కాంగ్రెస్​లో ముసలం... పీసీసీ అధ్యక్షుడే టార్గెట్​గా నేతల విమర్శలు

author img

By

Published : Aug 5, 2022, 8:38 PM IST

కాంగ్రెస్‌

Senior Congress Leaders Fires On Revanth: కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లక్ష్యంగా సీనియర్లు విమర్శనాస్తాలు సంధిస్తున్నారు. రేవంత్​రెడ్డి, మానిక్కం ఠాగూర్​, సునీల్ కనుగోలు కుమ్మక్కై పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించిన దాసోజు శ్రవణ్‌.. పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ వాదులను బయటికి పంపించి.. తెలుగుదేశం వాళ్లను తెచ్చి పోటీ చేయించాలని చూస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికే కాంగ్రెస్‌ రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి.. తప్పుడు వ్యక్తి చేతుల్లోకి పీసీసీ పదవి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

Senior Congress Leaders Fires On Revanth: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లక్ష్యంగా కాంగ్రెస్‌ సీనియర్లు అసంతృప్తి గళమెత్తారు. రేవంత్‌ ఒంటెద్దు పోకడలతో పార్టీ నాశమవుతోందంటూ.. కాంగ్రెస్ సభ్యత్వానికి, పార్టీలోని అన్ని రకాల పదవులకు దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. రేవంత్​రెడ్డి నేతృత్వంలో అరాచక పరిస్థితులు కొనసాగుతున్నాయన్న ఆయన.. పార్టీని బలహీన పరుస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి, మానిక్కం ఠాగూర్, సునీల్ కుమ్మక్కై.. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు నివేదికలు అందిస్తున్నారని అన్నారు. పార్టీలో మాఫియా తరహా రాజకీయాలు చేస్తున్నారన్న దాసోజు.. ప్రతి నియోజకవర్గంలో ఐదారుగురిని ప్రోత్సహించి గొడవలు పెడుతున్నారని ఆరోపించారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ ఉపఎన్నికపై ఫోకస్ చేయని రేవంత్ మునుగోడుపై దృష్టిసారించడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాదులను బయటికి పంపించి.. తెలుగుదేశం వాళ్లను తెచ్చి పోటీ చేయించాలని చూస్తున్నారని దిల్లీలో వ్యాఖ్యానించారు. సొంత నియోజకవర్గంలో తనకు తెలియకుండా కార్యక్రమం ఎలా నిర్ణయిస్తారని ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాణం పోయినా పార్టీని వీడేది లేదన్నారు. ఈ విషయంపై సోనియా, రాహుల్ గాంధీ దగ్గరే తేల్చుకుంటానని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు.

ఆత్మగౌరవం ఉన్నవారు కాంగ్రెస్ పార్టీలో ఉండరని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు. తప్పుడు వ్యక్తి చేతుల్లోకి పీసీసీ పదవి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో.. భాజపాలో చేరనున్నట్లు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. దిల్లీలో భాజపా నేత వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన అమిత్ షాను కలిశారు. స్పీకర్ ఫార్మాట్​లో ఇచ్చిన రాజీనామాను.. ఈనెల 8న సభాపతిని కలిసి ఆమోదింపజేసుకుంటానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్ లో కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సైతం.. సరైన నిర్ణయం తీసుకుంటారని రాజగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.