3 పేర్లు.. 2 పాస్‌పోర్టులు.. 'ఎమ్మెల్యేల ఎర' కేసులో రోజుకో కొత్త ట్విస్ట్..!

author img

By

Published : Nov 24, 2022, 8:20 AM IST

sit enquiry

SIT investigation in MLA purchase case: 'ఎమ్మెల్యేలకు ఎర' కేసు దర్యాప్తులో రోజుకో కొత్త అంశం వెలుగుచూస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో కీలక విషయాలు బహిర్గతమవుతున్నాయి. ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి రెండు పాస్​ఫోర్ట్​లు ఉన్నట్లు గుర్తించారు. రామచంద్రభారతి పేరుతో ఒకటి.. భరత్ కుమార్​శర్మ పేరుతో మరొకటి ఉన్నట్లు తేలింది.

ఒకే స్వామీజీ రెండు పాస్​పోర్టులు

SIT investigation in MLA purchase case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఏ1 గా ఉన్న రామచంద్రభారతిపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే రెండేసి ఆధార్ కార్డులు, పాన్​కార్డులు, డ్రైవింగ్ లైసెన్లు ఉన్నట్లు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో ఈ నెల 3న కేసు నమోదైంది. తాజాగా సిట్ దర్యాప్తులో రెండు పాస్​పోర్టులు ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్​లోని సిట్ కార్యాలయంలో దర్యాప్తు సందర్భంగా ఇది బయటపడినట్లు.. కేసు దర్యాప్తు అధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఐపీసీ సెక్షన్ 467, 468, 471లతోపాటు పాస్​పోర్టు చట్టంలోని సెక్షన్12 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొయినాబాద్ ఫామ్​హౌస్​లో గత నెల 26న ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ దొరికిపోయిన సమయంలో రామచంద్ర భారతి నుంచి ల్యాప్​ట్యాప్​తో పాటు రెండు సెల్​ఫోన్​లను పోలీసులు సీజ్ చేశారు. వీటిలోని డేటాను రిట్రీవ్ చేసేందుకు వాటిని ఎఫ్​ఎస్​ఎల్​కి పంపించారు. ఆ నివేదిక ఇటీవలే సిట్ బృందానికి అందింది. దీనిని పరిశీలిస్తున్న క్రమంలో రెండు పాస్​పోర్టులు ఉన్నట్లు బయటపడింది. ఒకే ఫొటో ఉండి వేర్వేరు పేర్లు, ఇతర వివరాలతో ఉన్న రెండు పాస్​పోర్టులను అధికారులు గుర్తించారు.

సిట్ అధికారులు ఐఫోన్​లో సమాచారాన్ని విశ్లేషించగా ఒక పాస్​పోర్టు స్వామీజీ శ్రీ రామచంద్ర పేరుతో ఉన్నట్లు తేలింది. తండ్రి పేరు మహాస్వామి శ్రీ మధ్వ ధర్మదత్జీగా ఉంది. కర్ణాటకలోని పుత్తూరు చిరునామాతో ఉన్న ఈ పాస్​పోర్టులో పుట్టిన తేదీ 12 ఫిబ్రవరి 1979గా ఉంది. దీనిని 2019 నవంబరు 8న జారీ చేసినట్లు ఉంది. ల్యాప్​ట్యాప్​ విశ్లేషణలో మరో పాస్​పోర్టు ఉన్నట్లు బయటపడింది. భరత్​కుమార్​శర్మ పేరుతో ఉన్న ఈ పాస్​పోర్టు కర్ణాటకలోని కొడగు చిరునామా ఉంది. తండ్రి పేరు శ్రీకృష్ణమూర్తి వెలకుంజగా ఉంది. పుట్టినతేదీ 12 ఫిబ్రవరి 1988గా ఉంది. 2010 జులైలో జారీ అయినట్లుగా ఉంది. ఒక పాస్​పోర్టు T-9633062 నంబరుతో ఉండగా.. మరొకటి T-3633032తో ఉంది. రెండింటిలోనూ తల్లి పేరు సరస్వతి వెలకుంజ అని ఉంది. రామచంద్ర భారతికి చెందినట్లుగా గుర్తించిన రెండు పాస్​పోర్టులల్లో ఒకటి ఫోర్జరీది అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ల్యాప్​ట్యాప్​లో గుర్తించిన భరతకుమార్ శర్మది అలా ఉండేందుకు అవకాశముందనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఎవరి పేరుతోనో ఉన్న పాస్పోర్టు మొదటి పేజీని మార్ఫింగ్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ పాస్​పోర్టులపై నిగ్గూతేల్చేందుకు సంబంధిత అధికారులకు లేఖ రాసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఒకవేళా రెండూ.. రామచంద్రభారతికి సంబంధించినవేనని తేలితే స్టాంపింగ్​లను సైతం పరిశీలించనున్నారు. ఈ రెండింటిలోని వివరాల ఆధారంగా రామచంద్రభారతి ఎక్కడెక్కడికి ప్రయాణించారనే కోణంలోనూ సిట్ అధికారులు సమాచారం సేకరించే పనిలో పడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.