'ఏ మొహం పెట్టుకుని వస్తారు'.. అమిత్‌షాకు రేవంత్‌ రెడ్డి 9 ప్రశ్నలు

author img

By

Published : May 14, 2022, 2:19 PM IST

revanth reddy questions to amit shah

Revanth Questions to Amit Shah: మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాడటం లేదన్న సామెత కేంద్ర ప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ ఒట్టి బూటకమని అర్థమైందన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడోసారి ఇవాళ తెలంగాణకు వస్తున్న అమిత్‌షాకు రేవంత్‌రెడ్డి తొమ్మిది ప్రశ్నలు సంధించారు.

Revanth Questions to Amit Shah: నేడు హైదరాబాద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వస్తున్న నేపథ్యంలో... టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి 9 ప్రశ్నలు సంధించారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. తెరాస, భాజపా కలిసి ఆడిన రాజకీయ డ్రామా కారణంగా గడిచిన వానాకాలం నుంచి రాష్ట్ర రైతులు తీవ్ర మానసిక క్షోభ అనుభవించారని పేర్కొన్నారు. ఎరువుల సబ్సిడీలు ఎత్తివేసి కేంద్రం.. రైతుల నెత్తిన బరువు మోపిందని రేవంత్​ ఆక్షేపించారు. బ్యాంకులను రూ. వేల కోట్లకు ముంచిన బడాబాబులు దేశాన్ని వదిలి స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే.. రైతుల రుణాలను మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

అమిత్​ షాకు రేవంత్​ రెడ్డి సూటి ప్రశ్నలు

  1. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు కాళేశ్వరం అని పేరు మార్చి.. రీ డిజైనింగ్ పేరుతో సీఎం కేసీఆర్‌ కమీషన్లు దండుకున్నారని మేము మొదటి నుంచి ఆరోపిస్తున్నాం. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెబుతారా?
  2. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస, భాజపా చీకటి ఒప్పందం చేసుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి ఆడిన రాజకీయ డ్రామా కారణంగా గడిచిన వానాకాలం నుంచి తెలంగాణ రైతులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. పదుల సంఖ్యలో రైతులు వడ్ల కుప్పలపై గుండె పగిలి చనిపోయారు. ఈ మరణాలకు బాధ్యులు మీ రెండు పార్టీలు కాదా?
  3. గత పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్యమాన్ని కించ పరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పక్షాన అప్పుడే మేం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాం. మీరు స్పందించలేదు. ఇప్పుడు తెలంగాణకు వస్తున్న సందర్భంగా మీరు ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో మీ రాకను తెలంగాణ సమాజం ఎట్లా ఆమోదిస్తుందనుకుంటున్నారు? మా ప్రజలకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేదని మీరు భావిస్తున్నారా?
  4. మీ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని లోక్‌సభ ఎన్నికల ప్రచార సందర్భంగా మీ పార్టీ అగ్రనేత రాజ్‌నాథ్‌ సింగ్ చెప్పారు. ఆ మేరకు ధర్మపురి అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ మీద రాసిచ్చారు. వీరిద్దరి మాటలు విశ్వసించిన నిజామాబాద్ ప్రజలు అర్వింద్‌ను ఎంపీగా గెలిపించారు. మూడేళ్లవుతున్నా పసుపుబోర్డు ఊసే లేదు. దీనికి మీ సమాధానం ఏమిటి? ఇది ప్రజలను మోసం చేయడం కాదా?
  5. తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ లాంటి బృహత్తర పథకాలకు కాంగ్రెస్ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం విభజన చట్ట ప్రకారం హామీ ఇచ్చింది. మీరు అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నింటికీ మంగళం పాడారు. మీకు మా ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వాలి? విభజన చట్టం హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీకి మోక్షం ఎప్పుడు?
  6. అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఉన్న రాముడి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా ‘‘రామాయణం సర్క్యూట్’’ పేరిట శ్రీ రామాయణ్ యాత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రవేశ పెట్టారు. 7,500 కి.మీ. సాగే ఈ సర్క్యూట్‌లో భద్రాద్రి రాముడికి చోటు దక్కలేదు. అయోధ్య రాముడు, భద్రాద్రి రాముడు మీ దృష్టిలో ఒక్కరు కాదా?
  7. ఒడిశాలోని నైనీ కోల్ మైన్స్ టెండర్ విషయంలో జరిగిన అవినీతిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నేను స్వయంగా కేంద్ర బొగ్గుశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను. ఈ కుంభకోణం వెనుక కేసీఆర్ కుటుంబ పాత్రపై వివరాలు సమర్పించాం. ఇంత వరకూ దీనిపై అతీగతీ లేదు. కారణం ఏమిటి? కేసీఆర్ అవినీతి విషయంలో మీరు నిజంగా అంత సీరియస్‌గా ఉంటే.. అది చేతల్లో ఎందుకు కనిపించడం లేదు?
  8. పొరుగున ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణలో రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్క దానికి కూడా జాతీయ హోదా ఇవ్వాలన్న ఆలోచన మీకు రాలేదు. మీ దుర్మార్గ చట్టాలకు తెరాస మద్దతు.. వారి అక్రమాలు అవినీతికి మీ మద్దతు.. ఇదే కాదా ఎనిమిదేళ్లుగా జరిగింది?
  9. 2014లో కాంగ్రెస్‌ అధికారం నుండి దిగిపోయే నాటికి పెట్రోల్ ధర రూ.71.41 పైసలు, డీజిల్ ధర రూ.55.49 పైసలు. గ్యాస్ సిలిండర్‌ ధర రూ.470 ఉన్నది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.119.66 పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.105.65 పైసలు. గ్యాస్ సిలిండర్ ధర రూ.1,052కి ఎగబాకాయి. ఇంతలా జనాలను పన్నులు, సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని మా తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమించాలి?’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

పై ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తెలంగాణకు ఏ మొహం పెట్టుకొని వస్తారని రేవంత్​ ప్రశ్నించారు. ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేయాలనుకునే మీ కుతంత్రం ఇక్కడ పని చేయదన్నారు.

ఇవీ చదవండి: Amithsha tour: నేడు రాష్ట్రానికి అమిత్ షా.. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు హాజరు

కార్పొరేట్లకేమో 80% రుణాలు.. యువత, రైతులకు 9 శాతమా?: భాజపా ఎంపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.