయాణిస్తున్నాయి. వీటిని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లుగానే నడుపుతోంది తప్ప రెగ్యులర్‌గా మార్చలేదు. ప్రయాణ మార్గం అదే, సమయాలు అవే. రైలు నంబర్‌కు ముందు ‘సున్నా’ చేర్చి ప్రత్యేకమంటోంది.

దేశంలో విమానాలు, బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. రైల్వేశాఖ సైతం ఏసీ, సూపర్‌ఫాస్ట్‌, ప్యాసింజర్‌, ఎంఎంటీఎస్‌.. ఇలా అన్ని రైళ్లనూ దశలవారీగా పట్టాలెక్కించింది. కొవిడ్‌కు ముందు ద.మ.రైల్వే నుంచి 196 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు 195 తిరుగుతున్నాయి. జోన్‌ మీదుగా గతంలో 100 రైళ్లు తిరిగేవి. ఇప్పుడు 83 ప్రయాణిస్తున్నాయి. వీటిని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లుగానే నడుపుతోంది తప్ప రెగ్యులర్‌గా మార్చలేదు. ప్రయాణ మార్గం అదే, సమయాలు అవే. రైలు నంబర్‌కు ముందు ‘సున్నా’ చేర్చి ప్రత్యేకమంటోంది. వీటిలో డిమాండ్‌ ఉన్నవాటిని తత్కాల్‌ రైళ్లుగా మార్చేసి అదనపు ఛార్జీలతో బాదేస్తోంది. రిజర్వుడ్‌ బోగీల్లోనూ ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ పేరుతో సీట్లకు మించి ప్రయాణికులను అనుమతిస్తున్నారు. జనరల్‌ బోగీలను ఇటీవలి వరకు రిజర్వుడు బోగీలుగా నడిపేవారు. ఇప్పుడు ‘అన్‌రిజర్వుడు’ చేసేశారు. టికెట్‌ తీసుకుంటే చాలు.. ఎంతమందైనా ప్రయాణించవచ్చు. కొవిడ్‌ ప్రత్యేక రైళ్లుగా వీటిని నడిపిస్తున్నా.. ఆ నిబంధనలేమీ అమలు కావడం లేదు. రాయితీలూ అందుబాటులోకి రాలేదు.

పరిమితి మించి టికెట్లు

కొవిడ్‌ మూడో దశ ముప్పు ఉందని ఓవైపు అంటూనే రైల్వేశాఖ సీట్లకు మించి టికెట్లు ఇస్తోంది. స్లీపర్‌ బోగీలో 72 బెర్తులుంటే.. ఆర్‌ఏసీ పేరుతో మరో 9 మందికి టికెట్లు ఇస్తోంది. ఒక బృందంలో ఆరుగురు టికెట్లు తీసుకుంటే.. వారిలో కొందరికి రిజర్వేషన్‌ దొరక్కపోయినా అనుమతిస్తోంది. వెయిటింగ్‌ లిస్ట్‌ (కౌంటర్‌) టికెట్ల వారినీ అనుమతిస్తున్నారు. జనరల్‌ బోగీల్లో సీటింగ్‌ పరిమితి 108 కాగా, అన్‌రిజర్వుడుగా మార్చడంతో కొన్ని రైళ్లలో 150 మంది వరకు ప్రయాణిస్తున్నారు.

‘పండగ’ బాదుడు

సాధారణంగా దసరా, దీపావళి, సంక్రాంతి సమయాల్లో ‘పండగ ప్రత్యేక రైళ్లు’ నడుపుతారు. కానీ రెగ్యులర్‌ రైళ్లనే పండగ ప్రత్యేక రైళ్లుగా దాదాపు ఏడాదికాలంగా నడుపుతున్నారు. ప్రయాణ తరగతి, దూరాన్ని బట్టి ఒక్కో ప్రయాణికుడిపై రూ.80 నుంచి రూ.420, ఆపైన అదనపు భారం పడనుంది. ఆదిలాబాద్‌-తిరుపతి (07406), సికింద్రాబాద్‌-గుంటూరు (02706), హైదరాబాద్‌-హావడా (08646), సికింద్రాబాద్‌-బెజవాడ (02760), లింగంపల్లి-కోకనాడ (02738), సికింద్రాబాద్‌-కోల్‌కతా షాలిమార్‌ (02450), గుంటూరు-రాయగడ (07234), సికింద్రాబాద్‌-విశాఖపట్నం (02204), సికింద్రాబాద్‌-గువాహటి (02513) సహా అనేక రైళ్లను పండగ ప్రత్యేక రైళ్లుగా నడుపుతున్నారు.

రాయితీ ఏదీ?

అన్ని రైళ్లలో అనేక విభాగాల వారికి ఎత్తేసిన ప్రయాణ రాయితీల్ని ఇంకా పునరుద్ధరించలేదు. గతంలో వయోవృద్ధులు, సైనికులు, విద్యార్థులు, దివ్యాంగులు, కళాకారులు.. ఇలా 51 రకాల వారికి ఈ సౌలభ్యం ఉండేది. కొందరికి పూర్తి ఉచితం కాగా, మరికొందరికి 50-75 శాతం వరకు రాయితీ లభించేది. ప్రస్తుతం సైనికులు సహా నాలుగైదు విభాగాల వారికే పునరుద్ధరించారు.

కొవిడ్‌పై స్పష్టత వచ్చాక రెగ్యులర్‌ రైళ్లపై నిర్ణయం

మొదటి దశ కొవిడ్‌ తర్వాత రైళ్ల సంఖ్య పెంచాం. రెండో దశతో తగ్గించాల్సి వచ్చింది. మూడో దశ రావచ్చంటున్నారు. అందుకే ప్రత్యేక రైళ్లుగా నడిపిస్తున్నాం. కొవిడ్‌పై పూర్తి స్పష్టత వచ్చాకే రెగ్యులర్‌ రైళ్లపై నిర్ణయం తీసుకుంటాం. ఆర్‌ఏసీతో అదనంగా ప్రయాణించే వారి సంఖ్య పరిమితంగానే ఉంటోంది.

-సీహెచ్‌.రాకేశ్‌, ద.మ.రైల్వే సీపీఆర్వో

...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.