రాష్ట్రంలో ఘనంగా ప్రారంభమైన రెండో విడత కంటి వెలుగు

author img

By

Published : Jan 19, 2023, 8:38 PM IST

Harish Rao

Kanti Velugu Second Phase in Telangana: రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఖమ్మంలో 4 రాష్ట్రాల సీఎంల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభోత్సవం జరగటంతో... క్షేత్రస్థాయిలో 16,000 పైగా కేంద్రాల్లో 1500 బృందాలు రంగంలోకి దిగాయి. కంటివెలుగు శిబిరాలను ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్సీలు.. దేశానికే ఆదర్శంగా నిలిచే కార్యక్రమంగా అభివర్ణించారు. కంటివెలుగు కార్యక్రమం.. మొదటి రోజే 1.60 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు.

రాష్ట్రంలో ఘనంగా ప్రారంభమైన రెండో విడత కంటి వెలుగు

Kanti Velugu Second Phase in Telangana: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో భాగంగా నేత్ర పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కంటివెలుగు కేంద్రాల్ని ప్రారంభించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు.. మంత్రి తలసానితో కలిసి హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని వివేకానంద కమ్యూనిటీహాల్‌లో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు.

వారి రాష్ట్రాల్లో అమలు చేస్తామనటం.. తెలంగాణకు గర్వకారణం: పరీక్షల కోసం వచ్చిన వారితో మాట్లాడిన మంత్రులు.. పలువురికి అద్దాలు పంపిణీ చేశారు. అంధత్వరహిత తెలంగాణే కంటి వెలుగు లక్ష్యమన్న హరీశ్‌రావు... రాష్ట్ర పర్యటనకు వచ్చిన ముఖ్యంత్రులు.. కంటి వెలుగు కార్యక్రమాన్ని వారి రాష్ట్రాల్లో అమలు చేస్తామనటం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ దోమల్‌గూడలోని ఏవీ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన నేత్ర వైద్యశిబిరాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పర్యవేక్షించారు.

జూబ్లీహిల్స్‌ మధురానగర్‌లో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవీతో కలిసి.. నేత్రవైద్య శిబిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల్లో కంటి వెలుగు శిబిరాలకు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లోని అంబేడ్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన నేత్రవైద్యశిబిరాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.

ఎవరూ నేత్ర సమస్యలతో బాధపడొద్దు: నిజామాబాద్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.. తానూ కంటి పరీక్షలు చేయించుకున్నారు. వరంగల్‌ జిల్లా రాయపర్తిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. రాష్ట్రంలో ఎవరూ నేత్ర సమస్యలతో బాధపడొద్దనే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. మిర్యాలగూడలోని రైతు వేదిక భవనం వద్ద నేత్ర వైద్యశిబిరం ప్రారంభోత్సవంలో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధిని కొందరు చూడలేకపోతున్నారు: రాష్ట్రంలో అభివృద్ధిని చూడలేకపోతున్న రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కంటి పరీక్షలు చేసి.. అద్దాలు ఇవ్వాల్సిన అవసరముందని గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ ఎద్దేవా చేశారు. మహబూబాబాద్‌లోని గుమ్మనూరు ప్రభుత్వ పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్న మంత్రి.. కళ్లుండి చూడలేని కొందరికి.. కేసీఆర్‌ ప్రగతి కార్యక్రమాలు కనిపించటం లేదని సత్యవతి రాఠోడ్‌ ఆరోపించారు.

కరీంనగర్‌ 42వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన నేత్రవైద్య శిబిర ప్రారంభోత్సవంలో.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు. నిర్మల్‌లోని గొల్లపేట్‌కాలనీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని.. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. పెద్దపల్లిలోని ఐటీఐ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌.. పలువురికి కళ్లద్దాలను అందజేశారు.

మొదటి రోజే 1.60 లక్షల మందికి పరీక్షల నిర్వహణ: కంటివెలుగు కార్యక్రమం మొదటి రోజే.. 1,60,471 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 72,580 మంది కాగా.. మహిళలు 87,889 మంది.. ఇతరులు ఇద్దరు ఉన్నారు. పరీక్షించిన వారిలో 37,046 మంది రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. మరో 33,210 మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవ‌స‌ర‌మ‌ని గుర్తించారు. వారికి ప్రభుత్వం ఉచితంగా కళ్లద్దాలు ఇవ్వనుంది.

"రాష్ట్రంలో ప్రతిఒక్కరికి కంటి పరీక్షలు చేయటమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం. నిన్న రాష్ట్రానికి వచ్చిన ఇతర రాష్ట్రాల సీఎంలు మన పథకాలను ప్రశంసించారు. తెలంగాణ తెచ్చిన పథకాలనే నేడు అనేక రాష్ట్రాలు, కేంద్రం అనుసరిస్తున్నాయి. తెలంగాణను పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు అనుసరించటం మనకు గర్వకారణం." -హరీశ్​రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

ఇవీ చదవండి: 8 గంటల పాటు ఎగిసిపడ్డ అగ్నికీలలు.. ఎట్టకేలకు శాంతించిన మంటలు

కేరళ లాటరీలో కనకవర్షం.. రూ.16కోట్లు గెలుచుకున్న అజ్ఞాత వ్యక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.