Sankranti Celebrations 2022: శిల్పారామంలో వైభవంగా సంక్రాంతి సంబురాలు

author img

By

Published : Jan 14, 2022, 3:24 PM IST

Updated : Jan 14, 2022, 4:16 PM IST

Sankranti Celebrations 2022: శిల్పారామంలో వైభవంగా సంక్రాంతి సంబురాలు

Sankranti Celebrations 2022: పల్లె మట్టి పరిమళ వాసనను పట్టణ వాసులకు పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిన శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. చక్కటి పల్లె వాతావరణంలో హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగురంగుల ముత్యాల ముగ్గులు.. ఇలా అన్ని పట్టణ వాసులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. సొంతూళ్లకు వెళ్లలేని వారు ఆ అనుభూతులను పొందుతూ... చిన్నాపెద్ద సహా కుటుంబసభ్యులతో వచ్చి సంక్రాంతి సంబురాలను మనసారా ఆస్వాదిస్తున్నారు.

Sankranti Celebrations 2022: శిల్పారామంలో వైభవంగా సంక్రాంతి సంబురాలు

Sankranti Celebrations 2022: హైదరాబాద్‌ మాదాపూర్‌లోని శిల్పారామంలో భోగి, సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. చిన్నాపెద్ద అందరూ కలిసి ఆనందంగా గడుపుతున్నారు. సంక్రాంతి సెలవులు రాగానే అవకాశం ఉన్నవారంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. అవకాశం లేనివారు సంక్రాంతి పండుగని ఇక్కడే జరుపుకుంటున్నారు. అటువంటి వాళ్లకు పల్లె అందాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది శిల్పారామం. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, ఎటుచూసిన మనసుకు ఉల్లాసాన్ని కల్గించే పచ్చని చెట్లు, బోటు శికారు ఇలాంటివన్నీ ఇక్కడ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలు నేటితరం పిల్లలకు తెలియవు అని.. వాటిని తెలియజేసేందుకు ఇక్కడికి వచ్చినట్లు సందర్శకులు చెబుతున్నారు. పల్లె వాతావరణం ఎలా ఉంటుంది.. అక్కడ ఏమి వృత్తుల చేసే వారు ఉంటారు అనే విషయాలు పిల్లలకు వివరిస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఇక్కడ తమ చిన్ననాటి మధుర స్మృతులు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉంటాయో.. అలాగే ఇక్కడ ఏర్పాటు చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పల్లెటూరి వాతావరణం

పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంది ఈ శిల్పారామం. సొంతూరు వెళ్లడానికి కుదరక ఇక్కడే ఉన్నాం. ఇక్కడ వాతావరణాన్ని ఆస్వాదించడానికి వచ్చాం. -సందర్శకుడు

అదే ఉద్దేశంతో..

అందరూ పండగలకు ఊరెళ్తూ ఉంటారు. ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఊరు వెళ్లలేదు. అందుకే పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఇలాంటి చెట్లు, వాతావరణం పల్లెటూళ్లలో చూస్తూ ఉంటాం. అవి అన్నీ పిల్లలకు తెలియవు. ఇవన్నీ వారికి తెలియజెప్పడానికి ఇక్కడికి వచ్చాం. -సందర్శకురాలు

నేటితరం పిల్లలకు తెలియజేయాలనే..

ప్రతి ఏడాది శిల్పారామంకు వస్తుంటామని ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంటుందని కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ కళా ప్రదర్శన చేస్తున్నామని చెబుతున్నారు. పాతకాలం నాటి కళారూపాలను నేటితరం పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో సుదూర ప్రాంతమైనా కూడా ఇక్కడికి వస్తుంటామని వారంటున్నారు. ఇక్కడికి వస్తే సొంతింటికి వచ్చినట్లే ఉంటుందని అంటున్నారు. సందర్శకులు చూపుతున్న అభిమానాన్ని మర్చిపోలేమని కళాకారుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి సంవత్సరం శిల్పారామానికి వస్తున్నాం. వచ్చి మన సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ప్రజలందరికీ కూడా హరినామ స్మరణ గురించి చెప్తాం. కరోనా నేపథ్యంలో చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ బాగుండాలి. అందులో మేముండాలి అనేదే మా ఆశ. -కళాకారుడు

ఈ కాలం పిల్లలకు సంప్రదాయాల గురించి తెలియవు. వారికి సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలి. దేవుడు అందరిని కాపాడాలని ప్రార్థిస్తున్నాం.

-కళాకారిణి

సెల్పీలు తీసుకుంటూ సరదాగా..

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు హరిదాసులు, గంగిరెద్దులతో స్వీయ చిత్రాలు తీసుకుంటూ ఉత్సాహంగా గడుపుతున్నారు. పల్లెటూరు వాతావరణాన్ని చూసి సంతోషపడుతున్నారు. తాము సొంతూళ్లకు పోలేమనే దిగులు శిల్పారామం తీర్చిందంటున్నారు. కొంతమంది హరిదాసులు గంగిరెద్దుల వద్ద నృత్యాలు చేసి ఆనందించారు.

ఇదీ చదవండి:

Last Updated :Jan 14, 2022, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.