'ఎమ్మెల్యేల ఎర కేసు'.. నిందితుల జాబితాలో సంతోష్​తో సహా నలుగురు

author img

By

Published : Nov 25, 2022, 8:19 AM IST

TRS MLAs purchase case update

TRS MLAs Poaching case accused : ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ అధికారులు.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్ సహా కొత్తగా నలుగురిని నిందితుల జాబితాలో చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్‌లు నిందితులుగా ఉండగా.. నోటీసులు అందుకున్న నలుగురిని నిందితులుగా పేర్కొన్నారు. బీఎల్. సంతోష్‌తో పాటు జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్‌ను నిందితుల జాబితాలో చేర్చుతున్నట్లు ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో సిట్ తాజాగా మెమో దాఖలు చేశారు.

'ఎమ్మెల్యేల ఎర కేసు'లో సిట్‌ నిందితుల జాబితాలో సంతోష్​తో సహా నలుగురు

TRS MLAs Poaching case accused : టీఆర్​ఎస్ శాసనసభ్యుల కొనుగోలుకు యత్నించిన వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన విచారణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దర్యాప్తును వేగంగా సాగిస్తున్న సిట్.. ఫామ్‌హౌస్‌లో పట్టుబడిన నలుగురితో పాటు తాజాగా మరో నలుగురిని నిందితుల జాబితాలో చేర్చుతున్నట్లు ప్రకటించింది. బీజేపీ కీలక నేత బీఎల్. సంతోష్, కేరళ వైద్యుడు డాక్టర్ జగ్గూస్వామి, బీడీజేఎస్ నేత తుషార్, కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్‌ను నిందితుల జాబితాలో చేర్చుతున్నట్లు ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో సిట్ మెమో దాఖలు చేసింది.

four new accused in MLAs poaching case : వీరందరూ విచారణకు రావాలంటూ ఇప్పటికే నోటీసులు జారీ చేసినా, శ్రీనివాస్ మినహా మిగిలిన ముగ్గురు హాజరయ్యారు. ఈనెల 21, 22 తేదీల్లో విచారణకు వచ్చిన శ్రీనివాస్ మూడో రోజు రాలేదు. హైకోర్టు స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇవాళో రేపో విచారణకు వస్తారని తెలుస్తుంది. శ్రీనివాస్‌కు నిందితులతో గల సంబంధాలపై కొంత సమాచారాన్ని సిట్ సేకరించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నలుగురిని నిందితులుగా చేర్చింది.

ఫామ్‌హౌస్‌లో పట్టుబడిన నలుగురు నిందితుల్లో ఒకరైన నందకుమార్‌కు, న్యాయవాది శ్రీనివాస్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలను సిట్ గుర్తించింది. రాష్ట్రంలోని ఓ జాతీయ పార్టీ కీలక నేతతోనూ శ్రీనివాస్ భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిపారన్న అనుమానంతో కూపీ లాగుతోంది. నందకుమార్ నుంచి శ్రీనివాస్ 55 లక్షలు తీసుకున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు.

ఆ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నానని, వడ్డీగా నెలకు లక్షన్నర చెల్లిస్తున్నట్లు అధికారులకు శ్రీనివాస్ చెప్పగా.. ఫోన్ పే, గూగుల్ పే ఖాతాల వివరాలు సమర్పించాలని సిట్ సూచించింది. నందకుమార్ పలువిడతలుగా ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. నిందితులు సింహయాజీ, నందకుమార్‌తో కలిసి పలు ప్రాంతాల్లో సంచరించినట్లు గుర్తించిన సిట్‌.. వాటిపైనా దృష్టి సారించింది.

విచారణకు హాజరైనప్పుడు శ్రీనివాస్ కొత్త ఫోన్ మాత్రమే తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పాత ఫోన్ పాడవ్వడంతో జూన్ నుంచి కొత్త ఫోన్ ను వినియోగిస్తున్నట్లు ఆయన సిట్‌కు తెలిపారు. కానీ పాత ఫోన్‌లో కీలక ఆధారాలు ఉంటాయని సిట్ అనుమానిస్తుంది. ఈ సారి వచ్చినప్పుడు ఆయన సరైన వివరాలు సమర్పించకుంటే కఠిన చర్యలకు దిగే అవకాశమున్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే కేసులో కొత్తగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు పేరు తెరపైకి వచ్చింది.

ఈ నెల 29న రఘురామ విచారణకు హాజరుకావాలంటూ సిట్ 41ఏ-సీఆర్​పీసీ నోటీసు జారీ చేసింది. హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 76 చిరునామాతో వాట్సాప్‌ ద్వారా ఈ నోటీసు పంపించినట్లు తెలుస్తుంది. నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్‌లు రఘురామతో దిగిన ఫొటోలు గతంలో వైరల్ అయిన నేపథ్యంలో నోటీసుకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా.. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

నోటీసులు పంపారన్న ప్రచారం చూసి తన న్యాయవాదిని ఏసీబీ కోర్టుకు పంపినట్లు తెలిపారు. నోటీసు వస్తే తగిన విధంగా స్పందిస్తానన్న రఘురామ.. అలాంటి చెత్త పనుల్లో తాను కలలోనూ భాగస్వామిని కానన్నారు. దిల్లీలో రోజు ఎంతో మంది తనతో ఫోటోలు దిగుతారని టీఆర్​ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందకుమార్ అలా ఎప్పుడు ఫోటో దిగారో తెలియదని.. అతడితో తనకు ఎలాంటి పరిచయంలేదని రఘురామ స్పష్టం చేశారు.

ఈ కేసులో కీలకంగా భావిస్తున్న కేరళ వైద్యుడు డాక్టర్ జగ్గూస్వామి ఆచూకీ లభించకపోవడంతో అతడి సంబంధికులకు సిట్ 41ఏ-సీఆర్​పీసీ నోటీసులు జారీ చేసింది. అతని సోదరుడు మనిలాల్, వ్యక్తిగత సహాయకుడు శరత్, ప్రశాంత్ , విమల్ , "అమృతా ఇనిస్టిట్యూట్" సీఎస్​ఓ. ప్రతాపన్‌లకు తాఖీదులను పంపింది. న్యాయవాది ప్రతాప్‌ గౌడ్ ఇవాళ సిట్ విచారణకు హాజరుకానున్నారు.

ఈయనకు ఇప్పటికే సిట్ 41ఏ- సీఆర్​పీసీ నోటీసు ఇచ్చి విచారణకు రావాలని కోరింది. దాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా, సిట్ విచారణకు హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని సిట్‌కు స్పష్టం చేసింది. నిందితుల్లో ఒకరైన నందకుమార్ భార్య చిత్రలేఖ కూడా నేడు సిట్ ఎదుట హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.