2020లో దేశ చరిత్రలోనే రికార్డు స్థాయి మరణాలు

author img

By

Published : Nov 21, 2022, 8:01 AM IST

Record Level Deaths in India in 2020

Record Level Deaths in India in 2020 : జనన, మరణాలపై జనగణన శాఖ తాజా నివేదిక విడుదల చేసింది. 2020 ఏడాదిలో దేశ చరిత్రలోనే రికార్డు స్థాయి విషాదాలు చోటుచేసుకోగా.. తెలంగాణ, ఏపీల్లోనూ మరణాల సంఖ్య గణనీయంగా ఉంది. ఇతరత్రా కారణాలూ ఉన్నా.. ప్రధానంగా కొవిడ్‌ మహమ్మారి వల్ల అధిక మరణాలు సంభవించాయని అంచనా. మరోవైపు ఇదే ఏడాది తెలుగు రాష్ట్రాలు సహా.. దేశవ్యాప్తంగా జననాలు తగ్గడం గమనార్హం.

Record Level Deaths in India in 2020 : 2020.. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య పెరిగిపోయిన సంవత్సరం. దేశ చరిత్రలోనే అత్యధికంగా 2020లో 81.15 లక్షల మరణాలు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది (2019)తో పోలిస్తే ఏకంగా 4.74 లక్షల మరణాలు అధికంగా 2020లో నమోదైనట్లు కేంద్ర జనగణన శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. ఇతరత్రా కారణాలూ ఉన్నా.. ప్రధానంగా కొవిడ్‌ మహమ్మారి వల్ల అధిక మరణాలు సంభవించాయని అంచనా. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ ఏడాది 45 ఏళ్లు పైబడిన వారు కూడా గణనీయంగానే అసువులు బాయడం విషాదం. ఇదే ఏడాది తెలుగు రాష్ట్రాలు సహా.. దేశవ్యాప్తంగా జననాలు తగ్గడం గమనార్హం.

దేశంలో 2019లో నమోదైన జననాలు 2,48,20,886. 2020లో అంతకంటే 5,98,442 తగ్గి 2,42,22,444 మంది శిశువులు పుట్టారు. ఈ లెక్కలన్నీ పక్కాగా జననం లేదా మరణం సంభవించిన 21 రోజుల్లోగా గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్‌ కార్యాలయంలో నమోదు చేయించినవే. తెలంగాణ, ఏపీల్లో ఈ నమోదు కార్యక్రమం సరిగా జరగడం లేదని కేంద్రం తాజాగా వెల్లడించింది.

జననాల్లో బాలురే అధికం..: దేశంలో మొత్తం 2.42 కోట్లకు పైగా నమోదైన జననాల్లో 52 శాతం బాలురుంటే మిగిలిన 48 శాతం మాత్రమే అమ్మాయిలు. కేంద్రపాలిత ప్రాంతాలు/ రాష్ట్రాల్లో చూస్తే.. దేశంలోకెల్లా అత్యధికంగా వెయ్యి మంది బాలురకు లద్దాఖ్‌లో 1104 మంది బాలికలు, అరుణాచల్‌ప్రదేశ్‌లో 1011 మంది ఉన్నారు. మరే రాష్ట్రంలోనూ వెయ్యి మంది బాలురకు వెయ్యి మంది బాలికలు లేరు. అరుణాచల్‌ప్రదేశ్‌ తరువాత అత్యధికంగా త్రిపురలో మాత్రమే 974 మంది బాలికలున్నారంటే లింగనిష్పత్తి ఏ స్థాయిలో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో ప్రతి వెయ్యి మంది బాలురకు 939 మంది, తెలంగాణలో 937 మంది మాత్రమే బాలికలు ఉండడం గమనార్హం.

ఆసుపత్రుల్లో మరణాలు 28 శాతం..: దేశంలో మొత్తం మరణాల్లో కేవలం 28 శాతం మాత్రమే వైద్యం అందించే ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. మరో 45 శాతం మంది మరణించే సమయంలో ఎలాంటి వైద్య సదుపాయం లేదు. మొత్తం జననాల్లో 73 శాతం ఆసుపత్రుల్లో, మరో 6.5 శాతం నర్సులు లేదా వైద్యుల సమక్షంలో జరిగాయి.

తగ్గిన నమోదు..: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వల్ల 2020లో జనన, మరణాల నమోదు చాలా తక్కువగా ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి తెలిపాయి. మున్సిపాలిటీల్లో సబ్‌రిజిస్ట్రార్లు, గణాంక సిబ్బంది కొరత కూడా మరో ప్రధాన కారణం. గ్రామ పంచాయతీల్లో పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నందున కూడా జనన, మరణాల నమోదు సరిగా లేదు. జిల్లాస్థాయిలో పనిచేసే గణాంక సిబ్బంది వివరాల సేకరణకు క్షేత్రపర్యటనలకు వెళ్తే రవాణాభత్యం ఇవ్వడానికి బడ్జెట్‌ కేటాయింపులు సరిగా లేవని కేంద్రం వెల్లడించింది.

* తెలంగాణ, ఏపీల కంటే వెనకబడిన కొన్ని రాష్ట్రాల్లో బాలికల సంఖ్య అధికంగా ఉండడం గమనార్హం. వెయ్యి మంది బాలురకు బాలికల సంఖ్య బిహార్‌లో 964, ఒడిశాలో 941, రాజస్థాన్‌లో 952, ఝార్ఖండ్‌లో 948 ఛత్తీస్‌గఢ్‌లో 940.

వయసుల వారీగా విశ్లేషిస్తే తెలంగాణలో మొత్తం 2,03,127 మంది 65 నుంచి 69 ఏళ్ల మధ్య వయసున్న వారు 39 శాతం ఉన్నారు. ఆ తరువాత స్థానంలో 70 ఏళ్లకు పైబడిన వారు మృతుల్లో అత్యధికంగా.. 21 శాతం ఉన్నారు.

మృతుల్లో మహిళల కంటే పురుషులు అధికం

* ఏపీలో మొత్తం 4,54,851 మంది మృతుల్లో 70 ఏళ్లు పైబడిన వారే అత్యధికంగా 38 శాతం ఉన్నారు. తరువాత స్థానంలో 55-64 ఏళ్ల వారు 19 శాతం మంది ఉన్నారు. 45-54 మధ్య వయసు వారు కూడా 14 శాతం మంది అసువులు బాయడం గమనార్హం. తెలంగాణలో ఈ వయోవర్గం వారు 9 శాతం మంది మరణించారు.

* తెలంగాణలోని పట్టణాల్లో పురుషులు 54,503 మంది, మహిళలు 42,050 మంది మృతి చెందగా.. గ్రామాల్లో 61,001 మంది పురుషులు, 45,573 మంది మహిళలు తుదిశ్వాస వదిలారు.

* ఏపీలోని పట్టణాల్లో 98,345 మంది పురుషులు, 61,080 మంది మహిళలు కన్నుమూశారు. గ్రామీణంలో 1,75,408 పురుషులు, 1,20,167 మంది మహిళలు మృతిచెందారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.