Seed fair_ 2023 : 'వ్యవసాయ పంటలకు విలువ జోడిస్తేనే అన్నదాతలకు ప్రయోజనం'
Published: May 24, 2023, 4:34 PM


Seed fair_ 2023 : 'వ్యవసాయ పంటలకు విలువ జోడిస్తేనే అన్నదాతలకు ప్రయోజనం'
Published: May 24, 2023, 4:34 PM
Seed fair_ 2023 : తెలంగాణ రైతాంగానికి నాణ్యమైన విత్తనాలను అందించాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళాను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేళాలో 10 రకాల పంటల విత్తనాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు.
Seed fair 2023 at Jayashankar University in Hyderabad : రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా ఉత్తమ వ్యవసాయ విధానాలు రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళా - 2023ను మంత్రి ప్రారంభించారు. మేలైన విత్తనం ద్వారా నాణ్యమైన లాభదాయకమైన పంటల ఉత్పత్తి లభిస్తుందని నిరంజన్రెడ్డి తెలిపారు. రైతులకు కేంద్రం చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచం నడవాలంటే వ్యవసాయం ముఖ్యం: భారతదేశంలోనే అత్యధిక వ్యవసాయ భూమి ఉంది. ప్రపంచంలో సాంకేతికత పెరగవచ్చు, కొత్త కంపెనీలు రావచ్చు కానీ, ఆహారం కావాలంటే ఈ భూమి, రైతులే ముఖ్యమని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయం లేకపోతే ప్రపంచం నడవదని.. అందుకే తెలంగాణలో వ్యవసాయానికి, రైతులకు ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ఎంత సాయం చేసినా తక్కువే: రైతులకు ఎంత సాయం చేసినా తక్కువేనని, కేంద్రం ఆ దిశగా ఇతోధికంగా చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న సానుకూల విధానాల వల్ల తెలంగాణలో పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా వినియోగదారుల అభిరుచి, వర్షపాతం, మార్కెటింగ్ డిమాండ్ అనుగుణంగా పంటలు సాగు చేస్తే... వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. రాబోయే దశాబ్దంలో తెలంగాణ వ్యవసాయోత్పత్తులు ప్రపంచాన్ని శాసిస్తాయని నిరంజన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తమమైన వ్యవసాయ విధానాలు అవసరం: ప్రపంచ ప్రజల ఆహారపు అవసరాల కోసం ఉత్తమమైన వ్యవసాయ విధానాన్ని ఈ దేశంలో రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. వ్యవసాయ పంటలకు విలువ జోడించే ప్రయత్నాలు చేసుకోవాలి. ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పడం కోసం స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ అని శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అనుమతులిచ్చిందని.. దాంతో కొన్ని పరిశ్రమల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. రాబోయే రెండేళ్ల కాలంలో విస్తారంగా ఈ పరిశ్రమలొస్తాయని మంత్రి చెప్పుకొచ్చారు.
10 రకాల పైర్ల విత్తనాలు: భవిష్యత్తులో రాకెట్ టెక్నాలజీ, ఆధునికత ఎంత పెరిగినా రైతు వ్యవసాయం చేయాల్సిందే... ప్రతి మనిషి భోజనం చేయాల్సిందేని మంత్రి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విత్తన మేళాలో భాగంగా ప్రధాన ఆహార పంట వరి, మొక్కజొన్న, జొన్నసహా 10 రకాల పైర్ల విత్తనాలు విక్రయిస్తున్నారు. విత్తనాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణి, టీఎస్ సీడ్స్ సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మమంత్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
